ఆదిపురుష్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


ఆదిపురుష్ సినిమా  టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు రోజుకు 6 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రభాస్‌, కృతిసనన్ కీలక పాత్రల్లో నటించిన, దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన ‘ఆదిపురుష్‌’ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అగ్ర హీరోల సినిమాలకు మొదటి వారం టికెట్‌ ధరలను పెంచుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదిపురుష్ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనల ప్రకారం.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో టికెట్‌పై రూ. 50 పెంచుకోవచ్చు. మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఇతర లైసెన్సింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆదిపురుష్‌ మూవీకి ఆరో షోకూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటల నుంచి ‘ఆదిపురుష్‌’ను థియేటర్‌లలో ప్రదర్శించవచ్చు. తెలవారకముందే.. ఆదిపురుష్ సందడి మొదలు కానుంది. తెలంగాణలో బుధవారం నుంచి ‘ఆదిపురుష్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్‌ ధర రూ. 175గా ఉంది. తొలి మూడు రోజులు ఈ సినిమాకు అదనంగా రూ. 50 చెల్లించాలి. ఇక 3డీ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో గ్లాస్‌లకు ఆ మేరకు అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. మల్టీప్లెక్స్‌లలో రూ. 295 + 3డీ గ్లాస్‌ల ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ టికెట ధర రూ. 50 వరకు పెంచుకునేందుకు అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆదిపురుష్ నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీల నుంచి వంశీ, వివేక్ కూచిభొట్ల సోమవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: