ఏళ్లుగా ఉన్న భూ సమస్యకు పరిష్కారం,,,బాధితుడి కొడుకు దృష్టిలో హీరోగా మారిన కలెక్టర్

సమాజంలో హీరోగా గుర్తింపు తెచ్చుకొని అభిమానం పొందాలంటే సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. ఫైటింగ్‌లు, ఛేజింగ్‌లు, హీరోయిన్లను కాపాడే సీన్లతో పని లేదు. ప్రజలకు ఉపయోపడే మంచి పనులు చేస్తే చాలు. ప్రభుత్వ అధికారులు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తే.. ప్రజల దృష్టిలో వారే హీరోలుగా నిలుస్తారు. అలా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. హీరోలుగా నిలిచిన వారెందరో. తాజాగా.. ఓ కలెక్టర్ వ్యక్తి భూ సమస్యను తీర్చి బాధితుడి కుమారుడి దృష్టిలో హీరోగా మారాడు. అ చిన్నారి కలెక్టర్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరిని ఆలోచిస్తున్నారా..! ఆయన మరెవరో కాదు.. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దమ్మపేట మండలం జమేదార్ బంజర్‌కు చెందిన కుంజా వెంకటేశ్వర్లుకు ఓ భూ సమస్య ఉంది. చాలా ఏళ్లుగా అది పెండింగ్‌లో ఉన్నా.. సమస్య పరిష్కారం కాలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొంతకాలం క్రితం జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. అతడి సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.. ఆర్డీవో, ఎమ్మార్వోలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్య తర్వలో పరిష్కారం అవుతుందని వెంకటేశ్వర్లుకు చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.

ఆరోజు అక్కడే ఉన్న వెంకటేశ్వర్లు కుమారుడు హర్షనందన్.. కలెక్టర్ చేసిన పనికి ఫ్యాన్ అయిపోయాడు. తనను మరోసారి కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలని కోరాడు. కుమారుడి కోరిక మేరకు.. సోమవారం వెంకటేశ్వర్లు తన కుమారుడిని కలెక్టరేట్‌కు తీసుకొచ్చి ప్రజావాణి సమావేశంలో కలెక్టర్‌ను కలిశారు. సమస్య పరిష్కాం చేసినందుకు తన కుమారుడు మిమ్మల్ని ప్రత్యేకంగా కలవాలని వచ్చాడని కలెక్టర్‌కు తండ్రి వివరించాడు. కలెక్టర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన హర్షనందన్.. ఆయనతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత కలెక్టర్‌తో ఓ ఫోటో దిగాడు. ఈ ఘటన సోమవారం జరిగిన ప్రజావాణిలో హైలెట్‌గా నిలవగా.. సత్వరమే సమస్యను పరిష్కరించిన కలెక్టర్ పసివాడి హృదయంలో హీరోగా మారాడు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: