ఏపీలో కరెంట్ గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

జోగులాంబ గద్వాల జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవనం, ఎస్పీ భవనం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడితే.. రాష్ట్రం మొత్తం అందకారం అవుతుందని గత పాలకులు భయపెట్టారని చెప్పుకొచ్చారు. కానీ... రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా.. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.. గద్వాల నుంచి 20 కిలో మీటర్ల దూరంలోనే తుంగభద్ర బ్రిడ్జ్ ఉందని, ఆ బ్రిడ్జ్ దాటితే ఆంధ్రప్రదేశ్ ఉంటుదని కేసీఆర్ తెలిపారు. బ్రిడ్జ్‌కు ఇటువైపు 24 గంటల కరెంట్ ఉంటే.. బ్రిడ్జ్ దాటి చూస్తే మాత్రం కరెంట్ పరిస్థితి మరోలా ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. గద్వాలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గ‌ట్టు ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ పూర్తయితే గ‌ద్వాల వ‌జ్రపు తున‌కగా మారుతుందని కేసీఆర్ తెలిపారు. నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను తొందర్లోనే పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. మరోవైపు.. గద్వాలలో ఉన్న పంచాయితీల అభివృద్ధికి 10 లక్షలు, మండల కేంద్రాలకు 15 లక్షలు, గద్వాల మున్సిపాలిటీకి 50 కోట్లు, మిగతా మూడు మున్సిపాలిటీలకు 25 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను మంజూరు చేశారు కేసీఆర్.

మరోవైపు.. ఈ ఉమ్మడి పాల‌మూరు జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరికి ఇద్దరూ తెలంగాణ ఉద్యమ‌కారులే అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ గౌడ్ టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉంటే.. నిరంజ‌న్ రెడ్డి ఫీల్డ్ మీద‌ ఉండేవారని గుర్తుచేసిన కేసీఆర్.. ఉద్యోగాన్ని లెక్క చేయ‌కుండా ఉద్యమం చేశారన్నారు. పాల‌మూరు జిల్లా ఐదు జిల్లాలుగా చేసుకున్నామని.. ఇప్పుడు ఐదు మెడిక‌ల్ కాలేజీలు కూడా వ‌చ్చాయని చెప్పుకొచ్చారు.

క‌ల్వకుర్తి ఎత్తిపోత‌ల‌, నెట్టెంపాడు, కోయిల్‌సాగ‌ర్, బీమా అన్నింటిని పూర్తి చేసుకుని 15 నుంచి 24 ల‌క్షల ఎక‌రాల‌కు సాగు నీరు ఇచ్చుకుంటున్నామని తెలిపారు. పాల‌మూరు జిల్లాలో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోందని చెప్పుకొచ్చారు కేసీఆర్. గ‌తంలో బ‌తుకు లేక వ‌ల‌స‌పోతే.. ఇప్పుడు క‌ర్నూల్, రాయిచూర్ నుంచి పాలమూరుకు వ‌ల‌స వ‌స్తున్నారంటే.. అదే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు కేసీఆర్.

ఇదిలా ఉంటే.. నిన్ననే మంత్రి హరీశ్ రావు కూడా మరోసారి ఏపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు నేతల వల్లే ఏపీ బొొక్క బోర్లా పడిందని.. చెప్పుకొచ్చారు. ఏపీ నేతలది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ది మాత్రం చేతల ప్రభుత్వం అని కొనియాడారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: