కాపులకు మేం రిజర్వేషన్ ఇస్తే...దానిని జగన్ రద్దు చేశాడు


చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, కానీ జగన్ అధికారంలోకి రాగానే 5 శాతం రిజర్వేషన్ ను రద్దు చేశారని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు నేడు రాజమండ్రిలో సమావేశం జరపడంపై చినరాజప్ప విమర్శనాస్త్రాలు సంధించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కమిషన్ వేయడానికి రూ.40 లక్షల ఖర్చును బొత్స, అంబటి సమకూర్చలేకపోయారని, నేడు కాపు కార్పొరేషన్ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు.  

"వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేయనున్నట్లు జగన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. 2.35 లక్షల మహిళలకు సుమారు రూ.354 కోట్లు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో కోటిన్నర మంది కాపు జనాభా ఉన్నట్లు పేర్కొన్న జగన్ రెడ్డి... కాపు నేస్తం పథకాన్ని మాత్రం 2.35 లక్షల మందికి మాత్రమే పరిమితం చేసి కాపు మహిళలను వంచించారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి కాపులకు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కాపులకు రిజర్వేషన్‌ అంశాన్ని పార్లమెంటు సాక్షిగా  మోదీని ప్రశ్నించాల్సి వస్తుందన్న భయంతో వైసీపీ ఎంపీలు దొంగ రాజీనామాలు చేశారు. జగన్మోహన్‌ రెడ్డి కాపు రిజర్వేషన్‌ కేంద్రం పరిధిలోనిదంటూ చేతులెత్తేసి.. అధికారంలోకి వచ్చీ రాగానే.. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను కూడా రద్దు చేశారు.

ఇచ్చిన రిజర్వేషన్‌ను ఎత్తేసి.. కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ అబద్ధాలు చెబుతూ కాపు సామాజిక వర్గం మొత్తాన్ని మోసం చేస్తున్నారు. అసలు కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ను ఎత్తివేయడానికి ఇంత వరకు స్పష్టమైన కారణాన్ని చెప్పకుండా.. రిజర్వేషన్‌ కల్పించడాన్నే తప్పుబట్టడం కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేయడమే" అని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వివరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: