బియ్యం కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులపై,,,

పౌర సరఫరాలశాఖ దృష్టి 

క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశం


పౌరసరఫరాల శాఖా కమీషనర్ కోన శశిధర్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

బియ్యం కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులపై పౌర సరఫరాలశాఖ దృష్టి పెట్టింది. అట్టి వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసింది. కార్డుల్ని రద్దు చేయడంతోపాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంబంధిత ఉద్యోగుల జాబితాలను మండలాల వారీగా ఆయా తహసీల్దార్లకు పంపింది. రాష్ట్రంలో 1.49 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులున్నాయి. ప్రతి నెలా కొత్త కార్డులు జారీ చేస్తున్నా ఇప్పటికే కార్డులున్న వారిలో నిజంగా ఎంతమంది అర్హులనే విషయమై పౌర సరఫరాలశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి (నాని)  వెంకటేశ్వరరావు
 
ఇందులో భాగంగానే మొత్తం 90వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులున్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12వేలు, చిత్తూరు జిల్లాలో 11వేల మందికి పైగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రేషన్‌ తీసుకుంటున్నారు.  వీరిలో ఏలూరులో 754, తాడేపల్లిగూడెంలో 429 కుటుంబాలున్నాయి. మిగిలిన మండలాల్లోనూ 100 నుంచి 400 వరకు కార్డులున్నాయి. ఇలాగే ప్రతి జిల్లాలోనూ 6వేల నుంచి 9వేల వరకు కుటుంబాలు నిబంధనలకు విరుద్ధంగా కార్డులు కొనసాగించుకుంటున్నారు. రేషన్‌ కార్డుల జారీ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదనే నిబంధన ఉంటుంది. అయితే రాష్ట్రంలో గుర్తించిన 90వేలకు పైగా కార్డుల్లో ఇటీవల గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారి కుటుంబాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత పెరిగిన వారి సంవత్సర ఆదాయం దృష్ట్యా కార్డును వెంటనే సరెండర్‌ చేయాలి.  దీనికి సంబంధించిన పత్రాలనూ పౌర సరఫరాలశాఖ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం కల్పించింది.  వీరితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేసే మరికొందరు బియ్యం కార్డు ప్రయోజనాలను పొందుతున్నారు. తొలిదశలో బియ్యం కార్డులున్న ఉద్యోగుల వివరాల ఆధారంగా విచారణ చేయనున్నారు. అనంతరం వారికి నోటీసులు ఇచ్చి చర్యలు ప్రారంభించాలనే ఆలోచన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని కూడా రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత తహసీల్దార్లకు సూచించారు.  తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేయడం, మరో కార్డులో చేరడం ద్వారా క్రిమినల్‌ చర్యలకూ అర్హులనే నిబంధననూ ప్రస్తావించారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: