హై కోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నాం
కళా వెంకట్రావు అరెస్ట్ అప్రజాస్వామిక చర్య
ఈ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి భయపడుతోందా
లేక ఎన్నికలు అంటేనే భయపడుతోందా?
ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య
టీడీపీ బెనర్లు, జెండాలు తొలగించే స్థాయికి దిగజారిన ప్రభుత్వం
టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ
(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఎంతైనా అవసరమని, స్థానిక సంస్థలకు ఎన్నికలను యధాతధంగా నిర్వహించడానికి హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ మేరకు ఆయనకు గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలని, అందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు పెట్టాలని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కరోనా తీవ్రత లేని సమయంలో ఎన్నికల నిర్వహణకు ఎందుకు భయపడుతోంది ప్రశించారు. ఈ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి భయపడుతోందా? లేక ఎన్నికలు అంటేనే భయపడుతోందా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, బలహీన వర్గాల వ్యతిరేక విధానాల వల్ల, ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతకు ఈ ప్రభుత్వం భయపడుతోంది అని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించడం తగదన్నారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను తక్షణమే రద్దు చేయాలన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు, సీఎంకు, సంబంధం ఏమిటి.. ఎన్నికలకు అడ్డుపడడం తగదన్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఎన్నికల సంఘాన్ని నియంత్రించే అధికారం ఎవరికి లేదన్నారు. ఎన్నికలకు వ్యతిరేకంగా అధికారులు, తన పార్టీ నాయకులతో ప్రకటనలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనలు ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగబద్దంగా జరుగుతున్న ఎన్నికలకు పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు. గ్రామ వికాసానికి అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.
టీడీపీ మాజీ అధ్యక్షులు, సౌమ్యులు, వివాద రహితుడైన కళా వెంకట్రావు గారి అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అని, ఈ ప్రభుత్వం అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏమిటని, పోలీసులు సైతం వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని మండిపడ్డారు. రామతీర్థం ఘటనకు బాధ్యులను అరెస్ట్ చేయలేక, ఆ ప్రాంతాన్ని సందర్శించిన కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల మీద దాడులు ఆపకపోతే, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకోవడం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పిరికిపంద చర్య అని విమర్శించారు. ఎక్కడిక్కడి గృహ నిర్బంధాలు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదని అర్ధమవుతుంది అని ఆయన ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. టిడిపి తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకి అడుగడుగునా అడ్డంకులు కల్పించిన సర్కారు చివరికి టిడిపి జెండాలు, బేనర్లు తొలగించే స్థాయికి దిగజారిపోయిందని డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు.
Post A Comment:
0 comments: