వినూత్న ఆలోచనతో సేవకు శ్రీకారం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందేశాత్మక నిర్ణయం
నూతన సంవత్సరానికి..బొకేలు,శాలువాలు వద్దు
ఆ డబ్బుతో పేద విద్యార్థులకు..నోట్ బుక్స్.. స్టేషనరీ ఇవ్వండి
అంగన్ వాడి పిల్లలకు మ్యాట్ లు ఇవ్వండి
మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో పాఠశాలలను దత్తత తీసుకోండి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
సేవ చేయాలని తపన సహసోపేతమైన.. సందేశాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అదే తరహా నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు, శాలువలు తీసుకురావొద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసారు.ఇతర నేతలను, అధికారులను కలువటానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. అలాంటి వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాటి స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడి పిల్లలకు మ్యాట్లు,చిన్న వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వాటిని అందించాలని కోరారు.
రానున్న నూతన సంవత్సరము 2023 సందర్భంగా అందరూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని,అమలు చేయాలని కోరారు.నూతన సంవత్సరంతో పాటుగా జన్మదినాల సందర్భంగా ఇలాంటి సమాజ హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద,మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరారు.ప్రజలు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలుకలన్నారు..నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని కోరారు.
Post A Comment:
0 comments: