డిసెంబర్ 2022

 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... 

హెచ్చరిక జారీచేసిన గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య హెచ్చరికలు జారీ చేశారు. వివరాలలోకి వెళ్తే గడివేముల మండల పరిధిలో డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా, ఆనందంగా, తల్లిదండ్రుల మధ్యన జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రహదారులపై నూతన సంవత్సర కేకులను కట్ చేసుకోవడం,బాణసంచా కానీ విపరీత శబ్దాలతో కూడిన వాహనాలను నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలు చేపట్ట రాదని రాత్రి పది గంటల నుండి సెక్షన్ 30 అమలులో ఉంటుందని,


రాత్రి సమయంలో పోలీసులు పర్యవేక్షిస్తుంటారని,రాత్రి సమయంలో గ్రామంలో పిల్లలను తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని,రాత్రి సమయంలో అనుకోని ప్రమాద సంఘటనలు జరుగుతే నూతన సంవత్సరం విషాదంగా మిగులుతుందని అలా జరగకుండా ఉండాలంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవాలని గడివేముల ఎస్ఐ బిటి. వెంకటసుబ్బయ్య తెలిపారు.

 అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

1.13కేజీల బంగారు,5.75 లక్షల నగదు,రెండు కార్లు స్వాధీనం

బనగానపల్లె సిఐ, ఎస్సైలను ప్రశంసించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

కర్నూల్, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 2021 వ సంవత్సరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాకు బనగానపల్లె  పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళితే...నంద్యాల జిల్లాబనగానపల్లె పోలీస్ సర్కిల్ పరిధిలోని అవుకు మండల కేంద్రంలో  అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లె సర్కిల్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తూ ప్రజల కంటికి నిద్రలేకుండా 


 దొంగలు హల్ చల్ చేస్తుండడంతో  సవాలుగా తీసుకున్న బనగానపల్లె సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బనగానపల్లె, అవుకు ఎస్సైలు 3 టీంలుగా ఏర్పడి శుక్రవారం ఉదయం అవుకు సమీపంలోని ఉప్పాలపాడు ఆర్చి వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న గుత్తి కొండ పవన్ కుమార్(కార్తిక్), వేముల శివశంకర్(రాజు), తలారి మారెన్న  అనే అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్దనుంచి నాలుగు జిల్లాలో 19 వివిధ దొంగతనాల్లో దోచుకున్న  రూ.50.85 లక్షల విలువగల 1.13 కేజీల బంగారు ఆభరణాలను, రూ.5.75 లక్షల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.


2022 జనవరి నెల నుంచి ఇప్పటివరకు వారు రాష్ట్రంలో జరిగిన పలు దొంగతనాలకు పాల్పడడినట్లు మీడియాకు తెలిపారు.అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన బనగానపల్లె సిఐ సుబ్బారాయుడు, అవుకు ఎస్సై జగదేశ్వర రెడ్డి, బనగానపల్లె, అవుకు పోలీస్ సిబ్బంది జిలానీ బాష,, ప్రసాద్, సుబ్బరామకృష్ణ, ప్రవీణ్ కుమార్, హోంగార్డు రఫీలను ఎస్పీ రఘువీర్ రెడ్డి అభినందించి ప్రశంసాపత్రాలను అందచేశారు.

 పర్యావరణ, నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి చేయూత నిచ్చేలా..

నూతన సంవత్సర వేడుకలు జరుపుకొందాం

రెడ్ క్రాస్,...జన విజ్ఞానవేదిక పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను "మొక్కలతో,పుస్తకాలతో జరుపుకుందాం" అనే పోస్టర్లను నంద్యాల జిల్లాకలెక్టర్,ఎస్పీ,ఎంపీ, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మనజీర్ జిలాని సామాన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ"నూతన సంవత్సర వేడుకలను మొక్కలతో,పుస్తకాలతో జరుపుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ మరియు జన విజ్ఞాన వేదిక వారి విజ్ఞప్తి మేరకు జిల్లా అధికారులు,నాయకులు మాట్లాడుతూ


నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసే అభిమానులు, సంబంధిత అధికారులు, శ్రేయోభిలాషులు అందరూ పూల బొకేలు కాకుండా మొక్కలు తీసుకుని వచ్చి నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు చేసినట్లు అవుతుందని, నిరుపేద విద్యార్థులకు విద్యాసామాగ్రి అయిన పుస్తకాలు,పెన్ను,పెన్సిల్, విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించే లైబ్రరీ పుస్తకాలు లాంటివి తీసుకువచ్చి శుభాకాంక్షలు తెలుపుకోవాలని,రెడ్ క్రాస్ మరియు జన విజ్ఞాన వేదిక సభ్యుల ద్వారా వీటిని సేకరించి విద్యాశాఖ వారి సహకారంతో నిరుపేద పిల్లలు చదివే స్కూళ్లలో, హాస్టల్లో వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని, మిత్రులు,అభిమానులు పుస్తకాలు,మొక్కల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి, వైస్ చైర్మన్ మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు,ఉస్మాన్ భాష,మద్దిలేటి, తెలకపల్లి చైతన్య డిఎస్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.

 ఓమ్మిక్రాన్ వేరియంట్ బిఎఫ్ 7 తో అప్రమత్తంగా ఉండండి

గడివేముల మండల ప్రభుత్వ వైద్యాధికారిని జబీన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ప్రజలందరూ ఓమిక్రాన్ వేరియంట్ బిఎఫ్ 7 తో అప్రమత్తంగా ఉండాలని గడివేముల మండల ప్రభుత్వ వైద్యాధికారిని జబీన్ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో గుజరాత్ రాష్ట్రంలో రెండు, ఒడిస్సా రాష్ట్రంలో రెండు కేసులు నమోదుకావడంతో  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఓమిక్రమ్ వేరియంట్ బిఎఫ్ సెవెన్ తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన నేపథ్యంలో మండలంలో ప్రభుత్వ వైద్యశాలలో కరోనా టెస్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు.బిఎఫ్ సెవెన్ వేరియంట్ లక్షణాలు ముక్కులలో నీరు కరడం, గొంతు నొప్పి,జ్వరం,దగ్గు అలసట,వాంతులు,


విరోచనాలు,కండరాల నొప్పులు వంటి లక్షణాలు కలిగి ఉంటుందని, దీర్ఘకాలిక వైద్య సమస్యలు,ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నవారు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఉచితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, చేతులను సబ్బుతో కడుక్కోవడం,శానిటైజర్లు వాడడం,మాస్కులు ధరించడం,సామాజిక దూరం పాటించడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఓమికాన్ వేరియంట్ బిఎఫ్ 7 బారిన పడకుండా ఉంటారని గడివేముల మండల ప్రభుత్వ వైద్యాధికారిని జబిన్ తెలియజేశారు.

 నవనంది యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి 

ఆర్ ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి ఆకుమల్ల శ్రీధర్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక బనగానపల్లే పట్టణంలోని శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్  కళాశాలలో రెవన్యూషనరీ స్టూడెంట్ యూనియన్(ఆర్ ఎస్ యు) నంద్యాల జిల్లా మొదటి మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుమల్ల శ్రీధర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో నవనంది యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని,పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో ఇవ్వడంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలపై నూతన సంవత్సరం ముందే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నాయకులు భీమేష్ మరియు లెక్చరర్స్ శ్రీకాంత్, సుధాకర్,రవికుమార్ పాల్గొన్నారు.


 ఏపీ మోడల్ స్కూల్ లో ట్యాబులను పంపిణీ చేసిన..

గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్ నందు మండలంలో  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత ట్యాబులను జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు నేడు,అమ్మ ఒడి వంటి ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన జగనన్న నేడు అత్యంత ఖరీదైన నాణ్యమైన బైజుస్ యాప్ కలిగిన ట్యాబులను అందించారని,


ఈ ట్యాబ్లను విద్యార్థులు సద్వినియోగపరచుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.అనంతరం గడివేముల మండల ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న గ్రామీణ విద్యార్థిని,విద్యార్థులు సాంకేతిక పరంగా నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రివర్యులు విద్యార్థులకు ఉచిత ట్యాబ్ లను అందించారని, ట్యాబ్లలో ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, ఇతరులతో రిపేర్లు చేయించరాదని,విద్యకు మాత్రమే ట్యాబ్ లను ఉపయోగించాలని, విద్యార్థులు ఎంత సమయము విద్యకు ఉపయోగిస్తున్నారో రాష్ట్ర కార్యాలయానికి సమాచారం వెళ్లే విధంగా యాప్  రూపొందించారని తెలిపారు.

అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 450 మంది విద్యార్థిని,విద్యార్థులకు మరియు 8వ తరగతి బోధిస్తున్న 48 మంది ఉపాధ్యాయులకు  ట్యాబులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ , ఈఓఆర్డి  అబ్దుల్ ఖాలిక్ భాష,ఎమ్మార్వో శ్రీనివాసులు,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి శైలజ,వైసీపీ నాయకులు, శేఖర్ రెడ్డి,బాల చిన్ని, మండలంలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

 అక్రమంగా మట్టిని తవ్వి తరలించే వారిపై చర్యలు తీసుకోవాలి 

ఆర్విఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామ పంచాయతీ లోని కొమ్ము చెరువు ప్రాంతంలో కొండలను. చెరువులను. వాగులను. వంకలను కొంతమంది వ్యక్తులు అక్రమంగా మట్టిని కొల్లగొడుతున్నారని ఓర్వకల్పం ఎమ్మార్వో శివప్రసాద్ రెడ్డికు  రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలో  కాల్వ గ్రామ పంచాయతీలోని కొమ్మ చెరువు ప్రాంతంలో నల్ల మట్టిని, ఎర్ర మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తూ అక్రమార్జన అడ్డాగా మార్చారని, కొంతకాలంగా అక్రమార్కులు వెంచర్లకు, ఇటుక బట్టీలకు, ప్రైవేటు వ్యక్తులకు రాత్రి పూట మట్టిని అక్రమంగా తరలిస్తు అధిక మొత్తంలో వసుళ్ళు చేసుకుంటున్నారని, గతంలో కర్నూలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారు 1200 క్యూబిక్స్ మీటర్స్ వరకు అనుమతి ఇచ్చారని,


అనుమతులకు మించి తవ్వకాలు జెరిపి రాత్రి సమయాలలో మాత్రమే చేస్తున్నారని, చెరువు తూమును కాదని 20 అడుగుల లోతుకు త్రవ్వడం జరిగిందని, అక్రమ తవ్వకాలవల్ల రైతులకు పంటకు సాగునీరు,త్రాగునీరు పంట పొలాలకు నిటిని తరలించడానికి వీలు లేకుండా పోయిందని, ఇలాగే త్రవ్వకాలు కొనసాగితే ప్రజలకు,శ్రీ కొమ్మచెరువు ఆంజనేయస్వామి గుడికి త్రాగటానికి చుక్క నీరు కూడా దొరకదని, అక్రమార్కల చేతి నుండి అక్రమంగా తరలిస్తున్న అక్రమ మట్టిని నిలిపివేయాలని,మట్టి తవ్వకాలు జరపకుండా నోటీసులు జారీ చేయాలని అలాగే ప్రభుత్వ ఆస్తులను ప్రకృతిని కాపాడాలని, ఓర్వకల్లు ఎమ్మార్వో శివ ప్రసాద్ రెడ్డికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. జానో జాగో న్యూస్ ప్రతినిధి ఎమ్మార్వో ను వివరణ కోరగా ఓర్వకల్లు ఎమ్మార్వో శివప్రసాద్ రెడ్డి తక్షణమే అక్రమ త్రవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు(అర్విఎఫ్)జిల్లా అధ్యక్షుడు బాలరాజు (ఎఐవైఎల్) జిల్లా అధ్యక్షుడు రాజు(అర్ వైయూ)జిల్లా అధ్యక్షుడు విక్రమ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

 తినండీ ప్రశ్నించకండీ అంటున్న..

టూరిస్ట్ హోటల్ లైసెన్స్ రద్దుచేసి, హోటల్ ను సీజ్ చేయండి

జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన....యువజన, విద్యార్ధి, ప్రజా సంఘాల నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని టూరిస్ట్ హోటల్లో ఇడ్లీ-సాంబార్ లో పడిన బల్లి సంఘటనలో కస్టమర్లకు ఇంత నిర్లక్ష్యంగా వడ్డించడం ఏమని అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే బల్లే కదా పడింది పిల్లి కాదు కదా అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ,మీ ధర్నాలు చాలా చూశాం.ఒకరోజు లేదా రెండు రోజులు చేస్తారని ఆ తర్వాత శరామాములేనని ఎవరైతే మాకేంటీ.! ఎవరు ఏం చేస్తారు,


ఎవరికి ముడుపులు ఇవ్వాలో ఇవ్వాల్సింది వారికిచ్చాం. మమ్మల్ని ఎవరేం చేస్తారని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని నేతలు రామినేని రాజునాయుడు , ధనుంజయుడు , జయరాజు , శివకృష్ణ యాదవ్ , రవీంద్ర నాయక్ , ఎర్రిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలోని టూరిస్ట్ హోటల్ కు వత్తాసు పలుకుతూ హోటల్ ఇండ్లీ - సాంబారు పడిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకుండా టూరిస్ట్ యూజమాన్య హోటల్ కు వత్తాసు పలుకుతూ కేవలం పది రోజులు మాత్రమే రద్దు చేసి ఆ హోటల్ యాజమాన్యం ఇచ్చిన ముడుపులు తీసుకుని వారికి వత్తాసు పలుకుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు శేఖర్ రెడ్డి కుర్మా నాయకులు అన్వర్ బేగ్ లను వెంటనే సస్పెండ్ చేసి,నంద్యాల టూరిస్ట్ హోటల్ లైసెన్స్ రద్దు చేసి , యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ యువజన , విద్యార్థి , ప్రజా సంఘాల ఆధ్వరంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నేతలు రామినేని రాజునాయుడు , ధనుంజయుడు , జయరాజు , పెరుగు శివకృష్ణ యాదవ్, రవీంద్ర నాయక్, ఎర్రిస్వామి మాట్లాడుతూ తక్షణమే టూరిస్ట్ హోటల్ గుర్తింపును రద్దు చేయాలని, లేకపోతే శనివారం రోజున టూరిస్ట్ హోటల్ ఎదుట నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు.

 కేజీబీవీ సిబ్బంది జీతాలను వెంటనే చెల్లించాలి

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు యాదవ్ విజ్ఞప్తి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ఏ) ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న సిబ్బందికి నవంబరు నెల జీతాలు అందలేదనీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీలో దాదాపు 2,600 మంది పని చేస్తున్నారనీ,ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోతే వారి జీవన గమ్యం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లకు జీతాలను డిసెంబరు నెల ముగుస్తున్నా,నవంబరు నెల జీతాలు అందలేదనీ, ఎస్ఎస్ఎ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు రూ.70 కోట్ల రూపాయలను జిల్లాలకు పంపించామని రాష్ట్ర అధికారులు చెబుతున్నా సిబ్బందికి మాత్రం జీతాలు అందడం లేదనీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రతి నెల వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని  చెబుతున్నారనీ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వక పోతే వారు సమాజంలో ఎలా జీవిస్తారని,రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరారు,ప్రతి నెల ఒకటవ తేదీ వేతనాలు ఇవ్వాలని, ఖాళీ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని, విద్యుత్ శాఖ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

2023 సంవత్సరానికి కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పెండింగులో ఉన్న ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు యాదవ్ విజ్ఞప్తి చేశారు.

 ఎనిమిదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు...

ఉచిత టాబ్ లు పంపిణీ చేసిన... నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణంలో, నందికొట్కూరు నియోజకవర్గ స్థాయిలో వున్న అన్ని మండలాల లోని 8వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ట్యాబులను నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు సాంకేతికమైన నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన బైజూస్ యాప్ లతో కూడిన ఉచిత ట్యాబ్ లను పంపిణీ చేయడం జరిగిందని


ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోని, ఉన్నతమైన సాంకేతికపరమైన విద్యను నేర్చుకోవాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాములపాడు గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మ,పాములపాడు మండల తహసిల్దార్ రత్న రాధిక,మండల ఇన్చార్జి అభివృద్ధి అధికారి  సుమిత్రమ్మ,మండల విద్యాధికారి బాలాజీ నాయక్, కొత్తపల్లి ఎంఈఓ శ్రీరాములు, పగిడ్యాల ఎంఈఓ సుభాన్, మిడుతూరు ఎంఈఓ మౌలాలి,నందికొట్కూరు ఎంఈఓ ఫైజున్నీస, జూపాడు బంగ్లా మండల ఇంచార్జ్ ఎంఈఓ, పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీంద్ర,మండల జడ్పిటిసి సభ్యులు రామలింగేశ్వర రెడ్డి,

వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మండల కో ఆప్టెడ్ మెంబర్ ముర్తుజ అలీ,ఎంపీటీసీ నల్లమల్ల రమాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, శేక్షావలి, ఇస్కాల గ్రామ సర్పంచ్ మౌలాలి, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వరప్రసాదరావు, రిటైర్డ్ హెడ్మాస్టర్ కృష్ణుడు, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు,, విద్యార్థిని,విద్యార్థులు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

 మంత్రాల చెరువు సుందరీకరణ పనులను..

పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును సందర్శించి సుందరికరణ పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సుమారు1 కోటి 80 లక్షల రూపాయలతో చేపడుతున్న పలు పనులను అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేసారు.  త్వరితగతిన పనులు పూర్తి చేసి చందనం చెరువులాగా ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు. వీరితో పాటు కార్పోరేటర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.





 అర్హత లేని నకీలీ ఆర్.ఎం.పి క్లీనిక్ లు, మెడికల్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలి

ఆర్ వి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని  హుశేనాపురంలో గ్రామంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు,ప్రజా సంఘాల నాయకులు గ్రామాలలో ఆర్ఎంపీ వైద్యులు ప్రజలను నిట్టనిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా అల్ ఇండియా యూత్ లిగ్ జిల్లా అధ్యక్షుడు రాజు.రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్ర నాథ్ రాయలసీమ యూత్ యునీయన్ (అర్ వై యు) జిల్లా అధ్యక్షుడు విక్రమ్ లు మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రైవేట్ అర్ ఎం పి.ల క్లినిక్ లకు వెళితే ప్రజలకు రక్త పరీక్ష ల్యాబ్ లలో టెస్టులు చేయించుకు రావాలని పొంతనలేని వైద్య పరీక్షలు రాసి ప్రజల వద్దనుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఓర్వకల్లు మండలంలోని మెడికల్ దుకాణాదారులు ఇష్టానుసారంగా టాబ్లెట్లు విక్రయిస్తున్నారని,మెడికల్ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆర్ఎంపీ మరియు, మెడికల్ దుకాణ దారుల వద్ద నుండి ముడుపులు అందుకొని ఆర్ఎంపీలపై, మెడికల్ దుకాణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టానుసారంగా ఆర్థిక దోపిడీకి తెర లేపి ఆర్థిక దోపిడీకి పేద ప్రజలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల శ్రేయస్సు కోరి అనారోగ్యంతో వస్తున్న పేద,మధ్యతరగతి ప్రజలకు తక్కువ వ్యయంతో మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ  ఆసుపత్రిలులో ఎమ్ ఆర్ ఐ,స్కానింగ్ సెంటర్లను, రక్త పరీక్ష ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని,వైఎస్ఆర్  ఆరోగ్య శ్రీ పథకాన్ని దుర్వినియోగం కాకుండా అమలు చేసి వివిధ పేర్లతో వసూలు చేస్తున్న ఆర్.ఎం.పి మరియు మెడికల్ దుకాణదారుల ఆర్ధిక దోపిడీ అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.మెడికల్ ఆర్థిక దోపిడికి వ్యతిరేఖంగా త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్ధి , యువజన , ప్రజాస్వామ్య సంఘాలు , ప్రజలు సమావేశంలో పాల్గొంటున్నట్లు ఆర్విఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజు. విష్ణు తదితరులు పాల్గొన్నారు.

 అన్ని చెరువులను సుందరీకరిస్తాం

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రోబోటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను ప్రారంభించిన మంత్రి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

హెచ్ ఎం డి ఏ పరిధిలో ఎఫ్టిఎల్ ను గుర్తించి, అన్ని చెరువులను సుందరికరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన (సంద) చెరువు లో గుర్రపు డెక్క మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసే విహంతరి రోబోటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... యువ శాస్త్రవేత్తగా ఒక యువకుడు  సోలార్ సహాయంతో రిమోట్ కంట్రోల్ తో పనిచేసే నూతన యంత్రాన్ని కనుగొనడంతో,


తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం లభిస్తుండటంతో నూతన ఆవిష్కరణకు ప్రోత్సాహకంగా ఉంటుందని ప్రత్యేకంగా తెప్పించినట్లు మంత్రి తెలిపారు. నగరంలోని దుర్గం చెరువు గతంలో ఎట్లా ఉండేది ప్రస్తుతం  ఎట్లా ఉందొ చూడాలని,దశలవారీగా నియోజకవర్గములోని అన్ని చెరువుల్లో గుర్రెపు డెక్క,చెత్త తొలిగించి సుందరికరిస్తాం అన్నారు. మురికినీరు చెరువులోకి రాకుండా  23 కోట్లతో ముందుగా ట్రంక్ లైన్ పనులు చేపట్టినట్లు,అన్ని చెరువుల్లో ఇదే విధంగా వర్షం నీరు,డ్రైనేజీ  నీరు ప్రత్యేకంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో పూడికతీత తీయటంతో  నేడు వాటిలో జలకళ వచిందన్నారు.

పట్టణాల్లో కూడా ఇదే విధంగా చెరువుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు నాడు-నేడు వచ్చిన మార్పును గమనించాలని అందరూ కలిసి బాధ్యత గా చెరువులను  కాపాడుకోవాలని,పరిశుభ్రంగా ఉంచాలన్నారు.వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసుకొని చెరువులను పరిరక్షించుకోవలన్నారు. చెరువుల బాగు కోసం మంచి పనులు చేపడుతుంటే,నిత్యం వందలాది మంది చెరువుల చెంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సెదదిరటం,పోటీ పరీక్షల అభ్యర్థులు కసరత్తులు, ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తుండటంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేయడం శోచనీయమన్నారు.

కొత్త సంవత్సరం లో ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్దామని,బొకేలు,శాలువాల స్థానంలో విద్యార్థులకు, అంగన్ వాడి పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు... రానున్న నూతన సంవత్సరం 2023 సందర్భంగా అందరికి ముందస్తుగా శుభాకాంక్షలు తెల్పిన మంత్రి తనతో పాటు ఎవరిని కలువటానికి వెళ్లిన బొకేలు, శాలువల స్థానంలో నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, మ్యాట్లు, పెన్నులు, పెన్సిళ్లు, తదితర వాటిని విద్యార్థులకు అందజేయాలని కోరారు.

అదేవిధంగా గ్రామాల్లో, వార్డులలో గల పాఠశాలలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కార్పోరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


 వక్స్ బోర్డు భూములను కాపాడండి

ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎండి యూనస్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ముస్లిం హక్కుల పోరాట సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. ఎస్ఎండి యూనుస్ మాట్లాడుతూ వక్స్ బోర్డు భూములను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నంద్యాలలో అన్యకాంతమైన  ( వక్ఫ్ భూమి) 73.ఎకరాలు రైతు నగరం దగ్గర ఉన్న భూమిలో ముస్లిం సోదరులు ఈదుగా మరియుస్మశాన వాటిక కోసం 5. ఎకరాలు  అడగడం జరిగిందనీ, అధికారులకు చెప్పి సంవత్సర కాలమవుతున్నా ఇంతవరకు స్పందన లేకపోవడం సూచనీయమని,  ఆంద్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా నంద్యాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఈషాక్ భాష ఆఫీస్ లో అడగడం జరిగిందనీ,ముస్లింల    వక్ఫ్ బోర్డు లో ఉన్న ఆస్తులు అడుగుతున్నామనీ, ముస్లింల ఆస్తులను అప్పనంగా దార దత్తం చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తుందని,ఇప్పటికైనా ముస్లిం వర్క్స్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం స్వాధీన పరుచుకొని నిరుపేద ముస్లింల కు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందిగా ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. ఎస్ఎండి యూనుస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పింఛన్లకు మంగళం పాడుతున్న రాష్ట్రప్రభుత్వం  

సిపిఐ(యంయల్)ఆర్ఐ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు మండలంలోనీ పార్టీ కార్యాలయంలో సిపిఐ(యం ఎల్) జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ మాట్లాడుతూ ‌‌రాష్ట్రంలో అధికారంలో వున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులకు,వింతంతులకు, వికలాంగులకు, మరియు అవ్వాతాతలకు పింఛన్లు పెంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం,ఇప్పుడు అడ్డగోలుగా ఆంక్షలు విధిస్తూ పింఛన్లకు మంగళం పాడుతున్నారని, పేదల నోటికాడి అన్నం ముద్దను లగేసుకుంటూన్నారని,  సిపిఐ (యంయల్) ఆర్ ఐ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ మండిపడ్డారు. ఒక్కచాన్సు ఇవ్వండి మీ బ్రతుకులు మార్చడానికి నేను వున్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంక్షలను తీసుకువచ్చి మూడో కంటికి కూడా కనపడని ఆంక్షలతో అవ్వా...తాతలకు వికలాంగులకు వింతంతులకు భారి కోత విధిస్తూ ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమనీ ఎద్దేవా చేశారు.జగన్ మోహన్ రెడ్డి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు విద్యుత్ మీటర్లు ఉన్నాయనే సాకు చూపుతూ 2.5 లక్షల మంది పేద ప్రజల పింఛన్లకు మంగళం పాడడం ఎంతవరకు సమంజసం అని,త్వరలో జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యం ఎల్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పునరావాసం కల్పించండి

 ని గ్రామ 

 (జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గని గ్రామ ప్రజలు పునరావాసం కల్పించాలని నంద్యాల జిల్లా ఆర్డీవో గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గని గ్రామంలో భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ గని గ్రామంలోని మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయామని,2014 సంవత్సరంలో గని గ్రామంలో ఏర్పడిన మెగా సోలార్ పవర్ ప్రాజెక్టులో 390మంది రైతుల భూములు కోల్పోవడం జరిగిందనీ,అందుకు నష్టపరిహారంగా 13-07-2018 తారీకున 62 మంది రైతులకు మాత్రమే పునరావాసం ఇవ్వడం జరిగిందనీ,


భూములు కోల్పోయిన సోలార్ బాధితులకు గత ఆరు  సంవత్సరాల నుండి పునరావాసం కల్పించలేదనీ,గని సోలార్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పునరావాసం కల్పించి న్యాయం చేయాలని నంద్యాల ఆర్డీవో గారికి వినతిపత్రం అందజేశారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఖుర్ఆన్ పిలుస్తోంది...!

జిహాద్.. అంటే ఎదుటి మతం వారిని హింసించడమా?

ఇస్లామ్ మహిళలను అణచివేస్తోంది

తలాక్ .. తలాక్..తలాక్...

ముస్లిమ్ మహిళలు ధరించే హిజాబ్ ఆదేశం ఖుర్ఆన్ లో అసలు ఉందా? లేదా,,?

నిత్యం వార్తల్లో ఇస్లామ్ పై ఏదో ఒక అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. మీడియాలో వచ్చేదే ప్రజలు నిజమనుకుంటారు కూడా. ప్రజల్లో ఇస్లామో ఫోబియా వేగంగా ప్రబలుతోంది. ఇస్లామ్ సాహిత్యాన్ని చదివితేనే ఇస్లామ్ పై ఉన్న అనుమానాలు, అపోహలు నివృత్తి అవుతాయి. అవన్నీ నిక్షిప్తమై ఉన్న ఎన్నో పుస్తకాలు హైదరాబాద్ బుక్ ఫెయిర్ స్టాల్ నెంబరు 156లో కొలువుదీరి ఉన్నాయి. 

ఇస్లామ్ పై అపోహలు అపార్థాలను తొలగించేందుకు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు గత నాలుగు దశాబ్దాలుగా సాహిత్య కృషిచేస్తోంది. ఉర్దూలో ఉన్న ఇస్లామ్ సాహిత్యాన్ని తెలుగులో ప్రచురించి తెలుగు విభిన్న వర్గాలకు వారధిగా నిలుస్తోంది. ట్రస్టు ప్రచురిస్తున్న ప్రచురణలకు అంతకంతకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. ఎక్కడ పుస్తక ప్రదర్శనలు, బుక్ ఫెయిర్ లు జరిగినా తెలుగు ఇస్లామిక్ బుక్ స్టాల్ తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలుగు ఇస్లామిక్ ప్రచురణల సంచాలకులు సలీమ్ అహ్మద్ ఖాన్ అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగులో ఖుర్ఆన్, ఇతర ఇస్లామిక్ పుస్తకాల అమ్మకాలు జోరందకున్నాయి. స్టాల్ నెంబరు 156లో 300కు పైగా శీర్షికలు అందుబాటులో ఉన్నాయి. 


ఇస్లామ్ ధర్మం శాంతి, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని, మంచిని పెంచి, చెడును తుంచేలా ఖుర్ఆన్ బోధనలున్నాయని ఈ స్టాల్ లో లభించే ప్రతీ పుస్తకం సాక్ష్యమిస్తుంది. అతి తక్కువ ధరలో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక పుస్తకాలే కాకుండా సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో జాడ్యాలకు ఖుర్ఆన్ సూచించే పరిష్కారాలతో కూడిన గ్రంథాలు అందుబాటులో ఉంచారు. వడ్డీ కీడు, ఇస్లామ్ లో మద్య నిషేధం, ఇస్లామ్ లో మహిళలు, ఇస్లామియ పరిభాషలో జిహాద్ అనే పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇటీవలె కాలంలో ముహమ్మద్ ప్రవక్తపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన వాస్తవ జీవితాన్ని అధ్యయనం చేసేందుకు చాలామంది ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పుస్తకాలను ఎక్కువుగా కొంటున్నారు. 


నమాజు ఎలా చదవాలి,,,?

ఇస్లామ్ పై ఎంతగా విమర్శలు వస్తున్నాయో? అంతే ఎక్కువుగా ఇస్లామ్ విశ్వాసాలు, సంప్రదాయాలపై అధ్యయనం జరుగుతుందన్నది పలు సర్వేలు చెబుతున్నాయ్. నమాజు చదివే పద్ధతి గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రమజాన్ లో ముస్లిములు పాటించే రోజా (ఉపవాసాల) గురించి కూడా పుస్తకాలు అడుగుతున్నారని సేల్స్ మేనేజర్ యాసీన్ తెలిపారు. పిల్లలకోసం నీతి కథల పుస్తకాలూ ఉన్నాయి. మహిళలు ఎక్కువుగా హిజాబ్, పరదా పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. 


 

రచయిత-ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076

 వినూత్న ఆలోచనతో సేవకు శ్రీకారం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందేశాత్మక నిర్ణయం

నూతన సంవత్సరానికి..బొకేలు,శాలువాలు వద్దు

ఆ డబ్బుతో పేద విద్యార్థులకు..నోట్ బుక్స్.. స్టేషనరీ ఇవ్వండి

అంగన్ వాడి పిల్లలకు మ్యాట్ లు ఇవ్వండి

మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో పాఠశాలలను దత్తత తీసుకోండి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

సేవ చేయాలని తపన సహసోపేతమైన.. సందేశాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అదే తరహా నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు, శాలువలు తీసుకురావొద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసారు.ఇతర నేతలను, అధికారులను కలువటానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. అలాంటి వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాటి స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడి పిల్లలకు మ్యాట్లు,చిన్న వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వాటిని అందించాలని కోరారు.

రానున్న నూతన సంవత్సరము 2023 సందర్భంగా అందరూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని,అమలు చేయాలని కోరారు.నూతన సంవత్సరంతో పాటుగా జన్మదినాల సందర్భంగా ఇలాంటి సమాజ హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద,మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరారు.ప్రజలు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలుకలన్నారు..నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని కోరారు.

 అయ్యప్ప స్వామి మహా పడిపూజలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రత్యేక పూజల నిర్వహణ

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడిపల్లి గ్రామం వార్డ్ నెంబర్ 12 లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మామిడిపల్లి శ్రీశ్రీశ్రీ బాల మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం లో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ. యాతం పవన్ యాదవ్ , కన్నె స్వామి కార్పొరేటర్ శివ కుమార్,  మహేశ్వర నియోజకవర్గ ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, గురుస్వాములు మద్ది జగదీశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.