యాగంటిలో 3 కోట్ల వ్యయంతో కళ్యాణమండపం
నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని యాగంటి క్షేత్రంలో రూ 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టీటీడీ నిర్మించనున్న కల్యాణ మండపానికి టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన యాగంటిలో రూ 3 కోట్లతో కల్యాణ మండపం నిర్మిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్ళ క్రితం నిర్మించిన కల్యాణ మండపాలు చాలా ఏళ్ళుగా మరమ్మత్తులకు నోచుకోలేదని ఆయన చెప్పారు. అవసరమైన కల్యాణ మండపాలకు మరమ్మతులు చేయించాలని తమ పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు.
ఇందులో భాగంగానే నంద్యాల లోనీ కల్యాణ మండపాన్ని పునర్నిర్మించడానికి చర్యలు చేపట్టామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి తమ పాలక మండలి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందని సుబ్బారెడ్డి తెలిపారు.రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎంపి బ్రహ్మానందరెడ్డి, శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ కుమార్,ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి, విజివో మనోహర్, శ్వేత డైరెక్టర్ ప్రశాంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: