నెల్లూరు జిల్లాలో కలపడంపై....హైకోర్టులో ప్రకాశం జిల్లా వాసుల పిటిషన్


కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో నెలకొన్న వివాదం కాస్త హైకోర్టుకు చేరింది. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. మొత్తం 26 జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమైంది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఈ జిల్లాల విభజన వేడి తగ్గలేదు. మొన్నటి వరకు ప్రకాశం జిల్లాలో కొనసాగిన తమను నెల్లూరు జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాలను నెల్లూరు జిల్లాలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ లింగసముద్రం మండలం విశ్వనాథపురంకు చెందిన నాగేశ్వరరావు, ఉన్నం వీరాస్వామిలు పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రకాశం, నెల్లూరు జిల్లా కలెక్టర్లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిటిషన్‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు. తమ మండలాలను నెల్లూరు జిల్లాలో విలీనం చేయడంతో ఇబ్బందులుపడుతున్నామన్నారు. దీనిపై తాము అభ్యంతరాలను చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కందుకూరు నుంచి ఒంగోలు చాలా దగ్గరని.. అదే నెల్లూరు అయితే చాలా దూరమని వివరించారు. ఈ ఐదు మండలాల నుంచి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లాలంటే 45 నుంచి 75 కి.మీ దూరం మాత్రమే ఉంటుందన్నారు. అదే తాము నెల్లూరుకు వెళ్లాలంటే 111 నుంచి 135 కి.మీ ఉందన్నారు.

ఈ కారణాలను పట్టించుకోకుండా విలీన ప్రక్రియ పూర్తి చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కందుకూరు టౌన్‌కు రామతీర్థం జలాశయం నుంచి మంచి నీరు వస్తుందని.. అది ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం పరిధిలో పనిచేస్తుందని గుర్తు చేశారు. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపితే మంచి నీరు అందించే విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మండలాల విలీనాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. పైన తెలిపిన అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: