మార్చి 2022

విన్నారా ఈ వాహనం ప్రత్యేకత


వాహనాలు ఎన్నోరకాలు ఉంటాయి. కానీ ఈ వింత వాహ‍నం లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వాహన ప్రియులకు హమ్మర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇదొక భారీ వాహనం. చూడ్డానికి సైనిక వాహనంలా కనిపిస్తుంది. అది నిజమే... ప్రస్తుత హమ్మర్ కు మాతృక ఓ సైనిక వాహనమే. గతంలో ఏఎమ్ జనరల్ అనే ఆటోమొబైల్ సంస్థ అమెరికా సైన్యం కోసం హమ్వీ వాహనాలు రూపొందించేంది. ఆ హమ్వీని మరింత ఆధునికీకరించి హమ్మర్ కు రూపకల్పన చేశారు. తదనంతర కాలంలో ఏమ్ జనరల్ నుంచి హమ్మర్ బ్రాండ్ ను మరో ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ సొంతం చేసుకుంది. హమ్మర్ లో హెచ్1, హెచ్2, హెచ్2 మోడళ్లను తీసుకువచ్చింది. ఇదిలావుంటే సాధారణ హమ్మర్ కంటే భిన్నంగా అత్యంత భారీతనం ఉట్టిపడే జెయింట్ హమ్మర్ ను తయారుచేశారు. దీన్ని హమ్మర్ హెచ్1 ఎక్స్3గా పిలుస్తారు. దీని ఎత్తు 22 అడుగులు అంటే ఆలోచించండి... ఎంత ఎత్తుగా ఉంటుందో! మామూలు హమ్మర్ హెచ్1 కంటే ఇది మూడింతలు పెద్దది. దీంట్లోనే ఓ బెడ్రూం, టాయిలెట్ కూడా ఏర్పాటు చేశారు. దీని పొడవు 14 మీటర్లు కాగా, వెడల్పు 6 మీటర్లు. దీన్ని ఎక్కాలంటే నిచ్చెన కావాల్సిందే! ఇటీవలే హమ్మర్ హెచ్1 ఎక్స్3 యూఏఈ రోడ్డుపై దర్శనమిచ్చింది. రెయిన్ బో షేక్ (షేక్ హమాద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్) అనే ఓ అరబ్ కుబేరుడు దీన్ని సొంతం చేసుకున్నారు. ఈయన వద్ద ప్రపంచంలో ఎవరి వద్ద లేనన్ని ఆల్ వీల్ డ్రైవ్ కార్లు ఉన్నాయి. సాధారణంగా ఏ కారుకైనా ఒకటే ఇంజిన్ ఉంటుంది. కానీ ఈ భారీ హమ్మర్ లో 4 ఇంజిన్లు ఉండడం విశేషం. ఈ ఆల్ వీల్ డ్రైవ్ హమ్మర్ లో ప్రతి టైరుకు ఒక డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు.

 

 టెట్ కు టీఎస్ ప్రభుత్వం నోటిఫకేషన్


టీచర్ పోస్టుల కోసం వేచివున్న నిరుద్యోగులకు శుభవార్తం. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం తెలిసిందే. తెలంగాణలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణకు విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైనట్టు తెలుస్తోంది. కాగా, టెట్ పూర్తయితే టీచర్ నియామకాల ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

 గెలిచినా, ఓడినా ఖ‌మ్మం ఆడ‌బిడ్డ‌గానే ఉంటా: రేణుకా చౌదరి


గెలిచినా, ఓడినా తాను ఖ‌మ్మం ఆడ‌బిడ్డ‌గానే ఉంటాన‌ని కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత‌గా పేరున్న మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి త‌న పార్టీ స్టామినా గురించి ఓ డైలాగ్ వ‌దిలారు. కాంగ్రెస్ పార్టీ అంటే సామాన్యం కాద‌న్న ఆమె.. కాంగ్రెస్ పార్టీ అంటే ఫైర్ అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. వెర‌సి అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప‌లోని ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌ను ఆమె వల్లె వేశారు. త‌న పార్టీ గొప్ప‌త‌నాన్ని చెబుతూనే.. టీఆర్ఎస్‌, బీజేపీల‌పై విమ‌ర్శ‌లు సంధించారు. గ‌త కొంత‌కాలంగా సైలెంట్‌గా ఉన్న రేణుకా చౌద‌రి.. తాను ఎక్క‌డికీ పోలేద‌ని గురువారం వ్యాఖ్యానించారు. నివురు గ‌ప్పిన నిప్పులా కాచుకుని కూర్చున్నానంటూ ఆమె అన్నారు. గ్రూపు రాజ‌కీయాలు వ‌ద్ద‌న్న భావ‌న‌తోనే సైలెంట్‌గా ఉన్నాన‌ని చెప్పిన ఆమె.. త‌న‌కంటే బెట‌ర్‌గా ప‌నిచేస్తారేమోన‌ని వెయిట్ చేశాన‌ని చెప్పారు. గెలుపు కోసం జిల్లాలు మార్చే నేత‌లు ఉన్నార‌న్న రేణుక‌.. గెలిచినా, ఓడినా తాను ఖ‌మ్మం ఆడ‌బిడ్డ‌గానే ఉంటాన‌ని తెలిపారు. త‌న‌కు ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని, కార్య‌క‌ర్త‌ల మ‌నోభీష్టానికి అనుగుణంగానే న‌డుచుకుంటాన‌న్నారు. త‌న‌కు రాజకీయ వారసులు లేరని చెప్పిన రేణుక‌.. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని, అది ఎక్కడికి పోదని చెప్పారు. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ జిల్లాగా పేర్కొన్న ఆమె.. తిరుగుబాటు వచ్చేది ఖమ్మం నుంచేన‌ని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఆమె మంత్రి పువ్వాడ అజయ్‌కి తాను భ‌య‌ప‌డ‌బోన‌ని తెలిపారు దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టేన‌ని చెప్పిన రేణుక‌.. న‌రేంద్ర మోదీవి కేవలం మాటలు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్య‌క‌ర్త‌లపై ఉంద‌ని, పార్టీ కార్యకర్తలు ఉక్రెయిన్ సైనికుల్లా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

 పుతిన్..ఏమాత్రం కనికరం లేని వ్యక్తి


ఏమాత్రం కనికరం లేని వ్యక్తి అని పుతిన్ సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ పై దండయాత్ర నిర్ణయం మాత్రమే కాదు, గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఎంతో దూకుడైనవి. క్రిమియాను కలిపేసుకోవడం, సిరియాలో తిరుగుబాటు దళాలను చావుదెబ్బ తీయడం వాటిలో కొన్ని. తన అసాధారణ నిర్ణయాలతో ప్రపంచ రాజకీయ పరిశీలకులను నిశ్చేష్టకు గురిచేయడం పుతిన్ కు అలవాటుగా మారింది. ఇదిలావుంటే పుతిన్ ప్రతి మాటను, చర్యను, హావభావాలను నిశితంగా అధ్యయనం చేసిన సైకాలజీ నిపుణులు ఆయన మనస్తత్వంపై ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.  ఏమాత్రం కనికరం లేని వ్యక్తి అని సైకాలజిస్టులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈసారి కూడా ఉక్రెయిన్ నాటోలో చేరకుండా అడ్డుకోవడం కోసం రష్యా శక్తిని మరోసారి చాటిచెప్పేందుకు నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయడ్డారు. ఉక్రెయిన్ ను నియో నాజీల నుంచి విముక్తి కల్పించడం కోసం అనే సాకుతో తీవ్ర దాడులకు తెరదీశాడని వివరించారు. ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరి 24న సైనిక చర్య ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్ ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నారు. స్టాలిన్ తర్వాత అత్యంత సుదీర్ఘకాలం రష్యాను పాలించింది పుతినే. వాస్తవానికి పుతిన్ ప్రస్తుత పదవీకాలం 2024తో ముగియనుంది. కానీ, రాజ్యాంగాన్నే మార్చివేసి, జీవితకాలం తానే అధ్యక్షుడిగా కొనసాగేందుకు పుతిన్ మార్గం సుగమం చేసుకున్నారు. తద్వారా రష్యాలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు.  ఇలాంటి చర్యలు పుతిన్ కు కొత్త కాదు. పుతిన్ ను తరచుగా సద్దామ్ హుస్సేన్, ముమార్ గడాఫీ, అడాల్ఫ్ హిట్లర్ లతో పోల్చడం తెలిసిందే. దీనిపై సైకాలజిస్టులు స్పందిస్తూ, అందుకు కారణం ఉందని వెల్లడించారు. "పుతిన్ తాను అనుకున్నది కార్యరూపం దాల్చేంత వరకు ఎంతదాకా అయినా వెళతారు. ఈ క్రమంలో ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపరు. పుతిన్ కు బలమైన లక్ష్యం ఉంది" అని అమెరికా ప్రభుత్వ ప్రాంతీయ మాజీ వైద్యాధికారి, సైకాలజీ ఎక్స్ పర్ట్ కెన్నెత్ డెక్లెవా పేర్కొన్నారు.  "1991 ప్రచ్ఛన్న యుద్ధానంతరం జరిగిన పరిణామాలను పుతిన్ ఏమాత్రం అంగీకరించని వ్యక్తి. అందుకే ప్రచ్ఛన్నయుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులను మళ్లీ సృష్టించాలనుకుంటున్నారు. పుతిన్ క్రూరస్వభావం కొత్తేమీ కాదు. ఎదుటి వ్యక్తి కంటే తాను బలహీనుడ్ని అనే భావనను పుతిన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేరు. అందుకే పుతిన్ ను బలహీనుడిగా చూడడమో, పుతిన్ పై దాడులకు దిగడమో, వేధించడమో చేయరాదని చెబుతాను. ఒకవేళ అలా చేస్తే పుతిన్ లోని ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఉంటుంది. అది దారుణమైన పర్యవసానాలకు దారితీస్తుంది" అని డెక్లెవా విశ్లేషించారు. జేవియర్ ఉర్రా అనే ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ స్పందిస్తూ... పుతిన్ సరీసృపాల (పాములు, బల్లులు) తరహా వ్యక్తిత్వం కలవాడని, అతడి మనస్తత్వాన్ని ప్రతిబింబించేందుకు ఈ పోలిక సరైనదని పేర్కొన్నారు. "పుతిన్ తనకు నచ్చిందే చేస్తారు. ఎదుటి వాళ్ల గురించి ఆలోచించరు. తనను ఎవరూ ఇష్టపడడంలేదని, ప్రజలు తనను చూసి భయపడుతున్నారని గుర్తించిన ఓ చిన్నపిల్లవాడి మనస్తత్వం వంటిదే పుతిన్ మనస్తత్వం. అందుకే పుతిన్ అప్పుడుప్పుడు వంటిపై చొక్కా లేకుండా కనిపించడమో, నచ్చిన ఆట ఆడుతూనో కనిపిస్తారు" అని జేవియర్ వివరించారు. ఇదిలావుంటే పుతిన్ బాల్యం ఏమంత సజావుగా అనిపించదు. పుతిన్ 1952లో సోవియట్ లెనిన్ గ్రాడ్ లో జన్మించారు. పుతిన్ పుట్టక ముందే ఇద్దరు తోబుట్టువులు మరణించారు. చిన్నతనంలోనే అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడేవాడని జెరూసలేమ్ పోస్ట్ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది. ఆ దూకుడు కారణంగానే పుతిన్ జూడో అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణమైందని వివరించింది.

 ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలోని అంశాలపై పెద్ద ఎత్తున్న చర్చ


ఆర్ఆర్ఆర్ సినిమాపై పెద్ద ఎత్తున్న చర్చ సాగుతుండగా అందులోని చిత్రీకరణ అంశాలపై కూడా ప్రత్యేక చర్చ సాగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆదిలో వాళ్ల దారులు వేరైనా ఆ తరువాత కలిసి ఆంగ్లేయులపై చేసే పోరాటాన్ని చూపించనున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లలో .. ఎన్టీఆర్ ఆనాటి బైక్ నడుపుతూ కనిపించిన పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఆంగ్లేయుల కాలానికి సంబంధించిన బైక్ కావడంతో, దీనిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారనే ఆశ్చర్యం చాలామందికి కలిగింది. అప్పటి మోడల్ భలేగా ఉందే అనుకున్నారు. అయితే ఆనాటి మోడల్ బైక్ కోసం రాజమౌళి చాలా ట్రై చేశారట. చివరికి ఎక్కడా లేకపోవడంతో, ఆనాటి బైకులు ఎలా ఉండేవో తెలుసుకుని ప్రత్యేకించి తయారు చేయించారట. ఈ బైక్ ను ఇలా డిజైన్ చేయించడానికి దాదాపు 20 లక్షల రూపాయల వరకూ ఖర్చు అయిందని చెబుతున్నారు. ఇలా ఆనాటి వస్తువుల కోసం భారీగానే ఖర్చు చేశారట.

 ఉద్య‌మిస్తున్న రైతుల‌ను చంపి క్ష‌మాప‌ణ చెప్పారు: నిరంజన్ రెడ్డి ఆగ్రహం


కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలావుంటే యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ యాసంగిలో తెలంగాణ‌లో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ దిశ‌గా కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. ఆ బృందానికి ఇప్ప‌టిదాకా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ గురువారం కేసీఆర్ స‌ర్కారుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. కేసీఆర్‌ది రైతు వ్య‌తిరేక ప్రభుత్వ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. పీయూష్ గోయల్ వ్యాఖ్య‌లు విన్నంత‌నే తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుప‌డ్డారు. పీయూష్ గోయల్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "కేంద్రానిది వ్యాపారాత్మ‌క ధోర‌ణి మాత్ర‌మే. ఉద్య‌మిస్తున్న రైతుల‌ను చంపి క్ష‌మాప‌ణ చెప్పారు. తెలంగాణ రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పే రోజు క‌చ్చితంగా వ‌స్తుంది. తెలంగాణ రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా మాట‌లు చెబుతారా? చిత్త‌శుద్ధి ఉంటే ప్ర‌ధాని స‌మ‌క్షంలో స‌మావేశం ఏర్పాటు చేయండి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు బంధు, నాణ్య‌మైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్య‌తిరేకుల‌మా?" అంటూ నిరంజ‌న్ రెడ్డి విరుచుకుప‌డ్డారు.

 నాగ చైతన్య సరసన..మరోసారి పూజా హెగ్డే మెరవనున్నదా


కొందరు హీరోలతో పూజా హెగ్డే కాంబినేషన్ సూపర్ అన్నట్లుగా ప్రచారముంది. తాజాగా ఆమె వరుసబెట్టి స్టార్ హీరోయిల సరసన నటిస్తోంది. ఇదిలావుంటే పూజ హెగ్డే తాజా చిత్రంగా ఆమె నుంచి ఇటీవల ' రాధే శ్యామ్' వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సందడి చేస్తుండగా, ఏప్రిల్ 13వ తేదీన 'బీస్ట్' రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె విజయ్ జోడీగా అందాల సందడి చేయనుంది. ఇక అదే నెల 29వ తేదీన 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండనుంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్న         సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఇక ఆ తరువాత సినిమాలో ఆమె నాగచైతన్య సరసన అలరించనున్నట్టు సమాచారం. తెలుగులో పూజ హెగ్డే ఫస్టు మూవీ నాగచైతన్యతోనే మొదలైంది.  'ఒక లైలా కోసం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాతనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు .. తమిళ భాషల్లో వెంకట్ ప్రభు రూపొందించనున్న సినిమాలో ఈ జంట మరోసారి కనువిందు చేయనుంది. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు స్వయంగా చెప్పడం విశేషం.

 టూర్ సక్సెస్..కేటీఆర్ ప్రయత్నం ఫలిస్తోందా


రాష్ట్రానికి పెట్టుబడులు తెప్పించేందుకు అమెరికా పయనమైన మంత్రి కేటీఆర్ ఆ దిశగా సఫలమవుతున్నారు. తెలంగాణ‌కు మ‌రిన్ని పెట్టుబడులు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి కేటీఆర్ కంపెనీల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు త‌మ కేంద్రాల‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేసే దిశ‌గా ఆయా కంపెనీల యాజ‌మాన్యాల‌ను ఒప్పించారు. అందులో భాగంగా తాజాగా గురువారం నాడు మ‌రో కీల‌క పెట్టుబ‌డిని కేటీఆర్ సాధించారు. తెలంగాణ‌లో రూ.1,000 కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు ఫిషిన్ అనే సంస్థ అంగీక‌రించింది. అంతేకాకుండా కేటీఆర్ స‌మ‌క్షంలోనే తెలంగాణ ప్ర‌భుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఫిషిన్ కంపెనీకి ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా చేప‌ల‌ను ఎగుమ‌తి చేసే సంస్థ‌గా పేరుంది. ఈ సంస్థ ప్ర‌త్యేకించి తిలాపియా చేప‌ల‌ను ఎగుమ‌తి చేస్తుంద‌ట‌. ఈ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ.1,000 కోట్ల‌ను వెచ్చించ‌నుంది. ఈ కంపెనీ ప్లాంట్ ద్వారా ఏకంగా 5 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని స‌మాచారం.

 పిల్లి తెచ్చిన తంట..ఏకంగా రూ.100 కోట్ల నష్టం


అనుకోని వింత ఘటనలతో మనం నష్టాలను చవిచూడాల్సివస్తుంది. తాజగా విద్యుత్ శాఖ‌కు రూ.100 కోట్ల న‌ష్టం తెచ్చిపెట్టిందో పిల్లి. ఈ ఘ‌ట‌న మహారాష్ట్రలోని పింప్రీ-చించ్వడ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. మహా ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు పైకి పిల్లి ఎక్కింది. దీంతో షార్ట్‌ సర్క్యూట్ సంభ‌వించింది. 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోవ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగింది. భోసారి, భోసారి ఎంఐడీసీ, అకుర్ది ప్రాంతాల్లో 60 వేల మంది వినియోగదారులకు క‌రెంటు నిలిచిపోయింది. పారిశ్రామిక ప్రాంతం భోసారిలో 7,000 మంది వ్యాపారులు విద్యుత్తు అంతరాయంతో తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింద‌ని చెబుతున్నారు. నిన్న‌టి నుంచి ఆ ప్రాంతంలో విద్యుత్ లేదు. దీనిపై విద్యుత్తుశాఖ మంత్రి వెంట‌నే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంతంలోని కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్‌ బెల్‌సారె కోరారు. అయితే, మూడు రోజులపాటు విద్యుత్తు పునరుద్ధరణకు అవకాశాలు లేవ‌ని అధికారులు అంటున్నారు. ప్ర‌స్తుతం విద్యుత్తు అందుతోన్న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు పొదుపుగా వాడాలని అధికారులు కోరారు. లేదంటూ భారమంతా సింగిల్‌ ట్రాన్స్‌ఫార్మరుపై పడుతుంద‌ని చెప్పారు.

 నిందలువేయండం...తీవ్ర మనోవేదనకు గురిచేయడమే


అర్థంపర్థంలేకుండా నిందలు వేయడం తీవ్ర మనోవేదనకు గురిచేయడమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. వైవాహిక బంధాలు ఇటీవలి కాలంలో చాలా బలహీనంగా మారుతున్నాయి. తమ జీవిత భాగస్వామిపై ఉన్న అనుమానాలు కూడా బంధాన్ని బలహీనపరుస్తున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల్లో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని రెండో వ్యక్తి ఆరోపించడం వ్యక్తిత్వంపై దాడి కిందకు వస్తుందని తెలిపింది. పేరు ప్రతిష్ఠలతో పాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని పేర్కొంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పెళ్లిని ఒక పవిత్రమైన బంధంగా పరిరక్షించాలని తెలిపింది. జీవిత భాగస్వామిపై చేసే తప్పుడు ఆరోపణలు తీవ్ర మానసిక వేదనను కలిగిస్తాయని, అందువల్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలను న్యాయస్థానాలు క్రూరమైనవిగా పరిగణించి, తగు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఓ కేసును విచారించిన సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.  కేసు వివరాల్లోకి వెళ్తే... 2014 జూన్ లో దంపతులకు వివాహమయింది. అయితే తన మామగారు తనను లైంగికంగా వేధించారంటూ భార్య క్రిమినల్ కేసు పెట్టింది. ఇది తన భార్య తన పట్ల చేసిన క్రూరమైన చర్య అంటూ భర్త కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టాడు. అన్ని ఆధారాలను పరిశీలించిన కుటుంబ కోర్టు... భర్తకు అనుకూలంగా 2019 జనవరిలో విడాకులను మంజూరు చేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో భార్య సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించిందని చెప్పింది. మామగారి మీద నిరాధారమైన ఆరోపణలను చేయడం ద్వారా... మామ, భర్త పట్ల మానసిక క్రౌర్యానికి భార్య పాల్పడిందని తెలిపింది. వారికి తీరని మనోవేదన కలిగించిన నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు సరైన నిర్ణయం తీసుకుందని చెప్పింది. తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని ఆమె అప్పీలును కొట్టేసింది.

 జైలులో తన ప్రేయసిని వివాహమాడిన జూలియన్ అసాంజే


జూలియన్ అసాంజే ఈ పేరు తెలియనివారుండరు. వికీలీక్స్ తో అప్పట్లో పెను రాజకీయ సంచలనమే సృష్టించిన జూలియన్ అసాంజే.. ఓ ఇంటివాడయ్యారు. ఇప్పటికే తన ప్రేయసితో ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆయన.. ఆమెను జైలులోనే వివాహమాడారు. వికీలీక్స్ లో భాగంగా అత్యంత రహస్యమైన ఆర్మీ సమాచారాన్ని బయటకు లీక్ చేశారన్న కేసుకు సంబంధించి ఆయన 2019 నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్ లోని బెల్మారిష్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులోనే పెళ్లి చేసుకునేందుకు అధికారులు అనుమతినివ్వడంతో తన ప్రేయసి స్టెల్లా మోరిస్ ను ఆయన.. తన పిల్లలు నలుగురు అతిథుల సమక్షంలోనే మనువాడారు. వారి పెళ్లికి ఇద్దరు సాక్షులు, ఇద్దరు గార్డులు వెంట ఉన్నారు. పెళ్లి సందర్భంగా తనకు ఆనందంగానూ..మరోవైపు బాధగానూ ఉందని స్టెల్లా అన్నారు. జూలియన్ ను మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పారు. వివాహం అనంతరం జైలు గేటు బయట ఆమె.. అసాంజే మద్దతుదారుల నడుమ కేక్ కట్ చేశారు. ప్రభుత్వాలు అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయని, క్రూరంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేసుకు సంబంధించి అమెరికా అధికారులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో అసాంజే అమెరికా నుంచి పారిపోయి వచ్చారు. వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. కొన్నాళ్లు లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఉన్నారు. ఆ క్రమంలోనే 2011లో అక్కడే పనిచేస్తున్న లాయర్ అయిన స్టెల్లాను తొలిసారి కలిశారు. 2015లో ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లాడారు. ఇదిలావుంటే ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ ట్రాడిషన్ కు సంబంధించి ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటు తనను అమెరికాకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అసాంజే పెట్టుకున్న అర్జీని బ్రిటన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది.

 వంటలు వండుతూ...కేంద్రంపై టీఆర్ఎస్ తీవ్ర నిరసన


కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను అమాంతం పెంచేసింద‌ని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేడు టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళ‌న‌ల‌కు దిగారు. ఈ నేప‌థ్యంలో సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద రోడ్డు ప‌క్క‌నే వంట‌లు వండుతూ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిర‌స‌న తెలిపారు. పెరిగిన ధ‌ర‌ల‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలని ఆమె అన్నారు. తెలంగాణ  ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత బీజేపీ సర్కార్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. దేశ‌ జీడీపీని పెంచకుండా, గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ (జీడీపీ) ధరలు పెంచుతున్నార‌ని ఆమె చుర‌క‌లంటించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పడ‌క‌ముందే పెట్రోల్ ధర లీట‌రుకి రూ.60 ఉండేదని చెప్పారు. ప్ర‌స్తుతం ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌ ధరలు పెంచింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేగాక‌, డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదని అన్నారు. కార్పొరేట్ వ్య‌క్తుల‌కు మాత్రం రూ.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింద‌ని ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్రజా ఉద్యమాలకు లొంగక తప్పదని చెప్పారు.  అనంత‌రం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని విమ‌ర్శించారు. గ్యాస్‌, డీజిల్, పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. దేశ ప్రజల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమ‌లు చేయ‌ట్లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేగాకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచేసి సామాన్యులను మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని చెప్పారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆయ‌న విమ‌ర్శించారు. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా కేంద్ర ప్ర‌భుత్వం ధ‌ర‌లు పెంచుతోంద‌ని అన్నారు.

 కంగనాకు మినహాయింపు ఇచ్చేదే లేదు: ముంబై కోర్టు స్పష్టీకరణ


కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వావలని కోరిన ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ పై ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సెలబ్రిటీనే అయినా, షూటింగ్ లలో బిజీగా ఉన్నా.. ఆమె ఒక నిందితురాలన్న విషయాన్ని మరచిపోవద్దంటూ చురకలంటించింది. బాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత జావెద్ అక్తర్.. ఆమెపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ ఆంగ్ల టీవీ చానెల్ లో కార్యక్రమం సందర్భంగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సమయంలో.. బాలీవుడ్ లో ఓ కోటరీ ఉందనీ, అందులో జావేద్ కూడా వున్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే, ఆయనపై పలు వ్యక్తిగత విమర్శలు కూడా చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జావెద్ అక్తర్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసును ముంబైలోని 10వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆర్ఆర్ ఖాన్ విచారిస్తున్నారు. పలు మార్లు విచారణకు కంగన డుమ్మా కొట్టడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటిదాకా కంగన రెండంటే రెండే సార్లు కోర్టు విచారణకు హాజరైందని, ఆమేం దేనికీ అతీతం కాదని తేల్చి చెప్పారు. కేసు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునివ్వాలన్న కంగన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. అసలు కేసు విచారణ ఎక్కడిదాకా వెళ్లిందని మినహాయింపునివ్వాలని అసహనం వ్యక్తం చేశారు.  ‘‘కేసు విచారణ మొదలైనప్పట్నుంచి కంగన రెండంటే రెండేసార్లు విచారణకు వచ్చింది. కేసు విచారణ మొదలైనప్పుడు ఒకసారి.. మరోసారి కోర్టుపై ఏకపక్ష ఆరోపణలు చేయడానికి. ఇప్పటిదాకా కోర్టుకు రాకుండా ఆమె తన నిబంధనలనే అమలు చేస్తోంది. తనకు ఇష్టమున్నప్పుడు వస్తోంది. ఇష్టమొచ్చినట్టు చేస్తోంది. ఆమెకు అసలు కోర్టుకు సహకరించాలన్న ధ్యాసే లేదు’’ అంటూ మండిపడ్డారు. ఆమెపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా విచారణకు రాకుండా ఆమె తప్పించుకు తిరుగుతోందని, కావాలనే ఆమె ఎగ్గొడుతోందని మండిపడ్డారు. మినహాయింపు కావాలంటూ అప్పుడెప్పుడో కేసు విచారణ మొదలైనప్పుడు అడిగారని, అప్పట్నుంచి ఇప్పటిదాకా వాటిపై ఆదేశాలివ్వాలంటూ మాట్లాడుతున్నారే తప్ప.. అసలు కేసు విచారణకు మాత్రం సహకరించడం లేదని మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ అన్నారు. ఇప్పటిదాకా ఆమె చేసిన విజ్ఞప్తులన్నింటికీ కోర్టు ఒప్పుకొందని, ఇకపై ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతంలో ఏనాడూ విచారణకు రాని కంగనకు ఇప్పుడు కోర్టు విచారణ హాజరుకు మినహాయింపునిస్తే ఇకపై తదుపరి విచారణల సందర్భంలో వివరాలిచ్చేందుకు అసలు రానేరాదని, కాబట్టి ఆమెకు మినహాయింపునిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 7వ తేదీకి విచారణను వాయిదా వేశారు.

 బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ కన్నుమూత


బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే మరణానికి గల అసలు కారణాన్ని మాత్రం ఆయన కుటుంబసభ్యులు వెల్లడించలేదు. 1985లో 'పాత్ భోలా' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిషేక్ 100కు పైగా సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన మరణంతో బెంగాలీ చిత్ర పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది. అభిషేక్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ ఛటర్జీ హఠాన్మరణం చెందారనే వార్త తనను కలచి వేసిందని అన్నారు. అభిషేక్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని కొనియాడారు. విలక్షణమైన నటనతో అందరినీ అలరించారని చెప్పారు. ఆయన మరణం సినీ, టీవీ రంగాలకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 మహేశ్ కోసం ఆ కథ రెఢీగా ఉంది...కానీ రాజమౌళి విని ఒకే చేయాలి


మహేశ్ బాబుతో రాజమౌళి చిత్రం తీస్తున్న నేపథ్యంలో తీయబోయే చిత్రం ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి సినిమా వర్గాల్లో నెలకొంది. రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉందనే సంగతి తెలిసిందే. ఇది మల్టీస్టారర్ కాదనీ .. 'ఆర్ ఆర్ ఆర్' కంటే పెద్ద సినిమా అని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ ప్రాజెక్టును గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా రాజమౌళికి ఫారెస్టు అంటే ఇష్టం .. ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథలంటే ఇష్టం. ప్రకృతిని .. జంతువులను ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. అందువలన చాలాకాలం నుంచే ఫారెస్టు నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. ఈ కారణంగానే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఒక కథను రెడీ చేశాను. అయితే రాజమౌళి ఒక సినిమా రిలీజ్ అయ్యేవరకూ మరో కథను వినడు. ఫారెస్టు నేపథ్యంలో కథను సిద్ధం చేస్తున్నాననే సంగతి ఆయనకి తెలుసునుగానీ, అది ఎలా ఉంటుందనేది ఆయనకి తెలియదు. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ అయిన తరువాత పది పదిహేను రోజుల తరువాత వింటాడేమో. ఆయన కథ విన్న తరువాత మార్పులు .. చేర్పులను గురించిన ఆలోచన చేస్తామని అన్నారు.

 ఉక్రెయిన్ కు అండగా బ్రిటన్...ఆయుధాలతోపాటు డబ్బు సహాయం


ఉక్రెయిన్ కు సహాయంగా బ్రిటన్ రంగ ప్రవేశం చేసింది. ఇదిలావుంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. ర‌ష్యా దాడుల‌ను తిప్పికొట్ట‌డంతో ఉక్రెయిన్ ప్ర‌ద‌ర్శిస్తోన్న ధైర్యం ప్ర‌పంచ దేశాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దీంతో ర‌ష్యా దాడుల తీవ్ర‌త‌ను పెంచ‌డంతో ఉక్రెయిన్‌కు బ్రిట‌న్ మ‌రింత సాయం ప్ర‌క‌టించింది. ఆరు వేల క్షిప‌ణులు, 25 మిలియన్‌ పౌండ్ల ఆర్థిక సాయం చేస్తామ‌ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ తెలిపారు. తాము ఉక్రెయిన్‌కు చేయ‌నున్న ఆయుధ సాయంలో మిలిటరీ హార్డ్‌వేర్‌, యాంటీ ట్యాంక్‌, ఇత‌ర భారీ ఆయుధాలు కూడా ఉన్నాయ‌ని వివ‌రించారు. అలాగే, రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు రెట్టింపు చేయాలని ఆయ‌న‌ పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ కు మ‌రింత సాయం చేయ‌డానికి తమ భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తామ‌ని చెప్పారు. ఉక్రెయిన్ లోని నగరాలను ర‌ష్యా ధ్వంసం చేస్తోంటే తాము చూస్తూ ఉండలేమని తెలిపారు. ఇక ఇప్ప‌టికే బ్రిటన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆయుధ సాయం చేసింది. ఇప్పుడు చేస్తోన్న సాయం దానికి అద‌నం. రష్యా తీరుపై చర్చించడానికి నాటో, జీ 7 దేశాలు త్వ‌ర‌లో స‌మావేశం కానున్నాయి. ఈ స‌మ‌యంలో బోరిస్ జాన్స‌న్ ఉక్రెయిన్‌కు మ‌రింత సాయం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

 ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తా: రోహిత్ శర్మ


ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించి ముంబై ఇండియన్స్ ను అంతెత్తులో నిలబెట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తాజా ఐపీఎల్ వేలంలో చాలా మంది పాత ప్లేయర్లను ఆ జట్టు వదిలేయాల్సి వచ్చింది. అందులో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఒకడు. అయితే, ఇప్పుడు జరగబోయే ఐపీఎల్ లో రోహిత్ ఎవరితో కలిసి ఓపెనింగ్ చేస్తాడన్న ఆసక్తికర ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలోనే దానికి అతడు జవాబిచ్చాడు. కచ్చితంగా తన ఓపెనింగ్ స్థానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశాడు. గతం నుంచే తాను ఓపెనింగ్ చేస్తున్నానని, ఇప్పుడు కూడా అందులో మార్పు ఉండదని తేల్చి చెప్పాడు. ఇకపై ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని రోహిత్ తెలిపాడు. ఇక టైమల్ మిల్స్, జయదేవ్ ఉనాద్కత్ లు జట్టుకే కొత్తగానీ.. ఆటకు కాదని పేర్కొన్నాడు. చాలా ఏళ్లుగా ఆడుతున్నారని, ఏం చేయాలో వారికి బాగా తెలుసని చెప్పాడు. జట్టుగా వాళ్లు ఏం చేయగలరో, ఏం చేయాలో చెప్పాల్సిన బాధ్యత కూడా తమపై ఉంటుందని చెప్పాడు. గతంలో ఇద్దరూ వేరే ఫ్రాంచైజీలకు ఆడారని, ఇప్పుడు తమకు తగ్గట్టుగా వారిని మలచుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ వివరించాడు. ఇదిలావుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీ చాలా బాగుంటుందని ముంబై హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పేర్కొన్నాడు. వికెట్ కీపర్ అయిన ఆటగాళ్లకు టాప్ 3లో బ్యాటింగ్ చేసే అవకాశం రావడం చాలా అరుదన్నాడు.

 మీకు ఆ నైతిక హక్కులేదు: అది మా అంతర్గత సమస్య


చైనాను భారతదేశం తీవ్రంగా హెచ్చరించింది. జమ్మూకశ్మీర్ తమ అంతర్గత అంశమని ... ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనాకు భారత్ మరోసారి సూచించింది. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, చైనా సహా ఏ దేశానికీ జమ్మూకశ్మీర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఎన్నడూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఈ వారంలో వాంగ్ యీ భారత్ లో పర్యటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లో లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.

 తమ ప్రణాళిక ఫలితాన్ని ఇచ్చింది: స్టిఫెన్ ఫ్లెమింగ్


తమ ప్రణాళిక ఫలితాన్ని ఇచ్చిందని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఐపీఎల్ విజేత. కానీ రెండు కొత్త జట్ల చేరికతో మెగా వేలానికి వెళ్లాల్సి వచ్చింది. ఫలితం ఎంతో కాలంగా జట్టుతో ఉన్న కొందరు కీలక ప్లేయర్లను నష్టపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫాప్ డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్ ను వేలంలో కొనుగోలు చేయలేకపోయింది. అయినా, వేలం చక్కగా కొనసాగిందని, తమ ప్రణాళిక ఫలితాన్ని ఇచ్చిందని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. సూరత్ లో సీఎస్కే జట్టు ప్రాక్టీస్ దశలో ఉంది. ఈ సందర్భంగా ఫ్లెమింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. మెగా వేలంలో సీఎస్కే మొత్తంగా 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ వేలంలో తాము ముగ్గురు చక్కటి ఆటగాళ్లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్టు స్టిఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు. తాము కీలకమైన కొందరు ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయినా.. వేలం ఫలితం పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలిపారు.  ‘‘కొందరు ఆటగాళ్లను నష్టపోయాం. దీని పట్ల కొంత బాధగా ఉంది. కానీ, అసలైన టాలెంట్ ను మేం సంపాదించాం. చక్కటి అనుభవం, యువ ఆటగాళ్ల మంచి సమతూకాన్ని పొందాం. వారు తక్కువ ధరకే మాకు సొంతం అయ్యారు. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు. డెవన్  కాన్వేకు అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. మిచెల్ శాంటనర్ మాకు స్టాల్ వార్ట్ వంటి వాడు. ఆడమ్ మిల్నే రూపంలో మంచి పేస్ లభించింది. వీరంతా మంచి నైపుణ్యం, ప్రతిభ కలిగినవారు’’అని ఫ్లెమింగ్ వివరించారు.

 మీసేవ నిర్వాహకులను కాపాడండి... 

మాపై ఎందుకంత కసి

మమ్మల్నీ ఆదుకోండి అని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మీ సేవా నిర్వాహకుల వినతి


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మీ సేవలను నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రాణం పోస్తాడని  మీ సేవా నిర్వహకులు పెట్టుకొన్న ఆశలు  గల్లంతయ్యాయి. ఇదే విషయమై మీ సేవా కేంద్ర  నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీసేవ కేంద్రాలనుంచి తొలగించిన  వన్ బి, అడంగల్, రేషన్ కార్డు సర్వీసులు, ఎలక్షన్ సర్వీసులను తిరిగి  పునరుద్ధరించాలని కోరుతూ మీసేవ నిర్వాహకులు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీసేవ నిర్వాహకులు మాట్లాడుతూ...


రాష్ట్రంలో మొత్తం పదకొండు వేల మీ సేవ కేంద్రాలున్నాయని, వాటిపై ఆధారపడి సుమారు 60 వేల కుటుంబాలు బతుకుతున్నాయని వారు పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థతో తమ జీవనోపాధి కోల్పోయామని, ఇప్పుడు ఉన్న సర్వీసులు కూడా ఒక్కోక్కటిగా తొలగిస్తూ వస్తే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆందోళనవ్యక్తంచేశారు. దయచేసి మీ సేవ కేంద్రాల నుంచి తొలగించిన సర్వీసులను  తిరిగి పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ సర్వీసులను తొలగించటం వల్ల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు బ్యాంకుల దగ్గర, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సచివాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని వారు పేర్కొన్నారు. తమ పనులు చేసుకోలేక ప్రజలు తిరిగి తమ గ్రామ సచివాలయాలకు వెళ్లే పరిస్థితి దాపురిస్తోందని వారు పేర్కొన్నారు. మీ సేవా కేంద్రాలలో సర్వీసుల తొలగింపు వల్ల సాధారణ  ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇలా నంద్యాల మీసేవ అసోసియేషన్ సభ్యులు చేసిన విన్నపం పట్ల నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

 సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదు: సంజయ్ రౌత్


కాశ్మీర్ వంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదు అని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇదిలావుంటే మొద‌ట కేవ‌లం 400 థియేట‌ర్ల‌లోనే విడుద‌లైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు ఏకంగా 4,000 థియేట‌ర్ల‌లో ఆడుతూ రికార్డుల‌ను తిర‌గ‌రాసే దిశ‌గా వెళ్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం నోటి మాట ద్వారా ఈ సినిమాకు ఎన‌లేని ప‌బ్లిసిటీ వ‌స్తోంది. ఈ సినిమాపై వివాదాలు కూడా రాజుకుంటుండ‌డంతో దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ స్పందించారు. క‌శ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని హిత‌వు ప‌లికారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ కేవలం సినిమా మాత్రమేనని అన్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని తాను అనుకోవట్లేద‌ని తెలిపారు. ఎన్నికల నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారని చెప్పారు. కాగా, ఈ సినిమాపై కొంద‌రు నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా, ఇందులో అస‌త్యాలు చూపించారంటూ మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 మ్యాచ్ మధ్యలో విషాదం...గ్యాలరీ కూలింది


పుట్ బాల్ మ్యాచ్ సాగుతుండగా స్టేడియంలో విషాదం చోటుచేసుకొంది. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చి 200 మంది గాయాల‌పాల‌య్యారు. మ్యాచ్ జ‌రుగుతుండ‌గా అక్క‌డి తాత్కాలిక‌ గ్యాల‌రీ ఒక్క‌సారిగా కూలిపోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. కేర‌ళ‌లోని మ‌లప్పురం పూంగోడ్ లో నిన్న ఫుట్‌బాల్ మ్యాచ్ పోటీలు నిర్వ‌హించారు. అందుకోసం అక్క‌డ తాత్కాలిక‌ గ్యాల‌రీ ఏర్పాటు చేశారు. అయితే, అది ఒక్క‌సారిగా కూలిపోయింది.  అది కూలిపోతోన్న స‌మ‌యంలో అక్క‌డి వారు ప‌రుగులు తీసిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. వేగంగా అది ప్రేక్ష‌కుల మీద ప‌డిపోవ‌డంతో దాదాపు 200 మందికి గాయాల‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వివ‌రించారు. తాత్కాలిక గ్యాల‌రీ కూలిపోయిన వీడియో మీడియాకు ల‌భ్య‌మైంది.

 కోహ్లీ వచ్చి నువ్వే కెప్టెన్ అనగానే చాలా షాక్ కు గురయ్యాను: రాహుల్


విరాట్ కోహ్లీ వచ్చి నువ్వే కెప్టెన్ అనగానే చాలా షాక్ కు గురయ్యాను అని క్రికెటర్ రాహుల్ పేర్కొన్నారు. టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా రాహుల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓ టెస్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు కూడా. అయితే, ఆ టెస్టు మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అతడి వెన్నుకు గాయం కారణంగా ఆ మ్యాచ్ ను అతడు ఆడలేదు. దీంతో రాహుల్ కు కెప్టెన్ గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్ లకూ అతడే కెప్టెన్ అయినా.. ఆ రెండో టెస్టు, వన్డే సిరీస్ లో అతడికి అదృష్టం కలసిరాలేదు.  అయితే, ఆనాడు జరిగిన సంఘటనను రాహుల్ గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ వచ్చి నువ్వే కెప్టెన్ అనగానే చాలా షాక్ కు గురయ్యానని తెలిపాడు. ‘‘ఇంత త్వరగా కెప్టెన్సీ అవకాశం నాకు వస్తుందని ఎప్పుడూ నేను ఊహించలేదు. జొహెన్నస్ బర్గ్ లో జరిగిన రెండో టెస్టు కోసం.. మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు బస్సులో వెళ్తుండగా కోహ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘నా వెన్ను బాగాలేదు. నువ్వే కెప్టెన్’ అని సడన్ గా నాకు చెప్పాడు. ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాను. నాతో పాటు అందరూ షాక్ కు గురయ్యారు’’ అని రాహుల్ తెలిపాడు. ఆ సమయంలో తాను వైస్ కెప్టెన్ గా ఉన్నానని, భవిష్యత్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అది మార్గమని, అందుకు సిద్ధమవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే, అంత త్వరగా తనకు అవకాశం వస్తుందని మాత్రం ఊహించలేదన్నాడు. దాని వల్ల తాను మానసికంగా ఏం మారలేదని, మన ఆటకు మనమే కెప్టెన్ అన్న విషయాన్ని తాను మరువనని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆటను మార్చుకుంటామని పేర్కొన్నాడు. అయితే, ఆ కెప్టెన్ అనే కొత్త హోదా వచ్చినప్పుడు మాత్రం కొత్తగా, గర్వంగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. అందరికీ ఆ అవకాశం రాదని, అవకాశం వచ్చిన వాళ్లు అదృష్టవంతులని చెప్పాడు.


 అక్కడ కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు


ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శన విదేశాల్లోనూ వివాదభరితంగా పరిణగించబడుతోంది. న్యూజిలాండ్ లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడగా.. ఆ దేశ మాజీ ఉప ప్రధాని విన్ స్టన్ పీటర్స్ మద్దతుగా నిలిచారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఎన్నో ఇతర దేశాల్లో విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాను న్యూజిలాండ్ లో ప్రదర్శిచేందుకు అనుమతించకపోతే.. అది న్యూజిలాండ్ వాసుల స్వేచ్ఛపై దాడి చేసినట్టేనని వ్యాఖ్యానించారు.  ఈ సినిమా (కశ్మీర్ ఫైల్స్)ను సెన్సార్ చేయడం అంటే.. న్యూజిలాండ్ లో మార్చి 15న జరిగిన దారుణాల సమాచారాన్ని లేదా దృశ్యాలను సెన్సార్ చేయడమే. లేదంటే 9/11 దాడులకు సంబంధించి ప్రజల మనసుల్లో ఉన్న అన్ని దృశ్యాలను చెరిపివేయడమే అవుతుంది. ప్రధాన స్రవంతిలోని ముస్లింలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఇస్లామ్ పేరుతో జరుగుతున్న హింసను ఖండించారు’’అని విన్ స్టన్ పీటర్స్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు.  కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కొన్ని మత మూకలను తప్పుగా చూపించడాన్ని న్యూజిలాండ్ సెన్సార్ బోర్డు కత్తెర వేయాలని అనుకుంటున్నట్టు సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇప్పటికే ప్రకటించారు. చరిత్ర నేపథ్యం తెలియకపోతే ఇలాంటి సమస్యే ఏర్పడుతుంది. కశ్మీర్ ఫైల్స్ లో చూపించిన కథనం.. కశ్మీర్ లో పండిట్ల ఊచకోతలు. కానీ, ప్రధాన కథనానికే కత్తిరింపులు చేస్తే సినిమా ప్రయోజనం ఏముంటుందన్నదే ప్రశ్న.  ఈ సినిమాపై న్యూజిలాండ్ సెన్సార్ బోర్డ్ ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరు సభ్యులు తనను కలసి ఆందోళన వ్యక్తం చేసినట్టు చీఫ్ సెన్సార్ డేవిడ్ షాంక్స్ తెలిపారు. ఈ సినిమాలో ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్స్ చూపించినట్టు పేర్కొన్నారు.


 సాయికృష్ణను విచారిస్తే... పెగాసెస్ గుట్టు బయ‌టికొస్తుంది


నాటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు సాయికృష్ణను విచారిస్తే పెగాసెస్ గుట్టు బయ‌టికొస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను గ‌తంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన‌ర్జీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి స్పందిస్తూ ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు.   ''ఇజ్రాయిల్ కంపెనీ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్ ఫ్రాంచైజీగా ఉన్న అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు సాయికృష్ణను విచారిస్తే పెగాసెస్ గుట్టు బయ‌టికొస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం 25 కోట్ల రూపాయ‌ల‌తో కొనుగోలు చేసింది ఏమిటి? మమత చెప్పిన పెగాసస్ ధర కూడా 25 కోట్ల రూపాయ‌లే'' అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

 భారత్ లో క్రమంగా బలహీనపడుతున్న కరోనా


భారత్ కు మాత్రం ఇది కచ్చితంగా ఉపసమనం కలిగించేవార్త. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 8 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు భారత్ లో కొత్త కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 4,31,973 మందికి పరీక్షలు నిర్వహించగా 1,761 కొత్త కేసులు వెలుగు చూశాయి. 2020 ఏప్రిల్ నుంచి చూస్తే రోజువారీ కేసుల్లో ఇదే కనిష్ట స్థాయి. యాక్టివ్ కేసులు 26,240గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 127 మంది కరోనాతో మరణించారు. భారత్ లో ఇప్పటి వరకు కరోనా వల్ల 5,16,479 మంది మరణించారు. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కోలుకుంటున్న వారు 98.74 శాతంగా ఉన్నారు. కరోనా నుంచి క్షేమంగా బయటపడిన వారు 4.24 కోట్లుగా ఉన్నారు. శనివారం ఒక్కరోజే 15,34,444 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 181.21 కోట్ల వ్యాక్సిన్ డోసేజీలు ఇచ్చారు. 


 నాపై బాంబు దాడి: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ


ది కశ్మీర్ ఫైల్స్ సినిమా నేపథ్యంలో ఉచ్చురాజకీయాలు కొనసాగుతున్నాయి. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసి వ‌స్తోంటే త‌న‌ కారుపై బాంబు విసిరారని ప‌శ్చిమ‌ బెంగాల్ ఎంపీ, బీజేపీ నేత‌ జగన్నాథ్ సర్కార్ అన్నారు. నిన్న తాను 'ది కశ్మీర్ ఫైల్స్' చూసిన అనంతరం ఇంటికి వెళ్తుండ‌గా కొంద‌రు దుండ‌గులు ఈ ఘ‌ట‌నకు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న వివ‌రించారు. నదియా జిల్లాలోని హరింఘటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స‌మాచారం. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు రోజురోజుకీ ఆద‌ర‌ణ పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. దానిపై వివాదాలు కూడా రాజుకుంటున్నాయి. దీంతో ఆ సినిమా ద‌ర్శ‌కుడికి ఇప్ప‌టికే భ‌ద్ర‌త క‌ల్పించారు. 

 దళిత, గిరిజనుల భూముల కోసం పోరు


తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజనుల భూముల కోసం పోరాడతామని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మధ్యప్రదేశ్ నాయ‌కురాలు మీనాక్షి నటరాజన్ చేపట్టిన‌ సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్ జిల్లా చేరుకున్న విష‌యం తెలిసిందే. భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ పాద‌యాత్ర చేస్తున్నారు. ఇందులో నిన్న మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వ‌ద్ద టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తూప్రాన్ వ‌ద్ద ఈ పాద‌యాత్ర‌లో ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి పాల్గొని మాట్లాడారు.  తాము గిరిజన, అణగారిన వర్గాల భూముల కోసం పోరాటం చేస్తామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే వరకు పోరాడ‌తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయల ఉపాధి నిధుల కాంట్రాక్టులు అన్నీ టీఆర్ఎస్ కు చెందిన వారికే ప్రభుత్వం అప్ప‌గిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

 మనమే సురక్షితంగా తరలిస్తున్నాం: ప్రధాని నరేంద్ర మోడీ


ఉక్రెయిన్ నుంచి మన భారతీయులను మనమే సురక్షితంగా తరలిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పూణేలో మెట్రో రైలు వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను సమర్థవంతంగా స్వదేశానికి తరలిస్తుండడం అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరిగిందన్న దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఆపరేషన్ గంగ (విద్యార్థుల తరలింపు కార్యక్రమం)ను కరోనా వైరస్ నియంత్రణతో పోల్చారు. కొవిడ్ ను విజయవతంగా మేనేజ్ చేయగలిగామని, కానీ ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిపడిందని అన్నారు. అయితే, అగ్రరాజ్యాలు సైతం వారి పౌరులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్న వేళ, భారత్ మాత్రం సురక్షితంగా తరలిస్తోందని చెప్పుకొచ్చారు. కల్లోలభరిత ఉక్రెయిన్ నుంచి వేలమంది విద్యార్థులను మాతృభూమికి తీసుకురావడం భారత శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇదిలావుంటే ఉక్రెయిన్ పై రష్యా తీవ్రస్థాయిలో సైనిక చర్య కొనసాగిస్తున్న నేపథ్యంలో, భారత్ ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి 13,700 మందిని స్వదేశానికి తరలించింది. ఆపరేషన్ గంగ పేరిట ఉక్రెయిన్ పొరుగు దేశాలకు విమానాలను పంపి, అప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొరుగుదేశాలకు చేరుకున్న విద్యార్థులను ఆ విమానాల్లో భారత్ తీసుకువస్తోంది. ఇంకా, చాలామంది భారతీయులు ఉక్రెయిన్ లోనే ఉన్న నేపథ్యంలో, ఆపరేషన్ గంగలో మరిన్ని విమానాలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది.

గ్రామాభివృద్ధికి అందరూ చేయూతనివ్వండి... 

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజవర్గం గడివేముల మండలంలో ఉన్నతాధికారులతో ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..గడివేముల ఎంపీడీవో కార్యాలయం నందు గడివేముల మండల సర్వసభ్య సమావేశంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన, గడివేముల మండల ఎంపీడీవో విజయసింహ రెడ్డి,జెడ్పిటిసి. ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా మండలంలోని అధికారులు గ్రామానికి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేస్తున్నారని అడగగా..మండలంలోని అధికారులు మాట్లాడుతూ


గడివేముల మండలంలోని గ్రామంలో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ మండలంలో మొత్తం గ్రామపంచాయతీలో సంఖ్య 16 ఉన్నాయని, మొత్తం గ్రామ సంఘాలు 33 ఉన్నాయని గడివేముల మండలంలో ఎస్ హెచ్ జి సభ్యులు మొత్తం 10,857 మంది ఉన్నారని ,బ్యాంకు తో అనుసంధానం కలిగిన SHG లు 464 గ్రూపులు ఉన్నాయని వారికి కి 1861.11 కోట్లు రూపాయలను రుణాలు ఇచ్చామని స్త్రీ నిధి కింద అ అర్హులైన 105 మందికి  1, 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అర్హులైన ఎస్సీ మరియు ఎస్ టి (cpf) లోను పొందిన 171 లబ్ధిదారులకు 11,52,525 ఇచ్చామని, వైయస్సార్ చేయూత కింద "సున్నా" వడ్డీలకు 315 మందికి 5,50 కోట్లు పంపిణీ చేశామని, వైయస్సార్ చేయూత కింద 28 మంది లబ్ధిదారులకు 5.25 లక్షలు వైఎస్ఆర్ ఆసరా కింద అర్హత పొందిన సంఘాలు మొత్తం 598 లబ్ధిదారులకు మొదటి విడతగా గ్రూపులకు 212,30 లక్షలు వచ్చాయని,

రెండవ విడతగా 212 పాయింట్ 30 లక్షలు వచ్చాయని, జగన్ అన్న తోడు కింద 347 మంది సభ్యులకు 10,000వేల రూపాయల చొప్పున 3,47 లక్షల రూపాయలు మంజూరు చేశామని, పాఠశాలలకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో 3 పాఠశాలలు జడ్.పి.హెచ్.ఎస్ గడివేముల, కొరటమద్ది, గని గ్రామాల్లోని పాఠశాలకు2,67,000 మంజూరయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. అనంతరం పాణ్యం  ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో జరిగే అభివృద్ధికి గ్రామంలోని ప్రజలందరూ సహకరించాలని ఉపాధి హామీ పథకంలో పని చేసే వారికి మాత్రమే గుర్తింపు ఇవ్వాలని పని చేయని వారికి గుర్తింపు ఇవ్వొద్దని ఆయన తెలిపారు. అనంతరం  గడివేముల మండలంలో  ముఖ్యమంత్రి సహాయ నిధికి విడుదలైన మొత్తం 1,40,000  మొత్తంను 4 సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి  విజయసింహారెడ్డి, గడివేముల జెడ్ పి టి సి, ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ మద్దమ్మ, పాణ్యం సిఐ గంగాధర్ బాబు, ఎస్సై హుస్సేన్ బాషా, గడివేముల మండలం లోని అన్ని శాఖల అధికారులు, గడివేముల మండల సర్పంచులు, మండలంలోని గ్రామాల రైతులుపాల్గొన్నారు.



 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దె భవనాల్లో ఇంకెంత కాలం

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *మహమ్మద్ అబ్బాస్

(జానో జాగో వెబ్ న్యూస్-జనగాం ప్రతినిధి)

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు  సంవత్సరాల తరబడి అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల సరియైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు  స్వంత భవనాలు నిర్మించాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆవాజ్ రాష్ట్ర ప్రతినిధి బృందం జనగాం జిల్లాలోని మైనారిటీ గురుకులాలను  సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నది. 


ఈ సందర్భంగా మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ మైనారిటీ  రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటై 6 సంవత్సరాలు అవుతున్నా ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అన్నారు. ఇంకా ఎంతకాలం అద్దె భవనాల్లో కొనసాగిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అద్దె భవనాలు రెసిడెన్షియల్ స్కూల్ కోసం నిర్మాణం చేసినవి కాదు కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాలలకు  అనుకూలంగా లేవు,  పిల్లలకు తగిన సౌకర్యాలు ఉండటం లేదని అన్నారు. లక్షల రూపాయల అద్దెలు చెల్లించినప్పటికీ విద్యార్థులకు సంతృప్తికరమైన
 వసతులు అందడం లేదన్నారు. అద్దె భవనాల యజమానులకు  అద్దె తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ భవనాల నిర్వాహన మీద లేదని విమర్శించారు.

కనీసం భవనాలకు మరమ్మతులు చేయడం, సున్నం వేయడం కూడా చేయడం లేదని విమర్శించారు. సంవత్సరానికి 30కోట్ల రూపాయలు అద్దె రూపంలో ఖర్చు అవుతుంది, అయినా విద్యార్థుల సరైన సౌకర్యాలు అందడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలలకు దూరం అయ్యే అవకాశం ఉందన్నారు.  విద్యార్థులను ఆకర్షించే విధంగా స్కూల్ వాతావరణం ఉండాలంటే ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించి, సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను విద్యార్థులు ఆహ్లాదకరంగా చదువుకునే కేంద్రాలుగా తీర్చి దిద్దాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణను  నివారించడంలో ఉద్యోగులు విఫలం చెందారు. ఇలాంటి ఘటనలు తల్లితండ్రులను ఆందోళనలకు గురిచేస్తాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ అజారుద్దీన్, యాకూబ్, యూసఫ్ తదితరులు ఉన్నారు.

 కస్టమర్లను ఆకర్షించాలంటే ఈ మాత్రం తప్పదు మరి

జైల్లు తరహాలో రెస్టారెంట్


మన వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కస్టమర్లను ఆకర్షించడం ముఖ్యం. ఇప్పుడంతా కొత్తదనం కోరుకుంటున్నారు. వినూత్న తరహాలో ఆలోచించే యువత వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రెస్టారెంట్ పేరు ఖైదీ బిర్యానీ. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లిన వారికి అచ్చం జైలు గదులను తలపించేలా క్యాబిన్లు దర్శనమిస్తాయి. ఆ క్యాబిన్లకు ఊచలు ఏర్పాటు చేయడంతో జైలు లుక్ వచ్చింది. ఇక సర్వర్లు కూడా ఖైదీల్లా యూనిఫాం వేసుకుని సేవలు అందిస్తుంటారు. తమ వంటకాల రుచులతోనే కాకుండా, సరికొత్త కాన్సెప్ట్ తోనూ కస్టమర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నామని ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. కాకినాడలోని ఈ జైలు కాన్సెప్టు రెస్టారెంట్ కు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారట. ఇందులో 16 సాధారణ క్యాబిన్లు, ఒక వీఐపీ క్యాబిన్ ఏర్పాటు చేశారు.


 పదవ తరగతిలో 100%, ఉత్తీర్ణత సాధించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం లో విద్యాశాఖ అధికారి రంగారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే...గడివేముల మండలం లోని పాఠశాలలను కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గడివేముల మండలంలోని బిలకలగూడూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను, ఉర్దూ పాఠశాలను,  కోరటమద్ది గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను, కేజీబీవీ పాఠశాల, గడివేముల గ్రామం లోని ఏపీ మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు, పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులతో మాట్లాడుతూ  ఉపాధ్యాయులు తరగతి వేళకు పాఠశాలలకు వస్తున్నారా లేదా మీకు విద్యా బోధన సక్రమంగా చెబుతున్నారా లేదా మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని పిల్లలను అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ని రికార్డులను పరిశీలించారు, 


ఈ సందర్భంగా డీఈవో రంగారెడ్డి మాట్లాడుతూ మండలంలో పదవ తరగతిలో విద్యార్థినీ విద్యార్థులు అందరూ 100% ఉత్తీర్ణత సాధించాలని, చదివిన పాఠశాలకు, చదివించిన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, సంఘంలో ఉన్నత మైన న్యాయ విలువలతో కూడిన  జీవితాన్ని గడపాలని వారు విద్యార్థులకు సూచించారు, ఈ సందర్భంగా పాఠశాలలో పంపిణీ అవుతున్న నులిపురుగుల నివారణ మాత్రల కార్యక్రమాన్ని పరిశీలించారు.

 చదువుపై బెంగ...ఉక్రెయిన్ లోనే యోచనలో  విద్యార్థులు


ఉక్రెయిన్ లో ముందునొయ్యి...వెనక గొయ్యి అన్నట్లు మన భారతీయ విద్యార్థుల పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఉన్న చోట నుంచి ఉరుకుల పరుగుల మీద బయట పడాల్సిన పరిస్థితి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. చదువు సంగతి తర్వాత ముందు బతికి బయట పడితే తర్వాత చూసుకోవచ్చులే! ఇదీ ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతోపాటు భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ.  దాదాపు అందరూ తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతుంటే, కొందరు మాత్రం చదువు నష్టపోతామన్న ఆందోళనతో అక్కడే ఉండాలనుకుంటన్నారు. వెళితే తమ చదువు, భవిష్యత్తు ఏంటన్న సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారత రాయబార అధికారులు మాత్రం.. చదువుకుంటున్న కాలేజీల్లో అంత మందికి వసతి కల్పించడం అసాధ్యమని చెబుతున్నారు. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల లైసెన్సియేట్ నిబంధనల ప్రకారం.. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసేందుకు ఒక విద్యార్థికి పదేళ్ల సమయం ఉంటుంది. కోర్సు కాల వ్యవధి  6 ఏళ్లు. ఇందులో ఒక ఏడాది పాటు భారత్ లో ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఎప్పుడు యూనివర్సిటీలు తెరుస్తారు. ఎప్పుడు వెనక్కి పిలుస్తారనే దానిపై స్పష్టత లేదని, ప్రస్తుతానికి అయితే యూనివర్సిటీలను విడిచి వెళుతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. భారతీయ విద్యార్థుల రక్షణే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా జాతీయ వైద్య మండలి చెబుతోంది. ఉక్రెయిన్ లో వైద్య కోర్సుల నుంచి అర్ధంతరంగా వచ్చేస్తున్న వారికి దేశీయ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఇక్కడి కాలేజీ ప్రిన్సిపాల్స్ అభిప్రాయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. భారత్ నుంచి విదేశీ విద్య కోసం వెళ్లిన వారు నీట్ లో తక్కువ స్కోరు సంపాదించిన వారని అంటున్నారు. కరోనా వెలుగు చూసిన తర్వాత చైనాలో వైద్య విద్యను ఆపేసి వచ్చిన వారికి ఇక్కడ అడ్మిషన్లు ఇవ్వని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిజానికి కరోనా కారణంగా గత రెండేళ్లుగా వైద్య విద్యార్థులు కళాశాలలకు దూరమయ్యారు. ఉక్రెయిన్ లోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. రెండేళ్ల తర్వాత కళాశాలలకు వెళ్లి చక్కగా చదువుకోవచ్చని అనుకుంటున్న తరుణంలో యుద్ధం వారి ఆశలపై నీళ్లు చల్లింది. యుద్ధం త్వరగా సమసిపోతే.. విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్ కళాశాలల్లో చేరే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 వారిని సురక్షితంగా తరలించడం పెద్ద కష్టమేమీ కాదు: యశ్వంత్ సిన్హా


ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్థుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆపరేషన్ గంగా మిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. ఉక్రెయిన్ లో మహా అయితే 18 వేల మంది భారతీయులే ఉన్నారని, వారిని సురక్షితంగా తరలించడం పెద్ద కష్టమైన పనేం కాదని అన్నారు. గతంలో వాజ్ పేయి హయాంలో కువైట్ నుంచి తరలింపులను ఆయన గుర్తు చేశారు.  గల్ఫ్ యుద్ధం సమయంలో 1990 ఆగస్టు, అక్టోబర్ మధ్య కువైట్ నుంచి వాజ్ పేయి ప్రభుత్వం1.7 లక్షల మందిని తీసుకొచ్చిందని, దానితో పోలిస్తే ఉక్రెయిన్ నుంచి 18 వేల మందిని తీసుకురావడం కష్టమేం కాదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ఈ తరలింపులను వాడుకోవడం విచారకరమన్నారు. ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ తరలింపుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారని, అది మంచి విషయం కాదని చెప్పారు. తరలించడం కేంద్ర ప్రభుత్వ విధి అన్నారు. ఉక్రెయిన్ లో యుద్ధ సంక్షోభం వస్తుందన్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఆదిలోనే స్పందింకపోవడం గమనార్హమన్నారు. ఉక్రెయిన్ గగనతలం తెరిచి ఉన్నప్పుడే అందరినీ తీసుకొచ్చేలా చర్యలు చేపడితే బాగుండేదన్నారు. గగనతలం మూసేసిన వెంటనే బస్సులు, ఇతర రవాణా మార్గాల ద్వారా భారతీయులను సరిహద్దు దేశాలకు రాయబార కార్యాలయం తరలించి ఉండాల్సిందన్నారు. నలుగురు కేంద్ర మంత్రులను సరిహద్దు దేశాలకు కొంచెం ముందే పంపి ఉండాల్సిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని, ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే ఉక్రెయిన్ అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు.  

 డాబర్ "వర్జిన్ కోకోనట్ ఆయిల్ మార్కెట్‌లోకి విడుదల 


(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

భారతదేశంలోని ప్రముఖ ఆయుర్వేదిక్  నేచురల్ హెల్త్ కేర్ కంపెనీ డాబర్ ఇండియా లిమిటెడ్  కొబ్బరి నూనె మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ “వర్జిన్ కోకోనట్ ఆయిల్”ని ప్రారంభించినట్లు ప్రకటించింది. డాబర్ వర్జిన్ కొబ్బరి నూనె 100% సహజమైనది, దీనిని వంట కోసం ఉపయోగించవచ్చు  సాంప్రదాయకంగా స్కిన్,  హెయిర్ హెల్త్ కోసం,  మసాజ్ ఆయిల్‌గా కూడా ఉపయోగించబడుతుంది. ధర రూ. 500 ml కోసం 399, ఇది దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఆమెజాన్‌ అందుబాటులో ఉంది.

లాంచ్‌ను ప్రకటిస్తూ, డాబర్ ఇండియా లిమిటెడ్ ఇ-కామర్స్ బిజినెస్ హెడ్ మిస్టర్ స్మెర్త్ ఖన్నా మాట్లాడుతూ "ప్రతి ఇంటి ఆరోగ్యం,  శ్రేయస్సు పట్ల మేము నిబద్ధతలో  కొత్త డాబర్ వర్జిన్ కొబ్బరి నూనెను అభివృద్ధి చేసాము. వినియోగదారుల  జనాభా మరియు భవిష్యత్తు ట్రెండ్ విశ్లేషణపై పరిశోధన. ఇది కోల్డ్ ప్రెస్ టెక్నాలజీ ద్వారా రూపొందించ‌బ‌డింది., ఇది కొబ్బరికాయల సహజ మంచితనం, కీలక పోషకాలు, గొప్ప సువాసన స్వ‌చ్చ‌మై రుచిని అందిస్తుంది.  ఇందులో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటుంది, ఇది సులభంగా జీర్ణమై సహాయపడుతుంది.  బరువు నిర్వహణలో మరియు జీవక్రియను నియంత్రించడంలో సహాయపడటానికి ప్రసిద్ధి చెందింది.ఆరోగ్యకరమైన ఆహారం కోసం వారి వంట జాబితాలో భాగంగా కొత్త ఉత్పత్తిని మిలియన్ల మంది ఇష్టపడతారని మేము విశ్వసిస్తున్నాము, కానీ వారి చర్మం మరియు జుట్టు సంరక్షణ దినచర్యకు కూడా గొప్ప ఎంపిక అవుతుంది.


“దీనిని ఆమెజాన్‌.ఇన్‌లో మా కస్టమర్‌ల కోసం ‘డాబర్ కోల్డ్ ప్రెస్‌డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్’ని ప్రారంభించడం జ‌రిగింది అని అన్నారు.  హెయిర్‌కేర్, స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ మరియు అలాగే రోజువారీ అవసరాలకు సంబంధించిన ఆరోగ్యకరమైన మరియు సహజమైన శ్రేణి విషయానికి వస్తే డాబర్ అనేది ఇంటి పేరు మరియు ఎంపిక యొక్క బ్రాండ్. ఇటీవలి కాలంలో, ఆమెజాన్‌.ఇన్‌లో ఆరోగ్యకరమైన జీవన ఎంపికలతో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడాన్ని మేము గమనించాము, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాటిలో ఒకటి. ఈ భాగస్వామ్యంతో, మేము వినియోగదారులకు విస్తారమైన మరియు వైవిధ్యమైన ఎంపిక, సాటిలేని విలువ, వేగవంతమైన మరియు నమ్మకమైన డెలివరీ మరియు ఆమెజాన్‌.ఇన్‌లో గొప్ప షాపింగ్ అనుభవాన్ని అందించడానికి మా ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేస్తున్నాము, ”అని ఆమెజాన్ ఇండియా  డైరెక్టర్ – కోర్ కన్సూమబుల్స్  నిశాంత్ రామన్ అన్నారు.

“ప్రతి ఇంటి సంపూర్ణ ఆరోగ్య,  శ్రేయస్సు కోసం ఉత్తమమైన ప్రకృతిని అందించే ఉత్పత్తులను పరిచయం చేయడానికి డాబర్ కట్టుబడి ఉంది. డాబర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను విడుదల చేయడం ఈ దిశలో మరో అడుగు  భారతదేశంలో డిజిటల్ స్థానిక బ్రాండ్‌లను ప్రారంభించాలనే మా వ్యూహంలో భాగమని డాబర్ ఇండియా లిమిటెడ్ హెడ్-కన్స్యూమర్ మార్కెటింగ్ మిస్టర్ రజత్ మాథుర్ తాము విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.