కార్మికులకు చెల్లించవలసిన బిల్లులు వెంటనే చెల్లించాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి. సోమయ్య డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
మార్కాపురం మండలం లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు చెల్లించాల్సిన వేతనాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ ఈ రోజు మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పధకం లో పనులు చేసిన కార్మికులకు చెల్లించాల్సిన బిల్లులను సైతం చెల్లించకుండా పేదల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ప్రతివారం బిల్లులు చెల్లించాలని చట్టం చెబుతున్నా కూడా, మూడు నుంచి ఆరు వారాల పాటు బిల్లులు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలే కరువు ప్రాంతం, ఆ పై కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఉపాధి లేమితో ఉన్న కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేసిన పనికి సైతం బిల్లులు చెల్లించకపోవడం దారుణం అన్నారు.
ప్రతి జాబ్ కార్డు దారులకు 200 రోజులకు పెంచాలని,మూడు వందల రూపాయలు రోజువారి వేతనం చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కులాల వారి విభజన ఉద్దేశించిన మెమోను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం మార్కాపురం ఎంపీడీవో హనుమంత రావు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి కొండయ్య, జలసూత్రం తిరుపాలు, గంగయ్య, శ్రీనివాసులులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: