అమాంతం పెరిగిన విమాన చార్జీలు..
దుబాయ్ కు క్యూ కట్టిన భారతీయులు
కరోనా సెకండ్ వేవ్ ను తప్పించుకునేందుకు ప్రయాణాలు
(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)
పెరిగిపోతున్న కరోనాతో పాటే విమాన చార్జీలూ అమాంతం పెరిగిపోయాయి. టికెట్ ధరలు ఒకేసారి ఐదు నుంచి 10 రెట్లు ఎక్కువయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారు త్వరత్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. ఇప్పటికే బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత విమానాలపై ఆంక్షలు విధించాయి. అదే క్రమంలో యూఏఈ కూడా భారత విమానాలపై నిషేధం విధించింది. ఆదివారం నుంచి ఆ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈకి విమానాలు బంద్ అయ్యే లోపే అక్కడకు వెళ్లిపోవాలనుకుంటున్న వారు.. ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రైవేట్ జెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముంబై నుంచి దుబాయికి వన్ వే ప్రయాణం కోసం శుక్రవారం, శనివారాల్లో చార్జీ రూ.80 వేలుగా ఉంది. ఇది మామూలు రోజులతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. అదే న్యూఢిల్లీ నుంచి దుబాయ్ కు రూ.50 వేలు వసూలు చేశారు. మామూలు రోజులతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ప్రైవేట్ జెట్లకు డిమాండ్ అమాంతం పెరిగిందని ఎయిర్ చార్టర్ సర్వీస్ ఇండియా ప్రతినిధి చెప్పారు. శనివారం తమ సంస్థ నుంచి 12 విమానాలు దుబాయ్ కు వెళ్తున్నాయని, ప్రతి విమానం నిండిపోయిందని చెప్పారు. డిమాండ్ కు తగ్గట్టు సేవలందించేందుకు విదేశాల నుంచి విమానాలను అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థిత ఇఏర్పడిందని ఎంథ్రాల్ ఏవియేషన్ ప్రతినిధి చెప్పారు. 13 సీట్ల విమానాన్ని అద్దెకు తీసకోవాలంటే 38 వేల డాలర్లు (సుమారు రూ.28.5 లక్షలు) ఖర్చవుతోందన్నారు. అదే ఆరు సీట్ల చార్టర్ ఫ్లైట్లకు 31 వేల డాలర్లు (సుమారు రూ.23.22 లక్షలు) అవుతోందన్నారు. దుబాయ్ కు వెళ్తున్న భారతీయులు కొందరు ఓ గ్రూపుగా ఏర్పడి చార్టర్ ను బుక్ చేసుకుంటున్నారని చెప్పారు.
Post A Comment:
0 comments: