రేషన్‌ పంపిణీ పూర్తయ్యేవరకూ...

 వాలంటీర్లు వాహనం వెంటే

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

    ఇంటింటికీ రేషన్‌ పంపిణీ సమయంలో మొబైల్‌ వాహనంలోని ఈ-పోస్‌ యంత్రాన్ని నిర్వహించాల్సిన బాధ్యత వాలంటీర్లదే. కార్డుదారుల నుంచి వేలిముద్రలను వారే తీసుకోవాలి. తమ క్లస్టర్‌ పరిధిలో నిత్యావసరాల పంపిణీ పూర్తయ్యే వరకు వాహనం వద్దే అందుబాటులో ఉండాలి. ఈ మేరకు వాలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ డైరెక్టర్‌ నారాయణ్‌ భరత్‌ గుప్తా సూచనలు చేశారు. సరుకుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, మోసుకెళ్లడం తదితర పనులేవీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా.. పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచనలు చేయాలని జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లను కోరారు.

వాలంటీర్ల బాధ్యతలు:-

* తమ క్లస్టర్‌ పరిధిలోని ఇళ్లకు రేషన్‌ పంపిణీ వాహనం ఏ రోజు, ఏ సమయంలో వస్తుందో తెలియజేస్తూ కూపన్‌ను కార్డుదారులకు అందించాలి.

* వాహనం రావడానికి ఒక రోజు ముందు మళ్లీ వారందరికీ గుర్తు చేయాలి.

* నిత్యావసరాల పంపిణీ సమయంలో వాహనం వెంటే ఉండాలి.

* సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు రెవెన్యూ అధికారులకు సంబంధాలు నెరపాలి.

* బయోమెట్రిక్‌ (వేలిముద్రలు పనిచేయకపోతే) ఫ్యూజన్‌ ఫింగర్‌ విధానంలో ప్రయత్నించాలి.

* ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వార్డు సచివాలయం వద్ద రేషన్‌ వాహనం నిలిపి నిత్యావసరాలు అందిస్తారు. రేషన్‌ తీసుకోని కార్డుదారులు ఎవరైనా ఉంటే.. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చనే విషయాన్ని వారికి తెలియజేయాలి.

* పోర్టబిలిటీ విధానంలో రేషన్‌ తీసుకోవడంపై కార్డుదారులకు అవగాహన కల్పించాలి.

* తమ నివాస ప్రాంతంలోని వాహనాల వద్దనే రేషన్‌ తీసుకోవాలనే విషయాన్ని.. మ్యాపింగ్‌ కాని కార్డుదారులకు వివరించాలి.

* పింఛన్‌ పంపిణీకి ఇబ్బంది లేకుండా తమ క్లస్టర్‌ పరిధిలో నిత్యావసరాల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: