అన్ని శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో,,,
శ్రీశైలం ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయండి
- కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు
ఏర్పాట్లు పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
అన్ని శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో శ్రీశైలం క్షేత్రంలో నిర్వహించే ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఉగాది మహోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ పై అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి పాల్గొన్న ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, శ్రీశైలం పుణ్య క్షేత్రం నుంచి పాల్గొన్న శ్రీశైలం ఇఒ కెఎస్.రామారావులు సమీక్షించారు.
జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఒ పుల్లయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, డిటిసి చందర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈసిసి హెచ్ విద్యాసాగర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం వెంకట్ రామమ్, డిపిఓ ప్రభాకర్ రావు, సమాచార శాఖ, ఉప సంచాలకులు పి.తిమ్మప్ప, ఫిషనరి డిపార్ట్మెంట్ జె.డి శ్రీహరి, సివిల్ సప్లైస్ డి ఎం షర్మిల, రెవెన్యూ, పోలీస్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర లో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు సందర్భంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. శ్రీశైల క్షేత్రంలో కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని దేవస్థానం, జిల్లా అధికారులను ఆదేశించారు. అడవి మార్గంలో కాలినడకన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని, అందుకోసం అడవి మార్గంలో కూడా మెడికల్ క్యాంపులు విస్తృతంగా ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అడవి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించి వడదెబ్బ తగలకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో షేడ్ గ్రీన్ నెట్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈఓకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి శ్రీశైలం రానున్న నేపథ్యంలో వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఉగాది ఉత్సవాలను ఆలయ సంప్రదాయం ప్రకారం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఇఒ కెఎస్.రామారావును ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, టాయిలెట్స్, పార్కింగ్, క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రాలు, రవాణా తదితరాల పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అటవీ మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు తాగునీరు, ఆహార పదార్థాలను అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫారెస్ట్ లోపల కూడా ఎక్కువగా మెడికల్ టీమ్లను ఏర్పాటు చేసి
అంబులెన్స్లు అందుబాటులో ఉంచుకోవాలని డిఎంహెచ్ఒను ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ కె. ఫక్కీరప్ప మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రం ఉగాది ఉత్సవాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు ఇబ్బందులు పెట్టకుండా సమన్వయం చేసుకోవాలని డి ఎఫ్ ఓ కు జిల్లా ఎస్పీ కోరారు. రథోత్సవం పూర్తయిన వెంటనే వెహికల్ మూవ్మెంట్ క్లియర్ చేయడానికి అధిక బస్సులు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టిసి రీజనల్ మేనేజర్ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పోలీసులతో సహకరించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారన్నారు. శ్రీశైలం ఇఒ కెఎస్.రామారావు మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 10న యాగశాల ప్రవేశం, బృంగి వాహనసేవ, మహాలక్ష్మి అలంకారం, 11వ తేదీ రాత్రి ఏడు గంటలకు కైలాస వాహన సేవ, మహా దుర్గ అలంకారం, 12వ తేదీ ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం, సాయంత్రం ఐదు గంటలకు ప్రభోత్సవం, రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ, మహా సరస్వతి అలంకారం, రాత్రి 10 గంటలకు అగ్ని గుండం, వీరాచార విన్యాసాలు, 13వ తేదీ సాయంత్రం 5:30 కు రథోత్సవం, రాత్రి ఏడు గంటలకు రాజరాజేశ్వరి అలంకారం, 14వ తేదీ ఉదయం 9.30 గంటలకు పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, భ్రమరాంబ దేవి అలంకారం కార్యక్రమాలు, ఉగాది ఉత్సవాల ఏర్పాట్లపై పిపిటి ద్వారా శ్రీశైలం దేవస్థానం ఇఒ జిల్లా కలెక్టర్ కు వివరించారు. నడకదారి భక్తులకు కంకణం ఇచ్చి శీఘ్ర దర్శనం ఏర్పాటు చేస్తు ఆలస్యం లేకుండా వెంటనే భగవంతుని దర్శనం అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
Post A Comment:
0 comments: