పాజిటివిటీ రేటు 10% దాటితే..
మినీ లాక్ డౌన్ పెట్టండి
రాష్ట్రాలకు కేంద్రం తాజా ఉత్తర్వులు
(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)
గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన ఆక్సిజన్, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్డౌన్ తరహా ఆంక్షలను 14 రోజులపాటు కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ప్రాంతాలను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ వార్డులు, పంచాయతీ ప్రాంతాలుగా వర్గీకరించి కఠిన నిబంధనలతో స్థానికంగా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు, అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది.*
కేంద్రం నిర్దేశించిన అంశాలివే
అత్యవసరం కాని కార్యకలాపాలను రాత్రిపూట పూర్తిగా నిషేధించాలి.
సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత, ఉత్సవ సంబంధమైన సమూహాలు, సమావేశాలను నిషేధించాలి. అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్సులు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, జిమ్లు, స్పాలు, ఈత కొలనులు, మతపరమైన స్థలాలు పూర్తిగా మూసేయాలి. వివాహాలు (50 మంది వరకు మాత్రమే), అంత్యక్రియలు/కర్మకాండలకు (20 మంది వరకు) పరిమితంగా అనుమతివ్వాలి. వైద్య, పోలీసు, అగ్నిమాపక సేవలు, బ్యాంకులు, విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య సేవలు కొనసాగడానికి అవకాశం కల్పించాలి. ప్రజా రవాణా (రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, క్యాబ్లు) గరిష్ఠంగా 50% సామర్థ్యంతోనే నడవాలి. రాష్ట్రాల్లో అంతర్గతంగా లేదా రాష్ట్రాల మధ్య రాకపోకలపైనా, అత్యవసర సరకుల రవాణాపైనా ఆంక్షలొద్దు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ గరిష్ఠంగా 50% సామర్థ్యంతో పనిచేయాలి. అన్నిచోట్లా సామాజిక దూరం పాటిస్తూ పనిచేసేంత మందిని మాత్రమే అనుమతించాలి. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారికి ఎప్పటికప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలి. ఏదైనా ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ ప్రాంతంగా ప్రకటించే ముందు బహిరంగంగా వెల్లడించాలి. ఆంక్షలను అనుసరించేలా ప్రజలను సమాయత్తం చేయాలి. కంటెయిన్మెంట్ను పెద్దస్థాయిలో ప్రకటించే ముందు ప్రజలు నిత్యావసరాలు సమకూర్చుకొనేందుకు తగిన సమయం ఇవ్వాలి. వైరస్ సోకిన వారు స్వయంగా వెల్లడించేలా విస్తృత ప్రచారం, హెచ్చరిక సంకేతాలు ఇవ్వండి. చికిత్స ప్రొటోకాల్ పరిధిలో ఉన్నవారిని మాత్రమే హోం ఐసోలేషన్లో ఉండేందుకు అనుమతివ్వాలి. ఇలాంటి వారిని కాల్సెంటర్ల ద్వారా పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాలు ఏర్పాటు చేయాలి.
అధిక ముప్పు ఉన్నవారిపై ప్రత్యేక పర్యవేక్షణ
హైరిస్క్ కేసుల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ పెట్టి అవసరమైన చర్యలు చేపట్టాలి.కొవిడ్ ఆసుపత్రుల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ జిల్లా అధికారులకు అప్పగించాలి. అవసరమైన సంఖ్యలో ఆంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బాధితులకు ఆక్సిజన్ అందించేటప్పుడు కేంద్ర మార్గదర్శకాలను అనుసరించాలి. నిబంధనలకు అనుగుణంగానే రెమ్డెసివిర్, టొసిలిజుమాబ్ లాంటి మందులు ఇవ్వాలి.ఆసుపత్రులవారీగా మరణాలను రోజువారీగా ఇన్సిడెంట్ కమాండర్/జిల్లా కలెక్టర్/ మున్సిపల్ కమిషనర్లు విశ్లేషించాలి. అర్హులైన వారందరికీ 100% వ్యాక్సినేషన్ అమలుకు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
పరీక్షలు, సౌకర్యాలపై విస్తృత ప్రచారం
పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి..? వైద్య సౌకర్యాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? అంబులెన్స్ల సమాచారంపై విస్తృత ప్రచారం చేయాలి. వేగంగా సమాచారం అందించడానికి వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. అవసరమైన వారికి వైద్యసేవలు అందించడంలో జాప్యం లేకుండా చూడాలి. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా అందుబాటులో ఉన్న పడకలు, వాటి ఖాళీల వివరాలను ఆన్లైన్లో ఉంచండి. ఆక్సిజన్, మందుల వినియోగం..వ్యాక్సిన్లపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో విశ్వాసం నింపండి. ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ స్థాయి లాంటి ముఖ్యమైన అంశాలను పరీక్షించుకుంటూ ఇళ్లలోనే ఉండి కొవిడ్ను పర్యవేక్షించేలా సమాజాన్ని సమాయత్తం చేయాలి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: