మే 2020
ఇస్లామ్ చూపే ఆర్థిక వ్యవస్థతో.....
ఆర్థిక అసమానతలు అంతం




రచయిత-ముహమ్మద్ ముజాహిద్ 
సెల్ నెం- 9640622076






ఇది నేటి ఆర్థిక వ్యవస్థ పుణ్యమా అని సంపద కేవలం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఇటీవలె ఆక్ఫ్ ఫామ్ ఆర్థిక నివేదిక ఇదే తేటతెల్లం చేసింది. డబ్బున్న వాళ్లు మరింత సంపన్నులవుతున్నారు. వాళ్ల ఆస్తుపాస్తులు అంతకంతకూ ఎగబాకుతుంటే పేదలు మరింత దారిద్ర్యంలో కూరుకుపోతున్నారు. అభాగ్యులు, అవసార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఫ్యాక్టరీల్లో వేలాది మంది పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఒకే ఒక్క మిషనరీతో వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు.  దీంతో నిరుద్యోగిత, ఉపాధిలేమి పెరిగిపోయింది. కుబేరులు తమ ఫ్యాక్టరీల్లో, సంస్థల్లో ఖరీదైన మిషనరీలు ఏర్పాటుచేసుకొని వాటిద్వారా మరింత డబ్బు రాబడిని పెంచుకుంటున్నారు. దీంతో ప్రపంచ సంపద కొందరిదగ్గరే హస్తగతమవుతోంది. పైగా ఇదంతా అభివృద్ధి అనుకుంటున్నాము. అయితే దీనికి భిన్నంగా సంపద వికేంద్రకరణ చేయాలన్నది ఇస్లామ్ చూపే ఆర్థిక వ్యవస్థ సూత్రం. జకాత్ చూపే వ్యవస్థ ద్వారా సమాజంలో డబ్బు పంపిణీ జరిగితే ధనికులు-పేదల మధ్య అంతరాలు పెద్దగా ఉండవు. పూడ్చలేనంత ఆర్థిక అంతరాలు ఉండవు. మనదేశంలో ఒక్కశాతం మంది పెద్దోళ్ల దగ్గర 95కోట్ల మంది దగ్గరున్న సంపదకంటే నాలుగు రెట్లు ఎక్కువ డబ్బుందని ఇటీవలె ఆక్ఫ్ ఫామ్ నివేదిక తేల్చి చెప్పింది. ఇది మనదేశంలోనే కాదు దునియా మొత్తం ఇదే పరిస్థితని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. ప్రపంచంలో 1శాతం శ్రీమంతుల దగ్గరున్న డబ్బు ప్రపంచంలోని 690కోట్ల మంది దగ్గరున్న దానికంటే రెట్టింపు సంపద ఉందంట. ఇస్లామ్ చూపే ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తే ఈ అంతరాలను అధిగమించవచ్చు. కానీ సంపద ఒక్కచోట పోగుపడటాన్ని ఇస్లామ్ తీవ్రంగా నిరసిస్తుంది. పంచిపెట్టడమే ఇస్లామ్ ఆర్థిక వ్యవస్థ సూత్రం. ఈ సంపద అందరి చేతుల్లోనూ రావాలన్నది దైవనిర్ణయం.  ఒకవ్యక్తి బాగా సంపన్నుడు, తన వ్యాపారంలో లెక్కకు మించి లాభాలు గడిస్తున్నాడు. ఆ వ్యక్తి తన సంపదలోనుంచి ఏటా 2.5శాతం జకాత్ ధనాన్ని తన బంధువర్గంలో ఉన్న పేదలకు, అబాగ్యులకు, అనాధలకు పంచిపెట్టాలంటోంది ఖుర్ఆన్. ఇస్లామ్ ధర్మంలో జకాత్ దానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సంపన్నులు జకాత్ డబ్బును దానం చేయకపోతే అలాంటి వారు పరలోకంలో శిక్షకు అర్హులని ఖుర్ఆన్ తీవ్రంగా పరిగణిస్తోంది. సంపద పోగుపెట్టి ఉంచడాన్ని తీవ్రంగా నిరసిస్తోంది.

జకాత్ గురించి ఖుర్ఆన్ బోధనలు..

విశ్వసించిన ప్రజలారా! క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని, ఆ (చివరి) దినము రాకపూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల నుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మార్గులు.(2:254)

177 సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ ను అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలనూ హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడేధనాన్ని బంధువుల కొరకూ, అనాధుల కొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకూ, సహాయం చెయ్యండి అని అర్థించేవారి కొరకూ, ఖైదీలను విడుదల చెయ్యటానికి వ్యయ పరచటం. ఇంకా నమాజును స్థాపించటం, జకాత్‌ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించేవారూ, కష్టకాలంలో, లేమిలో, సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపేవారూ సత్పురుషులు. వాస్తవంగా సత్యసంధులు, అల్లాహ్ ఎడల భయభక్తులు కలవారు వీరే. (2:177)

విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాదించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవమార్గంలో ఖర్చుపెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఏరితీసే ప్రయత్నం చెయ్యకండి. ఒకవేళ ఆ వస్తువులనే ఎవరన్నా మీకు ఇస్తే, వాటిని మీరు తృణీకార భావంతో తప్ప, మనసారా స్వీకరించరు కదా! అల్లాహ్ కు ఏదీ ఏమాత్రం అవసరం లేదనీ ఆయన మహోత్తమమైన గుణములు కలవాడనీ మీరు తెలుసుకోండి. (2:267)

. నమాజును స్థాపించండి. జకాత్‌ ఇవ్వండి. మీ భవిష్యత్తుకోసం మీరు చేసి ముందుగా పంపించే సత్కార్యాలను మీరు అల్లాహ్ వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది.(2:110)




ప్రపంచం చూపు ఇస్లామిక్ బ్యాంకింగ్ వైపు...

ఖుర్ఆన్ గ్రంథమంటే కేవలం ధార్మిక గ్రంథ బోధనలకే పరిమితంకాదు. చక్కని ఆర్థిక విషయాలను నేర్పుతోంది. ఫైనాన్స్ సిస్టమ్ గురించి ఖుర్ఆన్ చెప్పే ఆర్థిక నీతి మరే గ్రంథంలోనూ మనకు కానరాదు. వడ్డీ లావాదేవీలపై నడిచే నేటి ఆర్థిక వ్యవస్థ గాలిబుడగలా మారింది. దాని దుష్ఫరిణామాలను ఏటా ఆక్స్ ఫామ్ నివేదిక ప్రపంచంముందుంచుతూనే ఉంది. అయితే కుర్ఆన్ చూపే ఆర్థిక వ్యవస్థ అందుకు విభిన్నం. ఖుర్ఆన్ వడ్డీని తీవ్రంగా నిషేధించింది.  అందుకే ప్రపంచమంతా ఇప్పుడు ఇస్లామిక్ బ్యాంకింగ్ వైపు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకింగ్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. మలేషియా,  ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, దుబయ్ ఇస్లామిక్ బ్యాంక్, నూర్ ఇస్లామిక్ బ్యాంకు ఇవన్నీ వడ్డీలేని రుణాలతో ఇస్లామ్ ఆర్థిక పనాదులపై విజయవంతంగా ముందుకెళుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఇండియా కూడా ఇస్లామిక్ బ్యాంకు గురించి ఎంతో కాలంగా యోచిస్తోంది. ఇస్లామిక్ ఎకానమీవైపు అడుగులువేసేలా ఆలోచిస్తోంది. కేరళలో ఇస్లామిక్ ఫైనాన్స్ దిగ్విజయంగా నడుస్తోంది.
ఉరుముతున్న పర్యావరణ కాలుష్యం
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..



రచయిత-ముహమ్మద్ ముజాహిద్ 
సెల్ నెం- 964062k2076






అందమైన ప్రపంచం...ఉప్పొంగే కడలి కెరటాలు...పచ్చదనం పరుచుకున్న పచ్చటి బయళ్లు ఆహ్లాదాన్ని పంచే అరణ్యాలు, పరవళ్లు తొక్కే నదీజలాలు, తలెత్తి చూసే ఎత్తైన కొండలు, పర్వతాలు, కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, చెంగుచెంగున ఎగిరే జంతుజాలాలు, రంగురంగుల సీతాకోకచిలుకలు, ప్రకృతి అందాలను ఎంతచూసినా తనివితీరదు, వర్ణించాలంటే మాటలు చాలవు


ఈ సృష్టిలో, ధరిత్రిపై, ఆకాశంలో ప్రాణులన్నీ ప్రకృతిసిద్ధంగా జీవితం గడుపుతున్నాయి. ఒక్క మనిషి తప్పా. మానవుడు దానవుడిలా మారిపోయాడు. తన బాధ్యతను మర్చిపోయాడు. దీనివల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నేటికి 250సంవత్సరాలక్రితం పారిశ్రామిక విప్లవం పురుడుపోసుకుంది. పెట్రోలు వాడుకలోకి వచ్చింది. కాళ్లకింద నేలను తవ్వుకుని బొగ్గుగనుల ద్వారా విద్యుత్తు తయారుచేసుకుంటున్నాము. నదీజలాలపై డ్యాములు నిర్మించుకున్నాము. ఇలా ఎన్నోఎన్నెన్నో ఆవిష్కరణలు చేసుకున్నాము.  పరిశ్రమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడం, పారిశ్రామిక వేత్తల స్వార్థపరత్వం పుణ్యమా అని అనవసర ఉత్పత్తి పెరుగుతూపోయింది. ప్రచార, ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవపట్టించి అనవసరమైన వాటికి నిత్యావసరంగా మార్చే పెడధోరణులు పెరిగిపోయాయి. ప్రకృతిసిద్ధమైన ఆకులు, పూలు, బెరడ్లను నేలపై పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. కానీ పాలిథీన్ నేలలో కలిసిపోవాలంటే వందేళ్లు పడుతుంది. ఇటీవలె సముద్రంలో అతిపెద్ద వేల్ చేప దొరికింది. దాని కడుపులోనుంచి 40కిలోల పాలిథిన్ లభ్యమయ్యిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆవులు పాలిథిన్ నమిలి మృత్యువాత పడుతున్న సంఘటనలు మనం పత్రికల్లో చదువుతున్నాము. పాలిథిన్ కుళ్లిపోదు. దాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావడమే మార్గం. ఒకవేళ పాలిథిన్ ను కాల్చివేస్తే ప్రమాదకరమైన గ్యాస్ బయల్పడుతుంది. కార్బన్ డై యాక్సైడ్ లాంటి ప్రమాదకరమైన వాయువులు మనిషికి ప్రాణాంతకమవుతాయి. దీనివల్ల ధరిత్రి సాధారణ ఉష్ణోగ్రత పెరుగుతుంది. కెనడా, ఐస్ లాండ్ తదితర ప్రపంచ నలుమూలల్లో ఉన్న మంచుపర్వతాలు కరుగుతున్నాయి. ఆ మంచు పర్వతాలు కరగడం వల్ల సముద్రమట్టం పెరుగుతుంది. సముద్రమట్టం పెరగడం వల్ల సముద్ర తీరప్రాంతాలలో ఉన్న నగరాలు కనుమరుగయ్యే ప్రమాదముంది. లండన్, న్యూయార్క్, ఇటు మనదేశంలోనూ ముంబయి, కలకత్తా, మద్రాసు, సూరత్, కాలికట్, త్రివేండ్రం లాంటి నగరాలన్నీ సముద్రతీరప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా నగరాల్లో కోట్లాదిమంది ప్రజలు నివాసముంటున్నారు. 



 సాధారణ ఉష్ణోగ్రతకంటే కేవలం ఒక్క డిగ్రీ పెరిగినందుకే జరుగుతున్న దుష్ప్రభావాలను మనం తట్టుకోలేకపోతున్నాము. గత ఏడాది యూరప్ లాంటి దేశాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మనదేశంలోనూ వాతావరణం గాడితప్పింది. ఉత్తర భారతదేశంలో చలి గజగజవణికించింది. ఈసారి చలికాలంలో ఢిల్లీ ఉష్ణోగ్రత 2డిగ్రీలకు దిగజారింది. మార్చి మొదటివారంలో ఎముకలు కొరికే చలిలో ప్రజలు వణికిపోయారు. అకాల వర్షాలు పడుతున్నయి. పంట చేతికొచ్చి కాపుకొచ్చే సమయంలో వర్షాలు కురవడం వల్ల తిండిగింజలన్నీ నేలపాలవుతున్నాయి. ఆరుగాల శ్రమించిన పంటంతా మట్టి పాలవుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉష్ణోగత్ర మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది. గాడితప్పుతున్న వాతావరణం, గాడితప్పుతున్న మానవుడి జీవనశైలి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తో కార్బన్ డై యాక్సైడ్ పెరుగుతుంది. పెట్రోలుతో, డిజీల్ తో నడిచే వాహనాల వల్ల వెలువడే పొగ  వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సముద్రపు నీటిలో ఒక్కశాతం కార్బన్ డై యాక్సైడ్ పెరిగినా అందులో పెరిగే జీవరాశులన్నింటికీ ప్రాణాంతకంగా మారుతుంది. మరోవైపు నదుల్లో, కాలువల్లో పారవేసే పాలిథిన్, ప్లాస్టిక్ బాటిళ్లతో సముద్రాలు కలుషితమవుతున్నాయి. అవసరానికి మించి పెరుగుతున్న వాడకం, మితిమీరిన వాడకం ఏదైనా అనర్థదాయకమే అవుతుంది. విద్యుత్తు, నీరు, ఇలా ప్రకృతివనరులేమైనా కానీ అవసరానికి మించి వాడకుండా జాగ్రత్తపడితే పర్యవావరణాన్ని కాపాడుకోవచ్చు. జీవావరణాన్ని కాపాడుకునే బాద్యత ప్రతీఒక్కరిపై ఉంది. జీవావరణాన్ని తన సహజత్వంగా ఉండేలా మనవంతు కృషిచేయాలి. రుతువులు సక్రమంగా వచ్చేలా, కాలాలు గాడితప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చుక్క నీటిని కూడా వృథాచేయరాదు. ఇ-వ్యర్థాలు బ్యాటరీలు, ట్యూబ్ లైట్లు, పాడయిపోయిన కంప్యూటర్ పార్ట్స్ ను నేలపాలు చేయకుండా వాటిని తిరిగి ఉపయోగంలోకి వచ్చేలా చేయాలి. లేదంటే మనిషి ఆయువు తగ్గుతుంది. మనిషి సహజ మరనానికి ఆరేళ్లు ముందే చావుకోరల్లోకి పోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణంపై ప్రతీ ఒక్కరిలో చైతన్యం కలగాలి. ఈ ప్రకృతి ఎలా సృష్టించబడిందో ఆలానే సహజంగా ఉండాలి. ‘ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ ను స్తుతిస్తోంది.’ అంటోంది ఖుర్ఆన్. ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతీ ప్రాణీ, జంతువు, వస్తువు అల్లాహ్ ఆదేశపాలనలో నిమగ్నమయ్యాయి. వాటి వాటి హద్దుల్లో పనిచేస్తున్నాయన్నది ఈ ఖుర్ఆన్ వాక్యం అర్థం. అల్లాహ్ సృష్టించిన ఈ విశ్వవ్యవస్థలో మనిషి ఒక్కడే హద్దులు మీరుతున్నాడు.దేవుడు మనిషికి లోబర్చిన ప్రకృతి వనరులను తన స్వార్థంకోసం ధ్వంసం చేస్తున్నాడు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. ఎంతైతే  ఈ ప్రకృతినుంచి తీసుకుంటున్నాడో తిరిగి ఏమీ ఇవ్వడం లేదు. ‘ప్రళయం ముంచుకొస్తున్నా ఒక మొక్కను నాటాలని చెప్పారు ప్రవక్త మహనీయులు.  ప్రవహిస్తున్న నీటిలో మూత్రవిసర్జన చేసేవారిని శపించారు. నీడనిచ్చే చెట్లకింద మలమూత్రాలు చేయడాన్ని తీవ్రంగా ఎండగట్టారు. మనిషి చేసే తప్పిదాల వల్ల భూమిపై నివసించే ప్రాణులుకానీ, నీళ్లల్లో నివసించే చేపలు కానీ, ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే పక్షులు కానీ ఏ ప్రాణీ సురక్షితంగా బతికిబట్టగట్టాలంటే మనిషి పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
ఇస్లాంలో ప్రతి చర్య లోకహితం...సమాజ హితం
జకాత్ డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రికి ఐసీయూను నిర్మించిన ముస్లింలు
ప్రశంసించిన సీఎం ఉద్దవ్ ఠాక్రే


రచయిత-ముహమ్మద్ అజ్గర్ అలీ
రాజనీతి తత్వ శాస్త్ర అధ్యాపకులు 
రాజనీతి శాస్త్ర  శాఖాధిపతి(Rtd.) తెనాలి.

సెల్ నెం-94915-01910


జకాత్ విరాళాలతో ముస్లింలు నిర్మించిన ఐసీయూ ఇదే


ఇస్లాం సమాజం మేలు కోరుకొంటుంది. తమ పక్కంటి వారి పట్ల కూడా తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను తెలియజేస్తుంది. మరి సమాజహితం కోసం ముస్లింలను ఇస్లాం ఎలా తయారు చేస్తుందో ఇట్టే అర్థమవుతుంది. నిజమైన ముస్లిం ఎప్పటికి లోక హితం, సమాజ హితం కోరుకొంటాడు. ఇలాంటి ఘటనలు చరిత్ర మొదలైన నాటి నుంచి మనం చూస్తున్నాం, నాటికి, నేటికి, ఏ నాటికి చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమాజ హిత కార్యక్రమమే లాక్ డౌన్ వేళ ముస్లింలు తమ జకాత్ విరాళాలతో చేశారు. 
మహారాష్ట్రలోని ఇచల్‌కరంజీ పట్టణంలోని ముస్లింలు మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే  నుండి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక ముస్లింలు జకాత్ ద్వారా సేకరించిన డబ్బు సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి 10 పడకల ఐసియును విరాళంగా ఇవ్వడం ద్వారా ఈద్ పండుగను జరుపుకున్నారు. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రయత్నాలకు దోహదం చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. ముస్లింలు జకాత్ ద్వారా సేకరించిన రూ. 36 లక్షలు పట్టణంలోని ఇందిరా గాంధీ మెమోరియల్ (ఐజిఎం) సివిల్ హాస్పిటల్‌కు 10 పడకల, చక్కటి అన్ని సౌకర్యాలు గల ఐసియును విరాళంగా ఇచ్చారు.  భారతదేశంలో COVID-19 చేత దెబ్బతిన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి 2011 జనాభా లెక్కల ప్రకారం ఇచల్కరంజీ పట్టణం లో 2.88 లక్షల జనాభా ఉంది, 78.32% హిందూ జనాభా మరియు 15.98% ముస్లిం జనాభా ఉంది.  ఐసియు సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సోమవారం ప్రారంభించారు. ఈ చొరవను ప్రశంసించిన ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, “ఇచల్‌కరంజీలోని ముస్లింలు దేశంలోని ప్రతి ఒక్కరికీ మార్గం చూపించారు. ప్రజల భాగస్వామ్యం (మహమ్మారిపై పోరాడటానికి) అవసరం. పండుగను ఎలా జరుపుకోవాలో చూపడం ద్వారా ముస్లిం సమాజం ఒక ఉదాహరణగా నిలిచింది. ”అని అన్నారు.

ముస్లిం వ్యోమగాములు 


రచయిత-ముహమ్మద్ అజ్గర్ అలీ
రాజనీతి తత్వ శాస్త్ర అధ్యాపకులు 
రాజనీతి శాస్త్ర  శాఖాధిపతి(Rtd.) తెనాలి.

సెల్ నెం-94915-01910





అంతరిక్షయానం  ప్రతి ఒక్కరు కోరుకొంటారు కాని భూగ్రహం మీద ఉన్న కొద్దిమంది మానవులకు  మాత్రమే అది సంభవిస్తుంది.  “మనలో చాలా మందికి  ముస్లిం వ్యోమగాములు ఉన్న విషయం తెలియదు. 11మంది  ముస్లిం వ్యోమగాములు  అంతరిక్షయానం చేశారు. అంతరిక్షయానం చేసిన 11 మంది ముస్లిం వ్యోమ్యగాములను గురించి తెలుసుకొందాము:

1.  సుల్తాన్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్
అజీజ్ అల్-సౌద్ (జననం జూన్ 27, 1956) - సౌదీ అరేబియా - మాజీ రాయల్ సౌదీ వైమానిక దళ పైలట్, మిషన్ -STS-51-G (జూన్ 17,1985)- మొదటి ముస్లిం వ్యోమ గామి. అంతరిక్షం లో మొదటి సౌదీ మరియు అరబ్  వ్యోమ గామి.

2.ముహమ్మద్ అహ్మద్ ఫారిస్ -
సిరియా (జననం మే 26, 1951)మిషన్  -మీర్ ఇపి -1 (జూలై 22, 1987)-సిరియా సైనిక విమానయాన నిపుణుడు.. ముహమ్మద్ ఫారిస్ - అంతరిక్షంలో మొదటి సిరియన్ మరియు అంతరిక్షంలో రెండవ అరబ్.

3.సోవియట్ యూనియన్ (ప్రస్తుతం అజర్‌బైజాన్)...మూసా మనారోవ్
మిషన్- మీర్ EO-3 (డిసెంబర్ 21, 1987)&సోయుజ్ టిఎం -11 (డిసెంబర్ 2, 1990) -అంతరిక్షంలో మొదటి అజర్‌బైజానీ.-మొత్తం 541 రోజులు అంతరిక్షంలో గడిపాడు. ముసా ఖిరమనోవిచ్ మనారోవ్ (అజర్‌బైజాన్: ముసా మనారోవ్) మార్చి 22, 1951 న అజర్‌బైజాన్ లోని బాకులో జన్మించారు. అతను సోవియట్ వైమానిక దళంలో కల్నల్ మరియు 1974 లో మాస్కో ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ డిప్లొమాతో పట్టభద్రుడయ్యాడు. ముసా 1978 డిసెంబర్ 1 న కాస్మోనాట్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నాడు.


4.ఆఫ్ఘనిస్తాన్-అబ్దుల్ అహాద్ మొహమండ్.
మిషన్-మీర్ ఇపి -3 (ఆగస్టు 29, 1988)-అంతరిక్షంలో మొదటి ఆఫ్ఘన్ వ్యోమ గామి. అబ్దుల్ అహాద్ మొమాండ్ (జననం జనవరి 1, 1959) మాజీ ఆఫ్ఘన్ వైమానిక దళం ఏవియేటర్, అతను 1988 లో మీర్ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది రోజులు ఇంటర్‌కోస్మోస్ రీసెర్చ్ కాస్మోనాట్‌గా గడిపినప్పుడు అంతరిక్షంలో మొదటి ఆఫ్ఘన్ అయ్యాడు. సుల్తాన్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్, ముహమ్మద్ ఫారిస్ మరియు మూసా మనారోవ్ తరువాత అతను అంతరిక్షానికి చేరుకున్న నాల్గవ ముస్లిం. మొమండ్ జనవరి 1, 1959 న ఆఫ్ఘనిస్తాన్లోని ఘజ్నిలోని సర్దాలో జన్మించాడు. అతను పష్తున్ జాతికి చెందిన మొహమాండ్ తెగకు చెందినవాడు. మోమండ్ కాబూల్ యొక్క పాలిటెక్నికల్ విశ్వవిద్యాలయం నుండి మరియు తరువాత వైమానిక దళం అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను ఆఫ్ఘన్ వైమానిక దళంలో పనిచేశాడు మరియు తరువాత సోవియట్ యూనియన్లో పైలట్ మరియు ప్రొఫెషనల్ వ్యోమగామిగా శిక్షణ పొందాడు.

5. సోవియట్ యూనియన్... తోక్తార్ అబాకిరోవ్ 
(ప్రస్తుతం కజకిస్తాన్ - తోక్తార్ అబాకిరోవ్-మిషన్ -సోయుజ్ టిఎం -13 (అక్టోబర్ 2, 1991) -అంతరిక్షంలో మొదటి కజఖ్ వ్యోమ గామి. తోక్తార్ ఒంగర్‌బాయూలీ అబాకిరోవ్ జూలై 27, 1946 న కజకిస్తాన్‌లోని కరాగండాలో జన్మించారు) రిటైర్డ్ కజకిస్తానీ వైమానిక దళం అధికారి మరియు మాజీ కాస్మోనాట్
అతను వైమానిక దళ సంస్థ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు కజకిస్తాన్ వైమానిక దళంలో మేజర్ జనరల్ హోదాతో పారాచూటిస్ట్ మరియు టెస్ట్ పైలట్.

6.కజకస్తాన్- తల్గాట్ ముసాబాయేవ్-మిషన్-సోయుజ్ టిఎం -19 
(నవంబర్ 4, 1994)&సోయుజ్ టిఎం -27 (ఆగస్టు 25, 1998)&సోయుజ్ టిఎం -32 (మే 6, 2001)-అంతరిక్షంలో రెండవ కజక్, అంతరిక్షంలో మొత్తం 341 రోజులు గడిపిన వ్యోమ గామి తల్గాట్ అమంగెల్డ్యూలీ ముసాబాయేవ్  జననం జనవరి 7, 1951, కార్గలీ, కజకస్తాన్. కజఖ్ టెస్ట్ పైలట్ మరియు మూడు అంతరిక్ష విమానాలలో ప్రయాణించిన మాజీ కాస్మోనాట్. ముసాబాయేవ్ 1974 లో రిగాలోని ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత 1983 లో అఖ్తుబిన్స్క్ లోని హయ్యర్ మిలిటరీ ఏవియేషన్ స్కూల్ నుండి ఇంజనీరింగ్ డిప్లొమాతో పట్టభద్రుడయ్యాడు. ముసాబాయేవ్ ఏరోబాటిక్ ఫ్లైయర్‌గా అనేక అవార్డులను అందుకున్నాడు మరియు మే 11, 1990 న కాస్మోనాట్‌గా ఎంపికయ్యాడు. 1991 లో, అతను మేజర్‌గా నియమించబడ్డాడు మరియు వైమానిక దళం (TsPK-11) యొక్క కాస్మోనాట్ సమూహానికి బదిలీ అయ్యాడు అతను నవంబర్ 2003 లో కాస్మోనాట్‌గా పదవీ విరమణ చేశాడు. 2007 నుండి అతను కజకిస్తాన్ యొక్క నేషనల్ స్పేస్ ఏజెన్సీ, కాజ్‌కోస్మోస్‌కు అధిపతిగా ఉన్నాడు.


7.రష్యా (కిర్గిస్తాన్ లో జన్మించినాడు.) -సాలిజాన్ షరిపోవ్, 
మిషన్--STS-89 (జనవరి 20, 1998)-యాత్ర 10 (అక్టోబర్ 14, 2004) -అంతరిక్షంలో మొత్తం 201 రోజులు గడిపినాడు. సాలిజాన్ షాకిరోవిచ్ షరిపోవ్ (జననం ఆగస్టు 24, 1964 ఉజ్జెన్, ఓష్ ఓబ్లాస్ట్, కిర్గిస్తాన్. ఉజ్బెక్-కిర్గిజ్ కాస్మోనాట్. రెండుసార్లు అంతరిక్షంలోకి వచ్చాడు మరియు రెండు అంతరిక్ష నడకలను నిర్వహించాడు. షరీపోవ్ 1987 లో సోవియట్ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. 1994 లో, అతను మాస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి కార్టోగ్రఫీలో పట్టభద్రుడయ్యాడు షరిపోవ్ జూలై 18, 2008 న పదవీ విరమణ చేశారు. ఫుట్‌బాల్ మరియు రీడింగ్ ఇతని హాబీలు.

8. అనౌషే అన్సారీ‌:‌
యునైటెడ్ స్టేట్స్ (ఇరాన్లో జన్మించారు) – మిషన్ -సోయుజ్ టిఎంఎ9 (సెప్టెంబర్ 18, 2006)-మొదటి మహిళా అంతరిక్ష టూరిస్ట్ /పర్యాటకురాలు- అంతరిక్షంలో మొదటి ముస్లిం మహిళ అనౌషే అన్సారీ సెప్టెంబర్ 12, 1966 న ఇరాన్ లోని మషద్ లో జన్మించారు. ఆమె అంతరిక్షంలో మొదటి ఇరానియన్ అయ్యింది.
అనౌషే అన్సారీ 1984 లో యుక్తవయసులో అమెరికాకు వలస వచ్చింది. ఆమె స్థానిక పెర్షియన్ ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో నిష్ణాతులు, మరియు ఆమె స్పేస్ ఫ్లైట్ అనుభవం కోసం రష్యన్ భాషలో పని పరిజ్ఞానాన్ని సంపాదించింది

9. షేక్ ముస్జాఫర్ షుకోర్
మలేషియా-మిషన్  -సోయుజ్ టిఎంఎ -11 (అక్టోబర్ 10, 2007)-అంతరిక్షంలో మొదటి మలేషియన్ మలయ్ షేక్ ముస్జాఫర్ షుకోర్ జననం జూలై 27, 1972.  మలేషియా ఆర్థోపెడిక్ సర్జన్ మరియు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మలేషియన్. షేక్ ముస్జాఫర్ కౌలాలంపూర్‌లో జన్మించాడు భారతదేశంలోని మణిపాల్ లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ పట్టా పొందారు. షేక్ ముస్జాఫర్ మెడికల్ ఆఫీసర్, మరియు యూనివర్సిటీ కేబాంగ్సాన్ మలేషియాలో మెడిసిన్ విశ్వవిద్యాలయ వైద్య అధికారి. షేక్ ముస్జాఫర్ కూడా పార్ట్‌ టైమ్ మోడల్

10.కజాకస్తాన్-సోయుజ్ టిఎంఎ
ఐడిన్ ఐంబెటోవ్-మిషన్-సోయుజ్ టిఎంఎ -18 ఎమ్ (సెప్టెంబర్ 2,2015)-అంతరిక్షంలో మూడవ కజక్-జననం 27 జూలై 1972) కజఖ్ కాస్మోనాట్.ఐంబెటోవ్ కుతాఖోవ్ అర్మావిర్ హయ్యర్ మిలిటరీ ఏవియేషన్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు మిలటరీ పైలట్ అయ్యాడు, జూన్ 2015 లో సోయుజ్ టిఎంఎ -18 ఎమ్ మిషన్‌లో ప్రయాణించడానికి ఎంపికయ్యాడు.ఐంబెటోవ్ వివాహం మరియు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు.

11.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-హజ్జా అల్మాన్సూరి Hazza Almansoori
మిషన్ -సోయుజ్ ఎంఎస్ -15 (సెప్టెంబర్ 25, 2019)-అంతరిక్షంలో మొదటి ఎమిరాట-జననం డిసెంబర్ 13, 1983 (వయసు 36)-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- జాతీయత ఎమిరేట్. హజ్జా అల్ మన్సౌరి పూర్తి పేరు హజ్జా అలీ అబ్దాన్ ఖల్ఫాన్ అల్ మన్సౌరి (هَزَّاع عَلِي ٱلْمَنْصُوْرِي an) అంతరిక్షంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క  మొదటి వ్యోమగామి. అల్ మన్సౌరి డిసెంబర్ 13, 1983 న అబుదాబి శివారు అల్ వాత్బాలో జన్మించాడు..అల్ మన్సౌరీ ఖలీఫా బిన్ జాయెద్ ఎయిర్ కాలేజీలో చదువుకున్నాడు, 2004 లో విమానయానంలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. అతను యుఎఇ సాయుధ దళాలలో చేరాడు మరియు తరువాత మిలటరీ పైలట్ అయ్యాడు. అతను F-16 పైలట్‌గా పనిచేశాడు. అల్ మన్సౌరీ రష్యాలోని స్టార్ సిటీలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందారు. అల్ మన్సౌరీ జూలై 2007 లో వివాహం చేసుకున్నారు మరియు నలుగురు పిల్లలు ఉన్నారు: మరియం, అలీ, అబ్దుల్లా మరియు మన్సూర్.
స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్ర...కాదనలేని ఓ వాస్తవం
దేశ విముక్తి కోసం ఉరిని ముద్దాడిన వేలాది ముస్లిం యోధులు 
మాతృ భూమి కోసం...ప్రాణాలు విడిచిన 225 మంది ముస్లిం మహిళలు
దాచినా దాగని సత్యాలు...నేటికి హోం శాఖ యొ దస్త్రాలలో అవి సజీవం
జనంలోకి వాస్తవం తీసుకెళ్లాల్సింది నేటి ముస్లిం సమాజమే



రచయిత-ముహమ్మద్ అజ్గర్ అలీ
రాజనీతి తత్వ శాస్త్ర అధ్యాపకులు 
రాజనీతి శాస్త్ర  శాఖాధిపతి(Rtd.) తెనాలి.
సెల్ నెం-94915-01910




చరిత్ర విస్మరించిన దేశ విముక్తి కోసం ముస్లిం స్వాతంత్ర్య పోరాట యోధులు మిగిల్చిన స్పూర్తి నేటికి తరిగిపోనిది. దాచిన దాగని సత్యం...వేల మంది ముస్లింలు దేశ విముక్తి కోసం ఉరి కంభం ఎక్కారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27వేలకు పైగా అమరులయ్యారు. ముస్లిం మహిళలు సైతం దాదాపు 225 మంది దేశ స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని బ్రిటీషర్ల అమానుష చర్యలకు బలయ్యారు. ఎంతో మంది ముస్లిం ప్రముఖులు ఏళ్లకు ఏళ్ల జైలు జీవితం గడిపారు. వీటిని ఎవరు దాచినా మన దేశ భారత హోంశాఖ నివేదికల్లో మాత్రం ఈ వాస్తవాలు చెక్కచెదరకుండా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా చరిత్రలో చేరకుండా ఉండిపోయిన దేశ విముక్తి కోసం పోరాడిన ముస్లిం యోధుల గురించి నేటి సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది. ఆ బాధ్యత నేటి యువతరానిదే. వాస్తవం జనంలోకి తీసుకెళ్లాలన్న ఏకైక స్పూర్తితో వెలుగులోకి వస్తున్నవే ఈ వాస్తవాలు. ముస్లిం సోదరులారా ఇకనైనా మేలుకొండి...మన యోధుల గురించి చెప్పాల్సిన బాధ్యతను భుజాన వేసుకోండి. నాకెందుకులే అనుకొంటే అసలు ఈ దేశంలో మీకు స్థానం లేదంటూ దుష్ప్రాచారం చేస్తున్న వారికి మీరే స్వయంగా సహకరించినట్లు అవుతుంది. ఇకనైనా మేలుకోండి...తమ బాధ్యతను చేపట్టండి.

భారతీయ ముస్లింల పాత్ర లేని  భారత జాతీయ ఉద్యమం యొక్క చరిత్ర అసంపూర్తిగా, పక్షపాతంతో ఉంటుంది. కానీ భారత జాతీయ ఉద్యమంలో భారతీయ ముస్లింల పాత్ర గురించి ప్రెస్ లేదా పుస్తకాలలో తగినంత ప్రాధాన్యత(కవరేజీ) ఇవ్వలేదు. వాస్తవ చరిత్రకు బదులుగా ఇది వక్రికరించబడినది. ముస్లిం విప్లవకారులు, కవులు, రచయితల సహకారం నేటి తరానికి తెలియదు. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు ముహమ్మద్ అష్ఫాఖ్ ఉల్లా ఖాన్ గురించి తెలియదు.



అదేవిధంగా, భారతదేశ స్వాతంత్ర్యం కోసం జైలులో తన 95 సంవత్సరాల జీవితంలో 45 ఏళ్ళు జైలు లో గడిపిన గొప్ప జాతీయవాది సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి నేటి తరం విద్యార్థులకు  తెలియదు. భోపాల్ కు చెందిన బరకతుల్లా గదర్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి ఒక  నెట్ వర్క్ నే సృష్టించాడు. 1927 లో జర్మనీలో మరణించాడు. ఫ్రాన్స్ లో రహస్య విప్లవకారుడిగా పనిచేసిన గదర్ పార్టీ యొక్క వ్యవస్థాపకులలో ఒకరైన సయ్యద్ రహమత్ షా 1915 లో ఉరి తీయబడినాడు. ఫైజాబాద్ కు చెందిన అలీ అహ్మద్ సిద్దికి, మలయా, బర్మాలో భారతీయ తిరుగుబాటు కోసం కృషి చేసినారు. అతను   జౌంపూర్ కు చెందిన సయ్యద్ ముజ్తబా హుస్సేన్ తో పాటు 1917 లో ఉరితీయబడినారు. మహాత్మా గాంధీకి ఖాళీ చెక్ ను సమర్పించిన ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త, నాటి లక్షాధికారి ఉమర్ సుభాని, స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అర్పించారు.  ముహమ్మద్ బషీర్, ఖుదా బక్ష్, ఎ.జకారియా, జాఫర్ హసన్, అల్లా నవాజ్, అబ్దుల్ అజీజ్ లాంటి  వేలాది మంది విప్లవకారులను చరిత్రలో చేర్చకుండా నిర్లక్ష్యం చేయబడ్డారు. ముస్లింలు జాతీయ ఉద్యమానికి భారీగా దోహదం చేశారనుటలో   ఎటువంటి సందేహం లేదు. భారతదేశంలో బ్రిటీష్ పాలన రావడంతోనే  వారి పోరాటం ప్రారంభమైంది. 1857-58 మధ్య కాలంలో ఢిల్లీలో కేవలం  27,000 మంది  ముస్లింలను విద్రోహులు అనే నెపంతో ఉరి తీయబడ్డారు అని   ఖైసేర్-ఉల్-తవార్కి చెందిన ఆర్కైవ్స్ పేర్కొన్నారు. బ్రిటీష్ పాలన నుండి దేశం యొక్క విమోచనకు కృషి చేసిన వారిని గురించి  హోం శాఖ యొక్క దస్త్రాలు పేర్కొంటున్నాయి. సన్యాసి ఉద్యమం నుండి స్వాతంత్ర్యము వరకు అన్ని జాతీయ తిరుగుబాట్లు  అపారమైన త్యాగాలతో నిండి ఉన్నాయి. అది చివరకు 1947 లో భారతదేశం నుండి  బ్రిటీష్ ఉపసంహరణకు దారితీసింది.



50 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలలో కూడా ముస్లింలు జాతీయ పోరాటం లో నిర్వహించిన పాత్ర పాత్రికేయులచే అశ్రద్ధ చేయబడినది. ఆల్-ఇండియా మిల్లి కౌన్సిల్, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నిర్వహించిన “కారవాన్-ఎ-అజాది ర్యాలీ” శ్రీరంగపట్నం మరియు సిల్చార్ (అస్సాం) నుండి  ప్రారంభించ బడినది. దేశం కోసం పోరాడిన సుల్తాన్ టిప్పు యొక్క సమాధి స్థలం నేడు  యువకుల క్రికెట్ ప్రాక్టిస్  గ్రౌండ్ గా మారినది. స్థానిక పరిపాలకాదికారులు  కూడా దీనిని అడ్డుకోలేదు. భారతదేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను అర్పించిన గొప్ప దేశభక్తుల పట్ల భారతీయుల అజ్ఞానంను  ఇది చూపిస్తుంది. ఇండియన్ నేషనల్ ఉద్యమం గురించి అనేక  పుస్తకాల వచ్చాయి. కానీ వాటిలో  ముస్లింల పాత్ర గురించి స్వల్ప ప్రస్తావనలు మాత్రమే కలవు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వందలాది మంది మహిళల్లో కేవలం బేగం హజ్రత్ మహల్, బి-అమ్మలను గురించి మాత్రమే మన్మోహన్ కౌర్ తన పుస్తకం లో పేర్కొన్నారు. అనేక మోనోగ్రాఫ్లు, అందులో శాంతిమాయ్ రే “ఫ్రీడం మూవ్మెంట్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్” లేదా పి.ఎన్. చోప్రా'స్ “రోల్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ ఇన్ ది స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం” లేదా కమతా చౌబే యొక్క “ముస్లిమ్స్ అండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా” మరియు ముస్లింల పాత్ర గురించి ముజాఫర్ ఇమామ్ “రోల్ అఫ్ ముస్లిమ్స్ ఇన్ ది నేషనల్ మూవ్మెంట్” మరియు హసన్ ఇమామ్ యొక్క “ఇండియన్ నేషనల్ మూవ్మెంట్” వంటి కొన్ని ప్రాంతీయ అధ్యయనాలు ప్రచురించబడ్డాయి. కానీ విషయం విస్తృతమైనది. ఒక సమగ్ర అధ్యయనం అవసరం. ఇటువంటి అధ్యయనాలు ముస్లింల పట్ల ఉన్న దురభిప్రాయాలు తొలగించడం లో సహాయ పడుతాయి. ముస్లింల త్యాగాలను చరిత్రలో ఎక్కించేవారు లేకపోవడమే ఇందుకు ఓ కారణం. ఈ విషయంలో అద్భుతమైన పుస్తకం ప్రొఫెసర్ షాన్ ముహమ్మద్ వ్రాసిన ముస్లిమ్స్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్. దీనిని అయన  భారతదేశ స్వతంత్రతకు బాధ్యులైన వారికి అంకితమిచ్చినారు. 



జాతీయ ఉద్యమం లో ముస్లింలు  ఇతర వర్గాలతో కల్సి భుజం భుజం కలిపి పోరాడారు. బ్రిటిష్ వారు దేశాన్ని విడిచి వెళ్ళేటట్లు నిరంతర పోరాటం జరిపారు. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని  ప్రారంభ దశలో ఫరీజి, వహాబి ఉద్యమాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ ఉద్యమాలు బ్రిటీష్ వారిని  తరమటానికి చేసిన అత్యంత వ్యవస్థికృత   పోరాటాలు అని పిలువ బడాయి. వాహాబీలు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన తోలి  స్వతంత్ర సమర యోధులు. భారతదేశంలో ఆంగ్లేయుల బస తాత్కాలికమైనది అని వారు  అన్నారు. స్వేచ్ఛ కోసం జరిపిన పోరాటంలో వారి పాత్ర జాతీయ చరిత్రలో తగినంతగా లిఖించ బడలేదు. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం మహిళల పాత్ర, సహకారం వాస్తవానికి చరిత్రకారులచే పూర్తిగా విస్మరించబడడిందనే  వాస్తవం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముస్లిం మహిళలు తమ సహచరులతో పాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. 1857 లో  అశ్గారీ బేగం (ముజాఫర్ నగర్ యొక్క విప్లవకారుడు  ఖాజీ అబ్దుర్ రహీమ్ తల్లి) ఆంగ్లేయులతో పోరాడారు. సజీవంగా దహనం చేయబడినారు. అదేవిధంగా హబీబా, రహిమి అంగ్లేయులచే ఉరి తీయబడ్డారు. సుమారు 225 మంది ముస్లిం మహిళలు 1857 తిరుగుబాటు లో  తమ ప్రాణాలను సమర్పించారు. భారత జాతీయోద్యమ చరిత్రలో  అజరామరం అయిన వీర నారి మణులలో అబిది బేగం (మౌలానా ముహమ్మద్ అలీ తల్లి), అంజాది బేగం (మౌలానా ముహమ్మద్ అలీ భార్య), నిషాత్-ఉన్-నిసా (బేగం హస్రత్ మోహని), సాదాత్ బానో కిచ్లు  (డాక్టర్ సైఫుద్దీన్ భార్య), బేగం ఖుర్షీద్ ఖ్వాజా (MAఖ్వాజా భార్య) జులేఖ బేగం (మౌలానా ఆజాద్ భార్య), ఖదీజా బేగం, సరిహద్దు ప్రాంతం లోని ఖుర్షీద్ సాహిబా, మెహర్ తాజ్ (ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కుమార్తె), జుబేదా బేగం దావుది (దావుది షఫీ యొక్క భార్య – బీహార్ )  కనీజ్ సజిదా  బేగం(బీహార్) మునీరా  బేగం (మౌలానా మజ్హార్-ఉల్-హక్ భార్య), అస్మాత్ ఆరా బేగం సుగ్రా ఖాతూన్  (లక్నో), అమీనా త్యాబ్జీ (అబ్బాస్ తయాబ్జీ భార్య), బేగం సకినా లుక్మని  (ప్రముఖ జాతీయవాది డాక్టర్ లుక్మని మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ కుమార్తె), రహనా తయాబ్జీ ( అబ్బాస్ త్యాబ్జీ యొక్క కుమార్తె ), హమీదా తాయబ్జి , (షంషుద్దీన్ త్యాబ్జీ యొక్క మనుమరాలు) ఫాతిమా తయాబ్ అలీ, సఫీయా సాద్ ఖాన్, షాఫాత్-అన్-నిసా బీబి (మౌలానా హబిబుర్ రెహమాన్  భార్య, లుదియనా ) కుల్సుం  సియానీ (డాక్టర్ జాన్ ముహమ్మద్ ఎస్ భార్య సియనీ) ముఖ్యులు.



వీరు  బెంగాల్ విభజన నుండి భారతదేశ విభజన వరకు  దాదాపు అన్ని రాజకీయ ఉద్యమాలలో తమ చేతుల్లో కాంగ్రెస్ బ్యానర్లుతో పాల్గొన్నారు. వారు ఖైదు చేయబడ్డారు, వీరిపై జరిమానా విధింప బడినది,  లాటి-ఛార్జ్ చేయబడ్డారు. వీరు దేశం కోసం సర్వస్వం త్యాగం చేసారు.  వారి జీవిత కథ జాతీయ ఉద్యమంలో ఒక భాగం, ఇది తిరస్కరించబడదు, నాశనం చేయబడదు. “కలెక్టడ్ వర్క్స్ అఫ్ గాంధీ ”  లో స్వేచ్ఛ కోసం భారతదేశం జరిపిన  పోరాటంలో వారి అద్భుతమైన పోరాటం, త్యాగం గురించి  ప్రస్తావించబడినది.

లోక్ సభలో పెరుగుతున్న మహిళా ప్రాతినిధ్యం
అయినా పెరుగుదల నామ మాత్రమే
యూపీ, బెంగాల్ నుంచే అత్యధిక మహిళా ఎంపీలు
కొన్ని రాష్ట్రాల్లో మహిళా ఎంపీలే లేరు
2019 లోక్ సభ ఎన్నికలలో మహిళా అభ్యర్ధులు... ఎన్నిక విశేషాలు


రచయిత-పర్వీన్ సుల్తానా అబుదాబి 





2019 ఎన్నికలు మహిళా పరంగా మిశ్రమ పలితాలను ఇచ్చాయి.ఈ ఎన్నికలలో  కొందరు ప్రముఖ మహిళలు పోటిచేసిన తమ స్థానాలలో పరాజయం పొందగా  మరి కొందరు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో అన్ని రాజకీయ  పక్షాల నుండి మొత్తం 724 మహిళలు పోటిచేయగా(అందులో ఇండిపెండేంట్లు 200 మంది కలరు) 7,334 పురుష అభ్యర్ధులు  పోటిచేసినారు. 

కాంగ్రస్ 54 మందికి బిజెపి 53 మంది మహిళలకు సీట్లు కేటాయించారు. పోటి చేసిన మహిళలలో 78 విజయం పొందారు. వీరిలో అధికులు వెస్ట్ బెంగాల్, యూ.పి. కి చెందినవారు. ఆ రాష్ట్రాల నుంచి వరుసగా 12, 11 మంది ఎన్నికైనారు. 2014లో 62 మహిళలు  విజయం సాధించారు. భారత దేశం జనాభా లో మహిళలు 48% కలరు. జనాభా దృష్ట్యా లోక్ సభ లో 175 పొందాలి. కాని ఈ సారి మాత్రం 78 మంది మాత్రమే ఎన్నికైనారు. అది లోకసభ లో 14.6% మాత్రమే. 33% విమెన్ రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు కార్యాచరణ లోనికి వస్తుందో వేచి చూడాలి. లోక్ సభ లో మహిళల ప్రాతినిద్యం నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ అది ప్రపంచ ప్రమాణాల దృష్ట్యా మరింత తక్కువ. మొదటి లోక్ సభ లో మహిళా ప్రాతినిద్యం 5% ఉండగా ప్రస్తతం అది 14% కు పెరిగింది. రువాండా లో మహిళా ప్రాతినిద్యం 61% ఉండగా  సౌత్ ఆఫ్రికా లో 43% బ్రిటన్ లో 32% అమెరికా లో 24% బంగ్లాదేశ్ లో 21% ఉంది. మహిళలలో  విజయం సాధించిన వారిలో ప్రముఖురాలు స్ముతి ఈరానీ. ఈమె బి.జే.పి. అభ్యర్ధిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని యూ.పి.లోని అమేథి నియోజకవర్గం లో 52వేల మేజార్తి తో ఓడించారు. యూ.పి. లోని మధుర నియోజిక  వర్గం నుండి మరొక బి.జే.పి. ప్రముఖురాలు సిని నటిమణి హేమా మాలిని విజయం సాధించారు. బిజెపి నుంచి 16 మంది తిరిగి ఎన్నికైనారు. బిజెపి నుండి తిరిగి గెలిచిన మహిళా ఎంపీలలో ప్రముఖురాళ్ళు. వీరిలో  సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, చండీగఢ్ నుంచి కిరణ్ ఖేర్, న్యూఢిల్లీ నుంచి మీనాక్షి లెకి ఉన్నారు. సోనియా గాంధీ కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ. తిరిగి ఎన్నికయ్యారు. ఎన్సీపి నాయకురాలు  సుప్రియ సులే బారామతి నుంచి తన స్థానాన్ని తిరిగి పొందారు. పంజాబ్ నుంచి  ఎన్నికైన ప్రముఖ మహిళామణులు  - ప్రణెత్ కౌర్ ఈమె పంజాబ్ ముఖ్య మంత్రి  కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య - పాటియాలా సీటును 1.60 లక్షల ఓట్లతో గెలిచారు. పంజాబ్ లోని  బటిండా నియోజకవర్గం నుంచి 21 వేల ఓట్ల మెజారిటీ తో తేడాతో ఎస్ఎడి అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ భార్య మంత్రి హరిప్రీత్  కౌర్ బాదల్ గెలిచారు. వెస్ట్ బెంగాల్ లోని  42 సీట్లలో 17 మంది మహిళా అభ్యర్థులకు తృణమూల్ కాంగ్రెస్ నేత దిది మమత బెనర్జీ టిక్కట్ పంపిణీ చేశారు. వారిలో నష్రాత్ జహాన్, మిమి చక్రవర్తి, సతబ్దీ రాయ్, మూన్ మూన్ సేన్ ప్రముఖులు. నష్రత్ జహాన్ బషిరత్ నియోజకవర్గం నుంచి  3.5 లక్షల మెజారిటీతో గెలిచింది. మిమీ చక్రవర్తి జాదవ్ పూర్  నుంచి 2.9 లక్షల తేడాతో విజయం సాధించగా సతబ్డి రాయ్లతో 88,924 ఓట్లతో గెలుపొందారు. మరో ప్రముఖ నటిమణి మూన్ మూన్ సేన్ ఈ ఎన్నికలలో పరాజయం సాధించారు. బెంగాలీ నటి లాకట్ చటర్జీ బెంగాల్ లో బిజెపి తరుపున హుగ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బి..జే.డి.తరుపున ఈ ఎన్నికలలో మహిళలకు 1/3వంతు స్థానాలు కేటాయించగా వారిలో ఆరుగురు  గెలిచారు. వారిలో ప్రముఖురాలు 2వ తరగతి డ్రాప్-అవుట్  70 సంవత్సరాల వయస్సు గల ప్రమమియా బిసోయి. ఆమె ప్రతిష్టాత్మక అస్కా నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే బిజెపి అబ్యర్దులు  అందరిలో అత్యంత వివాదస్పదురాలు భోపాల్ లో ముగ్గురు లక్షల ఓట్ల తేడాతో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్  ను ఓడించిన ప్రగ్యా ఠాకూర్. అయితే మరి  కొంత మంది పరాజయం సాధించారు. వీరిలో తెలంగాణా ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఒకరు. ఈమె  నిజామాబాద్ నుంచి పరాజయం పొందారు.  ఈ నియోజకవర్గం నుంచి 185 అభ్యర్థులు పోటీ చేయగా వారిలో  178 మంది రైతులు ఉన్నారు. పరాజయం పొందిన మరో ప్రముఖ మహిళా అభ్యర్థి అనంతనాగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు  మెహబూబా ముప్తి పోటీచేశారు. పరాజయం పొందిన మరొక ప్రముఖురాలు తెలుగు, హిందీ సినినటిమణి జయప్రద. మహారాష్ట్ర నుంచి పరాజయం పొందిన మరొక బాలివుడ్ నటిమణి ఊర్మిళ మాతోంద్కర్. మహారాష్ట్ర నుంచి ప్రియాదత్ కూడా పరాజయం పొందారు. యూ.పి. లక్నో నుంచి పూనం సింగ్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతిలో ఒడి పోయారు.



 అలాగే అఖిలేష్ యాదవ్ భార్య  డింపుల్ యాదవ్ కూడా పరాజయం పొందారు. కర్ణాటక నుంచి సిని నటిమణి సుమలత విజయం సాధించారు. కేరళ నుంచి రమ్య హరిదాస్ విజయం సాధించారు. ఈమె కేరళ నుంచి ఎన్నికైన రెండవ దళిత మహిళా ఎంపీ. ఈ ఎన్నికలలో పోటిచేసిన నలుగురు ట్రాన్స్-జెండర్స్ పరాజయం పొందారు. వీరిలో ఒకరు ఆప్ పార్టికి చెందగా ముగ్గురు ఇండిపెండేన్త్స్. ఓడిస్సా నుంచి బీజేడీ తరుపున గెలిచిన చంద్ర మణి(వయస్సు 25 సంవత్సరాలు) ఈ ఎన్నికలలో గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలు. జమ్మూ-కాష్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, గోవా, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం,  హిమాచల్ ప్రదేశ్ ఒక్కరు కూడా మహిళా ఎంపీ ఎన్నిక కాలేదు. అదేవిధం గా ఢిల్లీ, చండీగర్ తప్పితే మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి కూడా ఎవరు ఎన్నిక కాలేదు.
రమజాన్ స్పూర్తిని కొనసాగించాలి
కరోనా గుణపాఠంతోనైనా దైవ మార్గంలో నడవాలి



రచయిత- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
సెల్ నెం- 99125-80645




           'ఈదుల్ ఫిత్ర్ ' పర్వదినం ముగిసి అప్పుడే నాలుగైదు రోజులు గడిచిపొయ్యాయి. ఈసారి రమజాన్ పండుగ జరుపుకున్న తీరును గురించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో నిలిచి పోయే అంతటి ప్రత్యేకత ఈ రమజాన్ ది అంటే అతిశయోక్తికాదు. ఇంటిపట్టునే నెలరోజులపాటు చేసిన ఆరాధనలు, సదాచారాలకు ఈద్ తో వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ మన జీవితాల్లో ప్రతిఫలించాలి. పవిత్ర రమజాన్ లో పొందిన  శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్యభావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకునే గుణం, పరమత సహనం, మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా విలువలు గుబాళించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓసుందర సమసమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపరలోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రమజాన్ ధ్యేయం.  


          ఈధ్యేయం ఏమేరకు నేరవేరుతున్నదో అందరూ ఒకసారి ఆలోచించాలి. ప్రతియేటా రమజాన్ వస్తూనే ఉంది. పోతూనే ఉంది. కాని ఈసారి రమజాన్ మనకు అనేక కొత్త పాఠాలను నేర్పింది. కొత్త అనుభూతుల్ని పంచింది. ముఖ్యంగా ఇళ్ళనే మస్జిదులుగా మార్చి, సకల ఆరాధనలూ ఇంటి పట్టునే చేసుకునేలా చేసింది. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఇచ్చింది. రమజాన్ మాసంలోని సేవాభావాన్ని మరింత విస్తృత పరిచింది. సదఖ, ఫిత్రా, జకాత్ తదితర రూపాల్లో అభాగ్యులు, అగత్యపరులు, పేదవర్గాలను ఆదుకునే ప్రయత్నం  మరింత విశాలమైంది. నియమానుసారంగా, సాంప్రదాయబద్దంగా అన్ని విధులూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నెరవేర్చాం. నియమ నిష్టలతో నెల్లాళ్ళపాటు తర్ఫీదును పొందాం. అయితే ఈ రమజాన్ మానవ జీవితాలను, వారి ఆలోచనా విధానాన్ని సమున్నతంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. కనుక ఈద్ ముగియడంతోనే శుభాల పర్వానికి తెరపడకుండా చూసుకోవాలి. రమజాన్ నెల్లాళ్ళూఇళ్ళన్నీ మస్జిదులుగా ఎలా మారాయో, అలాగే తరువాత కూడా  ఇళ్ళు నమాజీలతో కళకళలాడాలి. లాక్ డౌన్ అనంతరం కూడా ఫర్జ్ నమాజులతో మస్జిదులు, సున్నత్ , నఫిల్ లతో ఇళ్ళు కళకళలాడాలి.  రమజాన్ లో లాక్ డౌన్ వేళ  కనిపించిన సేవాభావం, దాతృస్వభావం, న్యాయబద్దత, ధర్మశీలత, ప్రేమ, సోదరభావం, సహనశీలత, పరోపకారం, క్షమ , జాలి, దయ, త్యాగభావం రమజాన్ అనంతరమూ కొనసాగాలి. అసత్యం, అబధ్ధం పలకక పోవడం, అశ్లీలానికి పాల్పడకపోవడం, చెడువినకపోవడం, చూడకపోవడం, సహించకపోవడంతోపాటు, అన్నిరకాల దుర్గుణాలకు దూరంగా ఉండే సుగుణాలు నిరంతరం  కొనసాగాలి.


             నిజానికి ఇస్లాం బోధనలు చాలా సరళం, సంపూర్ణం, సమగ్రం, స్పష్టం, స్వఛ్ఛం, నిర్మలం. కొరోనా కారణంగా ఇవి చాలామందికి తెలిశాయి. మానవులు వీటిని అర్ధం చేసుకొని ఆచరిస్తే, అనుసరిస్తే నైతిక, ఆధ్యాత్మిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలన్నిటినీ సమన్వయ పరచగలరు. సమయ సందర్భాలను బట్టి ఎలా స్పందించాలో తెలుసుకోగలరు. ఒక సమతుల మార్గాన్ని దర్శించ గలరు. జీవన రంగాలన్నింటా దైవాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ప్రతి పనినీ ఆరాధనగా మలచుకోగలరు. మానవుల ప్రతి పనినీ ఆరాధనా స్థాయికి చేర్చిన ధర్మం ఇస్లాం.
                 అందుకే పవిత్ర రమజాన్ నెలలో వారి శిక్షణ కోసం పకడ్బందీఏర్పాట్లు చేయడం జరిగింది. ఇకదాన్ని సద్వినియోగం చేసుకోవడమైనా, దుర్వినియోగం చేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది. అందుకని రమజాన్ స్పూర్తిని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే రోజాల ఉద్దేశ్యం నెరవేరుతుంది. పండుగ ఆనందానికి పరమార్ధం చేకూరుతుంది. భావిజీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుంది. దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు లేని చక్కని ప్రేమపూరితమైన సుందర సమాజం  ఆవిష్కృతమవుతుంది. దైవం మనందరికీ రమజాన్ స్పూర్తిని కొనసాగించే సద్బుధ్ధిని ప్రసాదించాలని, కొరోనా మహమ్మారినుండి మానవాళికి రక్షణ కల్పించాలని మనసారా కోరుకుందాం.

వేసవితాపాన్ని తగ్గించే...
కమ్మని ఎర్రని పానీయం రూహ్ అఫ్జా.. 


రచయిత-ముహమ్మద్ ముజాహిద్
సెల్ నెం-96406-22076






1907వ సంవత్సరం.. ఢిల్లీ ప్రజలు వేసవితాపంతో అస్వస్థతకు గురవసాగారు. పాతఢిల్లీకి చెందిన లాల్ కోవా బజార్ లోని ఒక వైద్యుడు ఈ వేసవితాపం నుంచి ఉపశమనం కల్గించేందుకు ఒక చిట్కాను కనుగొన్నాడు. ఆ ఔషధమే ఇప్పటికీ మార్కెట్లో దొరికే రూహ్ అఫ్జా. ఇప్పుడు రూహ్ అప్జాను కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. అసలు రూహ్ అఫ్జా భారతదేశ ప్రజలకు ఇష్టమైన కమ్మని పానీయంగా ఎలామారింది అన్న  కొన్ని ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందాం..
యూనానీవైద్యుడు హాఫిజ్ అబ్దుల్ మజీద్ 114సంవత్సరాలక్రితం ఘాజియాబాద్ లో కనొగొన్నాడు. 1906సంవత్సరంలో పాతఢిల్లీలోని లాల్ కువా బజారులో హమ్ దర్ద్ పేరుతో ఒక క్లినిక్ ను ప్రారంభించారు. 1907 సంవత్సరంలో బండలు పగిలేంత ఎండవేడిమితో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉష్ణతాపాన్ని తట్టుకోలేక వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హకీమ్ అబ్దుల్ అజీజ్ ఎంతగానో చలించిపోయారు. ఈ సమస్యకు ఉపశమనం కనుగొనాలన్న ఆలోచననుంచి పుట్టిందే రూహ్ అఫ్జా, వడదెబ్బ తగిలిన వారికి రూహ్ అఫ్జా పానీయాన్ని త్రాగించేవారు. వడదెబ్బ, ఎండవేడిమి దుష్ర్పభావాలను తగ్గించడంలో రూహ్ అఫ్జా ఎంతగానో ప్రయోజనకారి అవుతుందని నిరూపించబడింది. రూహ్ అఫ్జా మహత్యంతో హమ్ దర్ద్ క్లినిక్ కు గొప్ప పేరే వచ్చింది. రూహ్ అఫ్జా పానీయం కేవలం ఔషధంగానేకాక కమ్మని పానీయంగా పరిచయమైంది. హమ్ దర్ద్ చిన్న క్లినిక్ నుంచి గొప్ప మెడిసిన్ కంపెనీగా మారింది. దేశవ్యాప్తంగా మరీముఖ్యంగా ముస్లిముల ఇళ్లల్లో భాగమైపోయింది. రమజాన్ నెలలో అయితే ఇఫ్తార్ సమయంలో రూహ్ అఫ్జా త్రాగడం అలవాటుగా మారింది. ప్రారంభంలో ఈ పానీయాన్ని తెచ్చుకునేందుకు ఇంటినుంచే ఖాళీ సీసాలను తీసుకెళ్లి తెచ్చుకునేవారు. తండ్రి నిర్యాణం తరువాత అబ్దుల్ మజీద్ కుమారులు ఈ వ్యాపారాన్ని ముందుకుతీసుకెళ్లారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. 1947 దేశ విభజన తరువాత హమ్ దర్ద్ కంపెనీ కూడా రెండు భాగాలయ్యాయి. చిన్న కొడుకు ముహమ్మద్ సయీద్ పాకిస్తాన్ వెళ్లిపోయి కరాచీలో హమ్ దర్ద్ కంపెనీని ప్రారంభించారు. పెద్ద కొడుకు  అబ్దుల్ హమీద్ తల్లితోపాటు ఇండియాలోనే ఉండిపోయాడు. అబ్దుల్ హమీద్ కు కల్గిన ఇద్దరు కుమారులు అబ్దుల్ మోయిద్, హమ్మాద్ అహ్మద్ లు ఈ కంపెనీని లాభాలబాట పట్టారు. 1948నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో రూహ్ అఫ్జా విస్తరించింది. హమ్ దర్ద్ కంపెనీనుంచి సాఫీ, రోగాన్ బాదామ్ షేరీ వైద్య ప్రొడక్టులు ఎంతో ప్రాచుర్యం పొందాయి.  2018 బిజినెస్ రిపోర్టు ప్రకారం 700కోట్ల టర్నోవర్ అని తేలింది. అబ్దుల్ హమీద్ పండుగల సందర్భంగా ఇచ్చే విందులో జాతీయ స్థాయి నాయకులు పాల్గొనేవారు. రూహ్ అఫ్జా పానీయం తయారీలో ఎన్నో వనమూలికలు, పండ్లు, పూల రసాలను వినియోగిస్తారు. ఔషధిగా తయారుచేసిన ఈ పానీయం అనతికాలంలోనే వేసవితాపాన్ని తగ్గించే పానీయంగా ప్రజల మనసులను దోచుకుంది. ఇప్పటికీ దీని క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు. ఎన్నో ఏళ్లక్రితం ఏలాంటి రుచి ఉందో నేటికీ అదే రుచి కలిగి ఉండటం రూహ్ అఫ్జా ప్రత్యేకత. లస్సీలో ప్రత్యేక ఆకర్షణగా రూహ్ అప్జా వేసి అమ్మే లస్సీ పానీయానికి మంచి గిరాకీ ఉంటుంది. ఢిల్లీ చాందినీచౌక్ లో రూహ్ అఫ్జా పానీయంలో ఐసు ముక్కలు వేసి ఒక్కో గ్లాసు రూ.5, రూ.10లకు  అమ్ముతుంటారు. మనమూ ఇళ్లల్లో రూహ్ అఫ్జా పానీయాన్ని తయారు చేసుకుని త్రాగితే వేసవి తాపంనుంచి రక్షణ పొందవచ్చు. 
రూహ్ అఫ్జా పానీయాన్ని తయారు చేసే పద్ధతి
గ్లాసెడు మంచి నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల రూహ్ అఫ్జా పానీయాన్ని బాగా కలపాలి. ఆ తరువాత సగం నిమ్మకాయ రసాన్ని అందులో పిండి బాగా కలిపన తరువాత నాలుగైదు ఐసు ముక్కలు (ఫ్రిజ్లోనివి) వేసుకుని త్రాగితే ఎండతాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. 
రమజాన్ – 2020 ప్రత్యేకతలు..
ఇంటికో మస్జిద్.. గడపగడపకో ఈద్గాహ్



-హాఫిజ్ రషాదుద్దీన్, నాజిమే షెహర్, 
జమాఅతె ఇస్లామీహింద్ గ్రేటర్ హైదరాబాద్





‘‘ఈజిప్టులో మీ జాతి వారి కొరకు కొన్ని గృహాలను సమకూర్చండి. ఆ గృహాలను ఖిబ్లాగా నిర్ణయించుకొనండి. నమాజును స్థాపించండి. విశ్వాసులకు శుభవార్తను అందజేయండి.’’ (ఖుర్ఆన్ 10:87)
వేలాది సంవత్సరాలక్రితం కూడా ముస్లిములు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ తమ ఇళ్లను మస్జిదులుగా మార్చుకున్నారన్న విషయం ఖుర్ఆన్ ద్వారా తెలుస్తుంది. 
2020 కరోనా విజృంభిస్తున్న వేళ గత రెండు నెలల నుంచి మస్జిదులన్నీ మూతపడ్డాయి. ఐదు పూటల నమాజులు, జుమా నమాజులు, చివరికి ఈద్ నమాజులు సైతం ఇళ్లల్లోనే చేసుకునే పరిస్థితులు. కేవలం మస్జిదులకు వెళ్లి నమాజులు చదవలేదన్న లోటు తప్పితే ఈ లాక్ డౌన్ వల్ల ఎన్నో ఆథ్యాత్మిక ప్రయోజనాలు ఒనగూడాయి. ముస్లిముల్లో ఎప్పుడూ లేనంతగా ధార్మిక చైతన్యం పెరిగింది. యవతీ, యువకులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని వర్గాలవారూ ధార్మిక విధులపై శ్రద్ధ చూపారు. ప్రతీ ఇల్లూ మస్జిదుగా మారింది. ఇంటివారంతా కలిసి సామూహిక నమాజులు నిర్వర్తించారు. రమజానులో ప్రతీ ఇంట్లో తరావీ ప్రార్థనలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈదుల్ ఫిత్ర్ పండగ రోజు ప్రతీ ఇల్లూ ఈద్గాహ్ గా మారింది. ఇంటివారంతా కలిసి పండగ నమాజులు నిర్వహించారు. ధార్మిక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ధార్మిక విధులపట్ల అవగాహన పెంచుకుని ఆచరణలో పెట్టే ప్రయత్నాలు చేశారు. ఈ లాక్ డౌన్ కాలంలో రమజాన్ రావడంతో చాలామంది నన్ను రోజూ ఎన్నో సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇంట్లో సామూహిక నమాజు చేయవచ్చా? ఎన్ని వరుసల్లో నిల్చోవాలి? మహిళలూ ఈ సామూహిక నమాజులో నిలబడవచ్చా? కౌమారదశకు చేరుకోని బాలుడు హాఫిజె ఖుర్ఆన్ అయితే తరావీ నమాజు చదివించవచ్చా? ఖుర్ఆన్ కంఠస్థం రాకపోతే తరావీ నమాజు ఎలా చేయాలి? ఇంట్లో ఏతెకాఫ్ పాటించవచ్చా? ఇంట్లో ఈద్ నమాజు ఎలా చేయాలి? జకాత్ దానాలు ఎలా చెల్లించాలి? వాటిని ఎలా పంపిణీ చేయాలి? నమాజు, రోజా (ఉపవాసాలు)లకు సంబంధించిన ఎన్నో సందేహాలు ఇలా ఎన్నో ప్రశ్నలకు టెలిఫోన్ లో, వాట్సాప్ లలో సమాధానం చెప్పాను. ముస్లిమ్ యువతీ యువకులు, గృహిణులు, విద్యార్థినీ, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారూ ప్రశ్నలడిగే తీరు ధార్మిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలన్న తపనకు నిదర్శనం. లాక్ డౌన్ లో వచ్చిన రమజాన్ నెల ముస్లిముల్లో ధార్మిక అవగాహనను పెంచిందని గట్టిగా చెప్పగలను. ఇదే స్ఫూర్తిని వచ్చే రమజాన్ వరకూ కొనసాగించాలని కోరుకుంటున్నాను. 
ఈ ఐక్యతను దెబ్బకొట్టడం...
కలలోనూ సాధ్యంకాదు..
కరోనా వేళ ఇచ్చుపుచ్చుకొన్న భారతీయ సోదరులు
మతాలకు అతీతంగా ఏకమైన చేతులు




కరుడు గట్టిన మతోన్మాదనికి ప్రయత్నం...కానీ ఎన్ని చేసినా నా భారతీయుల ఐఖ్యత ముందు అవి విచ్ఛిన్నం. భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, ఇసాయి ఇలాంటి బేధ భావాలు లేకుండా ఎవరి మతాన్ని వారు గొప్పగా ఆచరించుకోవడం భారతదేశ గొప్పతనం. కష్టమొస్తే చాలు మేమంతా భారతీయులం అని భుజం భుజం కలిపి నిలబడతారు. కరోనా వైరస్ విస్తరణకు ముస్లింలే కారణమని దుష్ప్రాచారం చేసినా ఈ దేశ వాసులు పట్టించుకోలేదు. ఒకరి కొరకు ఒకరు అని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ సోదరులు తమ మానవత్వాన్ని చాటి భిన్నత్వంలోని ఏకత్వంను చాటారు. అందులోని కొన్ని ఘటనలు మనం స్మరించుకొందాం.




ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనకు ముందు, , 'యునైటెడ్ సిక్కులు' అనే స్వయం సేవక సంస్థ  అధ్వర్యం లో అనేక మంది సిక్కు సమాజంలోని సభ్యులు ఢిల్లీ జమా మసీదును శానిటైజ్/పరిశుభ్రపరిచారు. ఢిల్లీ జామా మసీదు షాహి ఇమామ్, అహ్మద్ షా బుఖారీ మాట్లాడుతూ ప్రస్తుత కరోన మాహమ్మరి కాలం లో దేశ ప్రజలు సమైఖ్యం గా  గా కలసి ఉండవలసిన సమయం ఉన్నాదని అన్నారు. "సిక్కు సమాజ ప్రజలు జమా మసీదును పరిశుభ్రపరిచిన విధానం ఈ దేశ సంస్కృతిని తెల్పుతుంది. కరోనా వైరస్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో  ఒకరికొకరు సహాయపడటం చాలా ముఖ్యం. దేశం యొక్క అత్యతమ విలువలను కాపాడదాము అని షాహి ఇమామ్ అన్నారు. 'యునైటెడ్ సిక్కులు' సంస్థ సభ్యులలో ఒకరైన పర్మిందర్ సింగ్, " మసీదు మాత్రమే కాదు, మేము చర్చిలు, దేవాలయాలను కూడా శుభ్రం చేస్తున్నాము" అని అన్నారు. "మేము మత ప్రాతిపదికన వివక్ష చూపడం లేదు. గురు గ్రంథ్ సాహిబ్ గ్రంధం అనుసరిస్తున్న మాకు అన్ని మతాలు, వారి అనుచరులు ఒకటే" అని సింగ్ అన్నారు. మనమందరం దేవుని సృష్టి అని మా పవిత్ర పుస్తకంలో వ్రాయబడింది. మేము దేవాలయాలు మరియు చర్చిలను కూడా శుభ్రపరుస్తున్నాము. మేము గత 50-60 రోజులుగా పని చేస్తున్నాము" అని ఆయన చెప్పారు. ఢిల్లీ లోనే కాదు కాదు, కరోనా వైరస్పై పోరాటం మధ్య, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎటువంటి వివక్ష లేకుండా ఒకరికొకరు సహాయం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. జమ్మూలోని శ్రీ మాతా వైష్ణో దేవి మందిరం పవిత్ర రంజాన్ మాసంలో సెహ్రీ, ఇఫ్తారీలకు సేవలు అందిస్తోంది.  “ఆశిర్వాద్  భవన్”  క్వారంటైన్ కేంద్రంగా మార్చబడినందున అక్కడ సుమారు 500 మంది ముస్లింలు క్వారంటైన్ లో  ఉన్నారు. ఇటీవల, ఒక ముస్లిం ఎన్జీవో మాలెగావ్లో ఖర్జూరాలు, రేషన్ కిట్లను పంపిణీ చేసింది. ఈ రంజాన్ బహుమతులు హిందూ గృహాలకు కూడా పంపిణి జరిగింది. 
లౌకికవాదంపై ఉక్కపాదం...
పార్లమెంటులో తగ్గుతున్న ముస్లింల ప్రాతినిధ్యం
ఇదే కొనసాగితే బాడుగుల రాజ్యాధికారం కలగానే మారుతుంది


రచయిత-సల్మాన్ హైదర్



దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఫలాన హిందూకు మేలు జరిగిందన్న మాట ఎక్కడైనా విన్నామా. అదే హిందూ సమాజంలో భాగమైన నా బీసీ సోదరులకు ఏమైన న్యాయం జరిగిందా...? బీసీ ప్రధాని అని చెప్పుకొనే నరేంద్రమోడీ బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం పెంచగలిగారా...? లేక బీసీ అనుకూల విధానాలను ప్రవేశపెట్టగలిగారా...? లేదు. కారణం మత అజెండా కలిగిన పార్టీలకు సామాజిక న్యాయంపై శ్రద్ద ఉండదు. పైగా సామాజిక న్యాయం వల్ల వారి మతన్మోద అజెండాకు అడ్డంకి. అందుకే బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన నాటి బీపీ మండల్ తీసుకొచ్చినపుడు వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న పోరాడింది నేటీ బీజేపీ పుట్టుక సంస్థ జనసంఘ్. జనసంఘ్ స్వరూపమే నేటి బీజేపీ. అదే సందర్భంలో బీజేపీ రాకతో ముస్లింల ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గిపోతోంది. ఇది బడుగు రాజ్యాధికార కలకు విఘాతం. ముస్లింల ప్రాతనిధ్యం చట్టసభల్లో పెరిగితే వారి మద్దతు ఇచ్చేది బడుగు రాజ్యాధికారానికే తప్పా మతోన్మాద పార్టీలకు కాదు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఇతర మైనార్టీ వర్గాలు తమ ఓటు పక్కకు పోకుండా ఎలా ఏకం చేసుకోవాలో ఆలోచించాల్సిన తరుణమిది. తద్వారా బడుగు రాజ్యాధికారానికి బాటలు వేసుకోవాలి

భారతదేశము లో  ముస్లిం జనాభా క్రమంగా పెరుగుతోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ అమెరికా ప్రకారం 2015 నాటికి ముస్లింల సంఖ్య 19.5 కోట్లకు చేరుతుంది. జననాల  రేటు లో వృద్ది కారణంగా ముస్లిం జనాభా  1991 నుండి దాదాపు రెట్టింపు అయ్యింది. జనాభాలో వీరి శాతం  ఈ కాలంలో 12% నుండి 15% వరకు పెరిగింది. ప్యూ అంచనా ప్రకారం 2060 నాటికి ప్రపంచ దేశాలలో    ఇండియా లో అధికంగా  ముస్లింలు ఉంటారు. (ప్రస్తుతం ఇండోనేషియా లో ఎక్కువగా ఉన్నారు) భారత దేశం జనాభాలో ముస్లింలు 19% ఉన్నారు. అదే సమయంలో 545 సీట్లతో కూడిన లోక్ సభలో ముస్లిం ప్రతినిధుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ముస్లింలు ఎప్పుడూ ఇక్కడ అల్పంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ప్రస్తుతం 50 గత సంవత్సరాల లో తక్కువగా ఉంది. 1980 ఎన్నికలలో, లోక్ సభ మొత్తం స్థానాలలో దాదాపు 10% మంది ముస్లింలు ఎన్నికయ్యారు. 2014 లో అది 4% కన్నా తక్కువగా ఉంది. 2019 లో అది 5% గా ఉంది. 2019 జాతీయ ఎన్నికల ఫలితాల ఫలితాలు ప్రకటించబడిన్నాయి, 27 మంది ముస్లిం ప్రజా ప్రతినిధులు ఎన్నికైనారు. భారతీయ రాజకీయాల పరిశోధకుల అభిప్రాయం ప్రకారం  ఈ అధోముఖ ధోరణి కి ప్రధాన  కారణం భారతీయ జనతాపార్టీ పెరుగుదల మరియు అది భారత రాజకీయాలలో అనుసరిస్తున్న విధానాలు. 




చరిత్రకారుల ప్రకారం  7 వ శతాబ్దంలో ఇస్లాం మొదటిసారిగా  భారత ఉపఖండంలోకి ప్రవేశించినది. 18 వ మరియు 19 వ శతాబ్దాలలో, బ్రిటిష్ వారు భారత ఉపఖండాన్ని వలసగా మార్చారు.  స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో, ముస్లింలు, హిందువులు కలసి పోరాడారు.  స్వాతంత్ర్యం అనంతరం బ్రిటిష్ ఇండియా భారతదేశం, పాకిస్తాన్ అను రెండు దేశాలగా  విభజించబడింది. ఒకటి హిందూ మెజారిటీ కలిగిన భారతదేశం (పెద్ద సంఖ్యలో ముస్లింలు మరియు ఇతర మత మైనార్టీలు ఈ  లౌకిక రాజ్యంలో ఉన్నారు). రెండు పాకిస్తాన్, ఇది  ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా మారింది.  దేశ విభజన సమయంలో దాదాపు ఒక మిలియన్ మరణాలు సంభవించాయి. భారతదేశంలో సుమారు 35 మిలియన్ ముస్లింలు విభజన తర్వాత ఉన్నారు. ఆ జనాభా ఇప్పటికీ ఉంది. అది ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలిగి ఉన్న గంగ నదీ పరీవాహక ప్రాంతంలోనూ,  దేశంలోని ఉత్తర భాగంలో కేంద్రీకృతమై ఉన్నారు. దేశంలోని ముస్లింలలో సగం మంది ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్నారు. దేశంలోని దాదాపు ప్రతి భాగం గణనీయమైన ముస్లిం మైనారిటీలను కలిగి ఉంది. ఒడిశా, పంజాబ్ మాత్రమే 5% కంటే తక్కువగా ముస్లిం జనాభా  కలిగి ఉన్నాయి.



లోక్ సభకు మొదటి ఎన్నికలు  1952 లో జరిగినాయి. ఆ ఎన్నికలలో ఎన్నికైన మొత్తం 489 మంది సభ్యుల్లో 11 మంది మాత్రమే ముస్లింలు. తరువాతి 30 సంవత్సరాల్లో ఆ సంఖ్య పెరిగింది. గరిష్టంగా 1980 లో పెరిగింది. స్వాతంత్ర్యం తరువాత భారతదేశం యొక్క ప్రధాన రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (INC) వలన ఈ సంఖ్య పెరిగింది. 1980 లో 49 మంది ముస్లిం ప్రతినిధులలో 30 మంది  కాంగ్రెస్ సభ్యులు. ఉభయ కమ్యునిస్ట్ పార్టీలు, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ స్థిరంగా ముస్లిం ప్రతినిధులను కలిగి ఉన్న ఇతర రాజకీయ పక్షాలు - త్రివేది సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా ప్రకారం ఇది. జామియా మాలియా ఇస్లామియా లో భారత రాజకీయాల పై పరిశోధన చేస్తున్న  పరిశోధకుడు మొహమ్మద్ ఒసామా   ప్రకారం  1970 లలో,  1980 ల ప్రారంభంలో భారత రాజకీయ పార్టీల యొక్క విచ్ఛిన్నత వలన ముస్లింలు అధిక  ప్రాతినిధ్యం పొందారు.  రాజకీయాల్లో అధికారం పొందటానికి ప్రతి రాజకీయ పార్టీ ద్వారా ముస్లిం  సమాజానికి, ఇతర మైనారిటీ గ్రూపులకు చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. తత్ఫలితంగా ముస్లింలను వారు తమ  అభ్యర్థిగా ప్రకటించేవారు. ఈ విధంగా 1980 లో ముస్లింలు పొందిన  అధిక ప్రాతినిధ్యం రాబోయే మూడు దశాబ్దాల్లో దాదాపు పూర్తిగా తిరగబడింది. రాజకీయ శాస్త్రవేత్తలు క్రిస్టోఫ్ జాఫ్రెలోట్ మరియు గిల్లెస్ వెర్రియర్స్ ప్రకారం ముస్లిం ప్రజా ప్రతినిధుల తిరోగమనం కు ఒక ముఖ్య కారణం బీజేపీ పెరుగుదల అని చెప్పబడింది.

1980 లో స్థాపించిన బీజేపీ, 1984 జాతీయ ఎన్నికలలో కేవలం రెండు సీట్లు గెలుచుకుంది. 1998 నాటికి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచినది. 2014 మరియు 2019  లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పూర్తి విజయం సాధించింది. బీజేపీ సామాజిక విధానాలు పాశ్చాత్యీకరణ, లౌకికవాదంపై హిందూ మత ఆధారిత సాంస్కృతిక సంప్రదాయవాదాన్ని మరియు హిందూ జాతీయవాదo(హిందుత్వ) ను  ప్రోత్సహించుట. అనేక మంది హిందూ జాతీయవాదులు ముస్లింలు  ఎప్పుడూ భారతీయులు కాలేరనే ఆలోచనను వ్యక్తం చేశారు, ఎందుకంటే హిందువుల వలె కాకుండా, ముస్లింల  పవిత్ర స్థలాలు భారతదేశంలో లేవు. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత  మరియు 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లు  దేశం లో బిజెపి వృద్ధి కి తోడ్పడినవి. బిజెపి పార్టీ యొక్క ఆర్థిక విధానాలు  మార్కెట్ అనుకూల, రెడ్ టేపిజం కు వ్యతిరేకంగా ఉన్నవి.  బిజెపి అల్ప సంఖ్య లో ముస్లిం అభ్యర్థులను కలిగి ఉంది. జాఫ్రెలోట్, వెర్నియర్స్ అభిప్రాయం ప్రకారం  1980 నుండి, పార్టీ బిజెపి  కేవలం 20 మందిని మాత్రమే  సాధారణ ఎన్నికలకు నిలబెట్టింది. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే గెలిచారు. 2014, 2019 ఎన్నికలలో ఈ పార్టీ తరుపున ముస్లిం అభ్యర్థులు ఎవరు ఎన్నిక కాలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టి ముస్లిం సభ్యులను కలిగిలేదు.



ముస్లిం ప్రజా ప్రతినిధుల క్షీణతకు  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ముస్లిం సభ్యుల తక్కువ ఎన్నిక. ఉత్తరప్రదేశ్ బిజెపి మరింత శక్తివంతమైనది. యూ.పి.నుంచి 2014 లో పార్లమెంటులో ముస్లిం సభ్యుల సంఖ్య సున్నా  కు పడిపోయినది. 2019 లో ఆరుగురు ఎన్నికైనారు.ఆ ఆరుగురు నాన్-బిజెపి కి చెందినవారు.ఉత్తరప్రదేశ్ జనాభాలో సుమారు 20% మంది ముస్లింలు. 2019 లో మహారాష్ట్ర నుంచి ఒకరు ఎన్నికైనారుమరియు మధ్యప్రదేశ్ నుంచి ఎవరు ఎన్నిక కాలేదు.  2014 నుండి అనేక మంది ముస్లింలు తమల్ని బిజెపి అణగదొక్కుతుందని  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముస్లిం-వ్యతిరేక మత విద్వేషాల వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అని విమర్శించారు.  హిందూ హక్కుల పరిరక్షణ,  గో సంరక్షణ పేరిట ముస్లింలకు వ్యతిరేక దాడులు సాగుతున్న విషయం తెలిసిందే. అనేకమంది ముస్లింలు మూక హింసకు గురయ్యారు. కొంతమంది హత్యకు గురయ్యారు.  బిజెపి అనుసరిస్తున్న  ముస్లిం వ్యతిరేక భావాలచే ప్రభావితం అయిన  ఇతర రాజకీయ పక్షాలు కూడా తాము  ముస్లింలకు అల్ప ప్రాతినిధ్యం ఇవ్వసాగినవి అని  వెర్నియర్స్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్  మరియు ఇతర రాజకీయ పార్టిలు  ముస్లిం అభ్యర్థులకు  టికెట్ ఇస్తే  తమను హిందు వ్యతిరేకిగా బిజెపి చిత్రికరిస్తుందని  భయపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టి దానితో గత్యంతరం లేక సాఫ్ట్ హిందుత్వ ను అనుసరించ సాగింది. దీని ఫలితంగా, ఈ ఎన్నికలలో పోటీచేసే ముస్లిం అభ్యర్దుల  సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరుపున దేశం మొత్తం మీద కేవలం నలుగురు ముస్లిం అబ్యర్ధులు మాత్రమె విజయం పొందినారు.  2019 ఎన్నికలలో  ఉత్తరప్రదేశ్ నుంచి ఆరుగురు ముస్లిం  అబ్యర్ధులు విజం సాధించారు. వారు ఎస్పి, బిఎస్పీ పార్టికి చెందిన వారు.

 2019 ఎన్నికలలో బిజెపి ఆరుగురు ముస్లిం అబ్యర్ధులను నిలబెట్టగా ఒక్కరు విజయం సాధించ లేదు. NDA కూటమి నుంచి ఒక అబ్యర్ది LJP తరుపున బీహార్ నుంచి ఎన్నికైనారు. ముస్లింలు లోక్ సభ ఎన్నికలలో 40 నియోజక వర్గాలలో పలితాలను నిర్ణయించే స్థితి లో ఉన్నారు.  2019 లోక్ సభ ఎన్నికలలో గుజరాత్, మద్య ప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక, ఆంద్ర ప్రదేశ్, డిల్లి నుంచి ఒక్క ముస్లిం అబ్యర్ది కూడా విజయం సాధించ లేదు. అ రాష్ట్రాలలో ముస్లిం జనాభా తగు పరిమాణం లో ఉన్నప్పటికి ముస్లిం అబ్యర్ది విజయం సాధించ లేదు. ముస్లిం అభ్యర్ధులు కేవలం 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లోనే విజయం సాధించారు. 
2018 డిసెంబర్ నాటి జనాభా రీత్యా ముస్లింలు లోక్ సభ లో 65 స్థానాలు కలిగి ఉండాలి. రాజకీయ విశ్లేషకురాలు  మరియు కంప్యూటర్ శాస్త్రవేత్త సుళని భోగలే ప్రకారo లోక్ సభ లో ముస్లిం సభ్యల కొరత వలన  తీవ్ర విధానపరమైన పరిణామాలు ఉండవచ్చు. 1999 నుండి 2017 వరకు పార్లమెంటులో అడిగిన 276,000 ప్రశ్నలను ఆమె విశ్లేషించారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండ మరియు ముస్లిం ఖైదీల పట్ల అనుసరిస్తున్న విధానాలు గురించి ముస్లిం సబ్యుల కన్నా ఇతర వర్గాల సబ్యులు ఎక్కువుగా ప్రశ్నలు అడిగినారు. లోక్ సభ   సభ్యులలో 1% కంటే తక్కువ మంది ముస్లిం మహిళలు ఉన్నారు అని   భగలే అభిప్రాయపడ్డారు, అందువల్ల ఈ విభాగానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించే అవకాశం లేదు. ఇదే పరంపర కొనసాగితే మున్ముందు దేశంలో లౌకికవాదానికి ప్రమాదం వాటిల్లే అవకాశముంది. ఇదే జరిగితే ఇక బడుగు రాజ్యాధికారం కలగానే మారుతుంది.

వక్ఫ్ కు దిక్కెవ్వరూ...?
భూములు ఎలా తరిగిపోతున్నాయి
ఇప్పటికే ఆక్రమణకు గురైన 70శాతం వక్ప్ భూములు
ఉన్న భూములను కాపాడుకొనేందుకు నడుంకడదాం
కమిషనరేట్ ఏర్పాటుతోనే...వక్ప్ ఆస్తుల పరిరక్షణ
రండి కమిషనరేట్ కోసం ఉద్యమిద్దాం



సయ్యద్ నిసార్ అహ్మద్
జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు
సెల్ నెం-780 101 9343




ఎన్నికల మేనిఫెస్టో మొదలు మైనార్టీల ప్రతి సభలోనూ మనకు వినిపించే మాట వక్ఫ్ ఆస్తులను తమ ప్రభుత్వం రక్షిస్తోంది అని. కానీ వాస్తవానికి వక్ప్ ఆస్తుల పరిరక్షణ జరుగుతోందా...? నిజంగా వక్ప్ ఆస్తులను పరిరక్షించాలంటే ఎండోమెంట్ తరహా కమిషనరేట్ వక్ప్ భూములకు అవసరం అన్న సత్యం ఈ ప్రభుత్వాలకు, పాలకులకు తెలీదా...? గతంలోనూ చేసిన ఇదే నిర్లక్ష్యాన్ని ఈ సారి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తుందా...? లేక వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ప్ కమిషనరేట్ ఏర్పాటు చేసి తన చిత్తశుద్దిని నిరూపించుకొంటుందా...? అసలు వక్ప్ కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వైసీపీ ప్రభుత్వానికి చేరవేసేది ఎవరు...? ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నడుం కట్టేది ఎవరు...? ఇపుడు ముస్లిం సమాజంలో సాగాల్సిన అసలైన చర్చ. కానీ ముస్లిం సమాజంలో కొరవడిన చైతన్యం పేదలకు వరంగా మారాల్సిన వక్ప్ భూములు కబ్జాదారులకు లాభదాయకంగా మారుతున్నాయి. అందుకే రండి..ముస్లిం సోదరులారా వక్ప్ కమిషనరేట్ కోసం ఉద్యమిద్దాం. వక్ప్ ఆస్తుల పరిరక్షణకోసం నడుంకడదాం. 
తెలియక చేసే అన్యాయాన్ని క్షమించవచ్చు. కానీ తెలిసి చేసే అన్యాయాన్ని క్షమిస్తే క్షమించరాని నేరం. దశాబ్దాలుగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ద్రోహాన్ని ఏమనాలి, అలా ద్రోహం చేసే వారిని ఏంచేయాలి...ఇపుడు ముస్లిం సమాజం ఆలోచించాల్సిన అవసరముంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ గాలి ద్వీపంగానే మారుతోంది. ఎదురుగాలిలో ద్వీపం వెలుతురు ఆశించడం ఎంతటి ముర్ఖత్వమే పట్టిష్టమైన వ్యవస్థ లేకుండా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణను ఆశించడం అంతే మూర్ఖత్వమవుతోంది. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి లక్షల ఎకరాలలో వివిధ ప్రాంతాలలో ఉన్న వక్ఫ్ ఆస్తులు కర్పూరంలా కరిగిపోతూ నేడు ఆ స్థలం ఫలాన చోటు వుంది అని చెపుకొనేందుకే మిగివుంది. కనీసం వీటిని రక్షించుకోలేకపోతే యావత్తు ముస్లిం సమాజం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం యావత్తు ముస్లిం సమాజం నడుంకట్టాలి. ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషనరేట్ ను ఏర్పాటు చేసి దురాక్రమణకు గురైన ఆస్తులను జప్తు చేసేందుకు పట్టిష్టమైన యంత్రాంగాన్ని, అందులోనూ సర్వాధికారాలున్న వ్యవస్థ తీసుకురావాలి. అలాంటి కమిషనరేట్ రూపంలోనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ జరుగుతుంది. 
మన వేలుతో మన కంటినే పొడుచుకోవడం అన్న మాటను మనం సందర్భాలను సారం వింటునేవుంటాం. ఈ మాట సరిగ్గా వక్ప్ ఆస్తుల విషయంలో సరిపోలుతుంది. వక్ప్ ఆస్తుల దురాక్రమణ సైతం ఇదే తరహాలో సాగుతోంది. ముందు ముస్లింల చేతే ఆక్రమణ చేయించి ఆపై బయటి దొంగల రంగ ప్రవేశంతో వక్ప్ ఆస్తులు కబ్జాకు గురై కర్పూరంలా కరిగిపోతోంది. వాస్తవం ఏమిటో పసిగట్టి వాటిని కబ్జాదారుల కొరల నుంచి మన వక్ఫ్ ఆస్తులను మనం పరిరక్షించుకొనేలా ముస్లిం సమాజం చైతన్యం కావాలి. ఇప్పటికైనా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ప్ బొర్డు స్థానంలో వక్ప్ కమిషనరేట్ తీసుకురావాలి. ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముస్లిం సమాజం ముందుకు రావాలి.



వక్ప్ అంటే ఏమిటీ...?
వక్ప్ అంటే అంకితం చేయడం అని అర్థం. మన పూర్వీకులు అల్లాహ్ పేరుతో పేద వారి కోసం, సమాజంలో ఏమీ చేయలేని అచేతనంగా జీవించే వారి జీవనోపాధి కోసం కొంత ఆస్తిని వక్ప్ చేశారు. వక్ప్ అంటే అల్లాహ్ పేరుతో ఆస్తిని అంకితం చేయడం. వ`ద్దులు, భర్త చనిపోయిన స్త్రీ, భర్త నిరాధారణకు గురైన స్త్రీ, అనాథలు ఇలాంటి వారి జీవనోపాధి కోసం నాటి పూర్వీకులు విలువైన ఆస్తులు, పంటలు పండే భూములు అల్లాహ్ పేరుతో వక్ఫ్ చేశారు. కారణం ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో పైన చెపుకొన్న వారి జీవనోపాధి సాగించడం, పేదలను ఆదుకోవడం వంటి ఉన్నత లక్ష్యాలున్నాయి. కానీ ఆచరణలో అవుతున్నది ఏమిటీ....? దీనిని పట్టించుకొనేదెవ్వరూ....? అన్నది ఇపుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న. అల్లాహ్ మార్గంలో శాంతియుత, సోదరభావమున్న, మించి సమజం కోసం అనుసరించే జీవిన విధానం పాటించడం ముస్లింలకు ఎంతటి అవసరమో, అల్లాహ్ పేరుతో ఉన్న వక్ప్ ఆస్తుల పరిరక్షణ కూడా ముస్లింల కర్తవ్యం. ఇది గ్రహించిననాడే వక్ప్ ఆస్తుల పరిరక్షణ సాధ్యం.
కళ్లముందే కరిగిపోతున్న వక్ప్ ఆస్తులు...?
మన దేశంలో దర్గాలు, మసీదులు ఇలా వివిధ ముస్లిం ధార్మిక సంస్థల కింద ఆదాయం ఇచ్చే లక్షలాధి ఎవరాలు భూమి వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ అవుతాయి. ఈ రకంగా మన దేశంలో దాదాపు 3లక్షల ముస్లిం ధార్మిక సంస్థలు తమ ఆస్తులను వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ చేసుకొన్నాయి. వీటిలో గమనించ దగ్గ విషయం ఏమిటంటే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సంస్థలు వక్ప్ బోర్డుకింద రిజిష్టర్ చేయబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రం దాదాపు 35వేల 701 సంస్థలు వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ చేయబడ్డాయి. వీటి కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లక్ష 45వేల 511 ఎకరాల వక్ప్ భూమి వుంది. వీటిలో దాదాపు 81వేల 591ఎకరాల భూమి దురాక్రమణకు గురైనట్లు దాదాపు 15 ఏళ్ల కిందట కేంద్ర పార్లమెంటు బందానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వక్ప్ బోర్డు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అంటే దాదాపు 60 శాతం మేర భూమి ఆక్రమణకు గురైనట్లు ఇట్టే అర్థమవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. అన్యాయం ఎక్కడ జరుగుతోందో యావత్తు ముస్లిం సమాజం గ్రహించాలి. వక్ప్ కమిషనరేట్ ఏర్పాటుకు పోరాటం చేయాలి. 1954 ఆ తరువాత చేయబడిన 1995 వక్ప్ చట్టం ప్రకారం పాలక మండళ్లు(బోర్డు)లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు అంగీకరించినా కబ్జా అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పట్టిష్టమైన అధికారాలు గానీ అందుకు అవసరమైన వ్యవస్థను గానీ ప్రభుత్వాలు ఏర్పాటుచేయలేదు. ఇది ప్రభుత్వాల ఎత్తుగడ. చివరకు ఏ భూమిని ప్రభుత్వాలు అప్పనంగా తీసుకోలేని పరిస్థితుల్లో వక్ప్ ఆస్తులను మాత్రం ఏ మాత్రం జంకులేకుండా తీసుకొంటున్నాయి. అందుకే కాబోలు ప్రభుత్వాలు వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం కమిషనరేట్ ను ఏర్పాటు చేయడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు, గచ్చిబౌలిలోని అనేక సాఫ్ట్ వేరు సంస్థలు ప్రభుత్వ ప్రోత్సాహంతో వక్ప్ స్థలాలలో అనధికారికంగా వెళిశాయి. ఇలా అప్పనంగా తన ఉద్దేశాల కోసం ప్రభుత్వం సైతం వక్ప్ ఆస్తులను కాజేయడం కోసం వక్ప్ కమిషనరేట్ ను ఏర్పాటు చేయడంలేదు అని భావించాల్సే వస్తుంది.


వక్ప్ బోర్డు వ్యవస్థతో కబ్జాల నివారణ సాధ్యమా....?
మన రాష్ట్రంలోని వక్ప్ బోర్డు వ్యవస్థను రెండు రకాలుగా అర్థంచేసుకోవాలి. ఒకటి ఎగ్జిక్యూటీవ్ వ్యవస్థ, రెండోది పాలక మండలి వ్యవస్థ. పాలక మండలి అమలులో ఉన్నపుడు వీటికి లోబడి వక్ప్ బోర్డు ఎగ్జిక్యూటీవ్ వ్యవస్థ పనిచేస్తుంది. ఎగ్జిక్యూటీవ్ వ్యవస్థ అంటే అధికార యంత్రాంగం అని అర్థంచేసుకోవాలి. వక్ప్ బోర్డుకు రాష్ట్రస్థాయిలో ఒక సీఇఓ ఉంటాడు. అతడే కార్యనిర్వాహక అధికారి. అయితే ఇటీవల కొంత కాలంగా సీఇఓ కంటే ఒక ఉన్నత స్థాయి అధికారిగా స్పెషల్ ఆఫీసర్ పేరుతో ఐఎఎస్ గానీ ఐపీఎస్ గానీ ఐఎఫ్ఎస్ గానీ ఇలా నియమిస్తున్నారు. ఇక పాలక మండలి అంటే ప్రభుత్వం తనకు నచ్చిన వారిని ఎంపిక చేసేది అని అర్థంచేసుకోవాలి. పాలకమండలి నిర్ణయాలు కీలకంగా మారుతాయి. వక్ప్ బోర్డు పాలకమండలిలో ఇద్దరు ముత్తవలిలు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రభుత్వం నుంచి ఒక ఐఎఎస్అధికారి లేద ఐపీఎస్ ఇలా, ఒక ఇస్లామీక్ రీసర్చ్ స్కాలర్. బార్ కౌన్సిల్ నుంచి ఒకరు ఇలా వక్ప్ బోర్డు పాలక మండలిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కమిటీ బేటీలో తీసుకొనే నిర్ణయాలను బట్టే వక్ప్ బోర్డు పనితీరుసాగుతుంది. అయితే ఈ బోర్డు పాలక మండళ్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయన్న బహిరంగ విమర్శలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి చెందిన మైనార్టీ నేతలు ఈ పాలకమండళ్లలోకి రంగ ప్రవేశం చేయడం, తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.  ఇక విషయంలోకి వెళ్లితే వక్ప్ బోర్డుకు ఉన్నఅధికార పరిధిని తెలుసుకొందాం. వక్ప్ బోర్డు చట్టాల ప్రకారం ఎక్కడైనా ఆసంస్థభూమి కబ్జాకు గురైతే, దానిపై ఎవరైనా బోర్డుకు ఫిర్యాదు చేస్తే కబ్జా దారుడికి నోటీసు పంపడం వరకే వక్ప్ బోర్డు అధికార్లపాత్ర ఉంటుంది. కబ్జా దారులను భౌతికంగా ఆ స్థలం నుంచి తప్పించి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొనే యంత్రాంగం గానీ ఆతరహా అధికారాలుగానీ ప్రస్తుత చట్టం ప్రకారం వక్ప్ బోర్డు అధికార్లకు లేదు. కబ్జాఅయిన స్థలం స్వాధీనం చేసుకొనేందుకు వక్ప్ బోర్డు అధికార్లు రెవిన్యూ. పోలీసు అధికార్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కబ్జా అయిన వక్ప్ ఆస్తుల స్వాధీనం కోసం రెవిన్యూ అధికార్లుచొరవ చూపడంలేదు పోలీసు యంత్రాంగం ఆమేర తన చిత్తశుద్దిని ప్రదర్శించడంలేదు. 
ఇంటి దొంగల మాటున...గజ దొంగల రంగప్రవేశం...?
వక్ప్ ఆస్తుల దురాక్రమణ ఇంటి దొంగలతో మొదలై గజ దొంగల రంగ ప్రవేశంతో విచ్చల విడిగా కొనసాగుతోందన్న విమర్శలు బహిరంగమే. మరీ ముఖ్యంగా వక్ప్ బోర్డు పాలక మండళ్లతోనే వక్ప్ ఆస్తులకు చేటు వస్తోందని సమాచారం. మరోవైపు వక్ప్ బోర్డులో చాలా కాలం నుంచి తిష్టవేసిన వారి చర్యలు కూడా వక్ప్ ఆస్తులు అన్యాక్రాంతమవడానికి దోహదపడుతోందని విమర్శలువెళ్లువెత్తుతున్నాయి. ఎక్కడ వక్ప్ భూమి వుంది, దానిని అందరి కళ్లుగప్పి ఎలా కాజేయాలన్న సలహాలు సైతం వక్ప్ యంత్రాంగం నుంచే వెళ్తున్నాయన్న ప్రచారంకూడా వుంది. అందుకే వక్ప్ ఆస్తుల దర్జాగా కబ్జా అవుతున్నాయన్నది బహిరంగ రహస్యం. మరోవైపు ముస్లిం సంఘాల పేరుతో సాగుతున్న దందా వల్ల వక్ప్ ఆస్తుల పరిరక్షణ నిర్లక్ష్యానికి గురవుతోందన్న విమర్శకూడా ఉంది. వక్ప్ ఆస్తుల పరిరక్షణ అన్నది ముస్లిం సంఘాల గురుత్తర బాధ్యత. అలాంటి బాధ్యతను ముస్లిం సంఘాలే విస్మరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లీజు పేరుతో వక్ప్ ఆస్తుల్లోకి ఇంటి దొంగలు(కొందరు మైనార్టీలే) రంగ ప్రవేశం చేయడం ఆపై కబ్జాదారుల రంగ ప్రవేశం ఆ తరువాత వక్ప్ ఆస్తియే మాయం ఇద్దంతా వక్ప్ బోర్డుకు ఎలాంటి చట్టపరమైన అధికారాలు లేకపోవడం వల్లే. అదే వక్ప్ కమిషనరేట్ ఏర్పాటైతే ప్రతి ఆస్తికి, స్థలానికి ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పితే చర్యలు తీసుకొనేందుకు వీలుంటాది. అందుకే ప్రభుత్వాలు సైతం ఈ వక్ప్ కమిషనరేట్ ఏర్పాటుపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. వక్ప్ బోర్డులోని ఇంటి దొంగలతోపాటు భూ కబ్జా దారులకు కళ్లేం వేయాలంటే మనముందున్న ఏకైక మార్గం వక్ప్ కమిషనరేట్ ఏర్పాటు మాత్రమే.


నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటనలే...?
ఒక అంగుళం స్థలం కోసం కోర్టులకు ఎక్కుతున్న రోజులివి. కారణం నేడు భూమి అన్నది అంత విలువైంది గనుక. కానీ లక్షల ఎవరాలు, అందులోనూ విలువైన భూమి కలిగిన వక్ప్ బోర్డు తన ఆస్తులను మాత్రం కాపాడుకోలేకపోతోంది. ఇక్కడ ప్రభుత్వ ఉదాసీనత ఒకటి తోడైతే...బోర్డు అధికార్ల నిర్లక్ష్యం, వారికున్న పరిమిత అధికారాలు శాపంగా మారుతున్నాయి. వక్ప్ ఆస్తులను నిర్ధారించి తిరిగి వక్ప్ బోర్డుకు అప్పగించేందుకు వక్ప్ ట్రిబ్యూనల్ ఉంది. కానీ అందులో వక్ప్ బోర్డు తరపున ఆస్తుల పరిరక్షణ కోసం వాదించేందుకు పట్టిష్టమైన న్యాయవాదుల వ్యవస్థ లేదు. ఏదో సర్కారి గౌరవవేతనం కోసం అన్నట్లుగా వారి ఫీజులు ఉండటం, మరోవైపు వక్ప్ బోర్డులోని యంత్రాంగం సమర్థతను పక్కనెట్టి బందుప్రీతితో తమవారికే ట్రిబ్యూనల్ న్యాయవాదులుగా అవకాశం కల్పించడం జరుగుతోందని విమర్శలున్నాయి. ఫలితంగా వివాదాల్లోనున్న వక్ప్ ఆస్తుల కేసుల్లో అపజయాలే అనేకం ఉన్నాయి. మరోవైపు ఇటీవల దురాక్రమణకు గురైన వక్ప్ ఆస్తులను ట్రిబ్యూనల్ గుర్తించి ఈ ఆస్తులు వక్ప్ కు చెందినవేనని తేల్చిన కేసులు ఉన్నాయి. అలా తేల్చిన వాటిలో 124 కేసుల్లో వివిధ జిల్లాల కలెక్టర్ల వద్ద 74 కేసులు ఆర్టీఓ ల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఆస్తులు వక్ప్ వే వాటిని తిరిగి స్వాధీనం చేసుకొండి అని వక్ప్ ట్రిబ్యూనల్ పరిస్కరించిన కేసులు. తీర్పులు అనుకూలంగా వచ్చినా దురాక్రమణకు గురైన వక్ప్ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోకుండా కలెక్టర్ల వద్ద, ఆర్టీఓ వద్ద పైళ్లు ములుగుతున్న ఘటనలు ఇవి. ఎందుకీ ఉదాసీనత అంటే ప్రశ్నించే అధికారం వక్ప్ బోర్డుకు లేకపోవడం, అడిగే వారు లేరు కాదా తరువాత చుద్దాం అన్న అధికార యంత్రాంగం ఉదాసీనత కారణంగా నేడు వక్ప్ ఆస్తులు చేజేతులారా వదులుకోవాల్సి వస్తోంది.
ప్రభుత్వాలకు చిత్తశుద్దివుంటే వక్ప్ ఆస్తుల పరిరక్షణ సాధ్యమే..?
చిత్తశుద్దివుంటే కానిది ఏదీ లేదు. వక్ప్ ఆస్తులను పరిరక్షించాలన్న ఉద్దేశముంటే ప్రభుత్వానికి అనేక మార్గాలు లేకపోలేదు. వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ప్ బోర్డుస్థానంలో వక్ప్ కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలి. దేవదాయాశాఖ భూములు ఎక్కడైన కబ్జాకు గురైందన్న మాట మనం వినడం అరుదు. ఎందుకంటే దేవదాయ(ఎండోమెంట్) భూముల పరిరక్షణ కోసం ఎండో మెంట్ కమిషనరేట్ వుంది. ఎక్కడైనా ఎండోమెంట్ భూమి కబ్జాకు గురైందని తెలిస్తే వాటిని వెంటనే స్వాధీనం చేసుకొనే సర్వాధికారాలు ఉన్నాయి. అలాంటి అధికారాలు వక్ప్ బోర్డులకు లేదు. అందుకే వక్ప్ బోర్డుల స్థానంలో వక్ప్ కమిషనరేట్ ను ప్రభుత్వం తీసుకొచ్చి కబ్జా అయిన భూములు తిరిగి స్వాధీనం చేసుకొనేలా పట్టిష్టమైన అధికారాలు ఆ కమిషనరేట్ కు ఇవ్వాలి. అపుడే వక్ప్ ఆస్తుల పరిరక్షణ సాధ్యమవుతుంది. వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం ఇలాంటి ఎన్నోమార్గాలున్నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమీ చేయడంలేదంటే ముస్లింల పట్ల, వక్ప్ ఆస్తుల పట్ల వారికున్న చిత్తశుద్ది ఏ పాటితో మనం అర్థంచేసుకోవాలి. ఇందుకోసం మనం మరింత లోతుగా చర్చించుకొందాం. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకొన్నాయో, వస్తున్న ఫలితాలు ఏమిటో ఓ సారి పరిశీలిద్దాం. వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం అక్కడి గతంలో పాలించిన వామపక్ష పార్టీల ప్రభుత్వం వక్ప్ చట్టంలో చిన్న సవరణ చేసి వక్ప్ ఆస్తుల ఆక్రమణ కాగ్నిజబుల్ నేరంగా పరిగణిస్తూ కబ్జాదారుడిపై క్రిమినల్ కేసు నమోదుకు అక్కడి పోలీసు అధికార్లకు అధికారం ఇవ్వబడింది. నాటి నుంచి వక్ప్ ఆస్తుల దురాక్రమణ పెద్దగా జరగకపోగా గతంలో జరిగిన కేసుల్లో భూమి తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఉపయోగపడిందని సమాచారం. ఇక కర్ణాటకతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో వక్ప్ ఆస్తులను పబ్లిక్ ప్రెమిసెస్ ఆస్తికింద నోటిఫై చేశారు. అంటే వక్ప్ ఆస్తిని అక్కడ కబ్జా చేస్తే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లేనని లెక్క. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఎలాంటి చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో అందరికి తెలిసిన విషయమే.
విరాళాలలో అజతవాసులు
పార్టీలపై పెద్ద ఎత్తున్న విరాళాల జల్లు
రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో వీరి నుంచే విరాళాలు
దీనికి ఊతమిచ్చేలా బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలు
వీరినుంచే బీజేపీకి 90వాతం నిధులు
అన్ని రకాల విరాళాలలో బీజేపీదే పై చెయ్యి
బీజేపీకి బహుదూరంలో హస్తం పార్టీ
అయినా రెండో స్థానంలో కాంగ్రెస్
నల్లధనం వెలికితీత సంగతి ఏమిటీ...?
విరాళాలలో ప్రాంతీయ పార్టీల హవా
తొలిస్థానంలో వైసీపీ, రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ 
ఆ తరువాత స్థానాల్లో టీడీపీ, టీఆర్ఎస్


మన భారత దేశం వేగంగా పురోగతి సాధిస్తున్న దేశంలోని పేదోడి కష్టాలు తీరడంలేదు. కారణం సంపద ఒకరి చేతిలో కేంద్రీక`తం కావడం. మరి మన భారతదేశం పురోగతి సాధించినట్లా లేక దేశంలోని కొందరు మాత్రమే అమాంతంగా ధనవంతులైనట్లా...? మన దేశంలోని ఎన్నికల వ్యవస్థలో ధన వ్యవస్థ పూర్తిగా రూపుమాపినపుడే ప్రజా సంక్షేమ ప్రభుత్వం వస్తుంది. అలా కాకుండా ధన ప్రవాహంతో గెలిచి అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ముమ్మాటికి కార్పోరేట్ కంపెనీలకు దాసోహంగా పనిచేస్తోంది. ఈ కారణం చేతనే మన భారతదేశం వేగంగా పురోగతి సాధించినా ఆ ఫలాలు అందడంలో ఎన్నో తారతమ్యాలు నెలకొన్నాయి. ఇదిలావుంటే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో 7 జాతీయ, 25 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.6,405.59కోట్ల విరాళాలు వసూలు చేసినట్లు ప్రజాస్వామ్య సంస్కరణలవేదిక (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. మొత్తం రాజకీయ పార్టీల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్,  ఐఎన్ ఎల్ డీలుమాత్రమే తాము ఎలాంటి నిధులూ వసూలుచేయలేదని, పైసాకూడా ఖర్చుపెట్టలేదని చెప్పాయి. జాతీయపార్టీలు తాము వసూలుచేసిన మొత్తంలో 36.16% మాత్రమే ఎన్నికల కోసం ఖర్చుపెడితే, ప్రాంతీయ పార్టీలు 68% ఖర్చు చేసినట్లు ఏడీఆర్ వెల్లడించింది. బీజేపీకి గరిష్ఠంగా రూ.4,057.40 కోట్ల విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ కు రూ.1,167.14 కోట్ల్లు, వైసీపీకి రూ.221.58 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు రూ.141.09 కోట్లు, తెలుగుదేశానికి రూ.131.33 కోట్లు, టీఆర్ఎస్ కు రూ.129.26 విరాళాలు దక్కాయి. అత్యధిక విరాళాలు దక్కించుకున్న ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీ, టీఆర్ఎస్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వచ్చిన విరాళాల్లో బీజేపీకి రూ.1,141.72 కోట్లు, కాంగ్రెస్ రూ.626 కోట్లు, వైసీపీ రూ.85 కోట్లు, టీడీపీ రూ.79.26 కోట్లు, టీఆర్ఎస్ రూ.9.15 కోట్లు వ్యయం చేశాయి. అత్యధిక మొత్తం ఖర్చు చేసిన ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ రెండోస్థానంలో, టీడీపీ 4, టీఆర్ఎస్ 9వ స్థానంలో నిలిచాయి.


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అతి గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఆర్థిక శక్తే అన్నది ఒప్పుకోం. ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే అంటే, ఎవరు ఎక్కువ ఎన్నికల నిధులను విరాళంగా ఇస్తే వారికే మన దేశ రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తాయి. అంటే వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీల విధానాలు ఉంటాయి. అధికారంలోకి వస్తే ఆ విధానాలనే అమలు చేస్తాయి. వారి కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లేకపోవడం. దేశంలోని పార్టీలకు పెద్ద ఎత్తున్న విరాళాలు అందుతున్నాయని, అందులో బీజేపీ తొలిస్థానంలో నిలిచిందని నివేదికలు తేల్చిచెబుతున్నాయి. అందులోనూ దేశంలోని రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలలో గుర్తు తెలియని వ్యక్తులు విరాళాలే అధికమని తేలతేటమైంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అదే విరాళాలలోనూ బీజేపీ దే పై చెయ్యి.
విరాళాలలో ఎవరిది పై చెయ్యి....?
రాజకీయపార్టీలకు అందుతున్న విరాళాల్లో సగం ‘గుర్తు తెలియని’ దాతలవేనని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) ఇటీవలి నివేదికలో వాపోయింది. మన దేశంలో విరాళాల ప్రక్రియ ఎంత లోపభూయిష్టమైనదో ఈ నివేదిక మారోమారు తెలియచెప్పింది. దేశంలోని వివిధ పార్టీలను పరిశీలిస్తే వారికి వచ్చిన నిధుల్లో 69 శాతం తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవేనని ఏడీఆర్ 2017లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.  2017–18 ఆర్థిక సంవత్సరంలో వేర్వేరు మార్గాల్లో ఆరు రాజకీయపార్టీలు అందుకున్న రూ.1293కోట్లల్లో 689 కోట్లు గుప్త నిధులే. ఇందులో సింహభాగం అంటే రూ.1027కోట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళకాలంలో బీజేపీ ఆదాయం దాదాపుగా రెట్టింపైతే, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ ఆదాయం తగ్గిపోతూ వచ్చింది. మిగతా పార్టీలన్నీ బీజేపీకి ఆమడదూరంలో ఉన్నాయి. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా 2018వ ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మిగతా ఐదుపార్టీల సగటుకంటే నాలుగురెట్లు అధికంగా గుప్త నిధులను అందుకున్నది. 20వేల లోపు విరాళాలకు, ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన సొమ్ముకు పార్టీలు దాతల వివరాలు బయటకు చెప్పనక్కరలేదు. కనుక నిధుల్లో సగానికిపైగా ఈ కోటాలో పోతున్నాయి. అధికారంలో ఉన్నది కనుక 2013–14లో రూ.674కోట్ల ఆదాయం ఉన్న బీజేపీ 2017–18 కాలానికి 1027కోట్లకు పెరగడం, ఇదే కాలంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ ఆదాయం 598కోట్లనుంచి రూ.199కోట్లకు పడిపోవడం సహజం. 2017–18 కాలానికి ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీలకు సమకూరిన 215కోట్లలో సైతం బీజేపీదే అగ్రస్థానం. బ్యాంకులు జారీ చేసిన బాండ్లలో 95శాతం దాని పేరిటే దాతలు రాసిచ్చేశారు. పారిశ్రామిక పెద్దలు, కార్పొరేట్‌ సంస్థలు ఎలక్టొరల్‌ ట్రస్టుద్వారా ఇస్తున్న విరాళాల్లోనూ బీజేపీదే పైచేయి. దీనిద్వారా రూ.194కోట్ల విరాళాలు అందితే వాటిలో అధికశాతం బీజేపీకే దక్కాయి. కాంగ్రెస్‌కు పదికోట్లే వచ్చాయి. 2017–18 సంవత్సరానికి ఆశ్చర్యంగా భారతీయ జనతా పార్టీకి 20 వేల రూపాయలకు మించిన విరాళాలు 93 శాతం, అంటే 437.04 కోట్ల రూపాయలు అందాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి 5. 67 శాతం చొప్పున కేవలం 26.66 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎన్నికల బాండుల రూపంలో వచ్చినవే ఎక్కువ. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే 20 వేల రూపాయలకు మించని విరాళాలు 51 శాతం వచ్చాయి. ఆ తర్వాత 31 శాతంతో ఎన్నికల బాండులు ఉన్నాయి.
రాజకీయ పార్టీలకు సమకూరుతున్న ఆదాయంలో సగానికి పైగా ఆదాయం గుర్తుతెలియని వనరుల (అన్‌నోన్ సోర్సెస్) నుంచి సమకూరుతోందని అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. రాజకీయ పార్టీలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని ఏడీఆర్ తాజా నివేదిక వెల్లడి చేసింది. ఏడు జాతీయ పార్టీలు అనగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్‌లు తమ ఆదాయ పన్ను రిటర్నులను ఈసీకి సమర్పించాయి. అయితే సీపీఎం తన రిటర్న్ ల్లో అనుబంధ వివరాలు లేకపోవటం వల్ల ఆ పార్టీకి సంబంధించిన గుర్తుతెలియని వనరుల ఆదాయాన్ని విశ్లేషించటం సాధ్యం కాలేదని ఏడీఆర్ పేర్కొంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, సీపీఎం మినహా మిగతా ఆరు జాతీయ రాజకీయ పార్టీలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,293.05 కోట్ల ఆదాయం సమకూరినట్లు రిటర్ప్ ల్లో చూపాయి. ఈ మొత్తంలో గుర్తు తెలియని వనరుల ఆదాయం రూ. 689.44 కోట్లుగా పేర్కొన్నాయి. అందులో రూ. 553.38 కోట్లు (80 శాతం) ఒక్క బీజేపీదేనని వెల్లడించింది. అంటే, మిగతా ఐదు పార్టీలకన్నా బీజేపీకి లభించిన గుర్తుతెలియని వనరుల ఆదాయం నాలుగు రెట్లు అధికంగా ఉంది. గుర్తు తెలియని వనరుల ఆదాయాలు కాంగ్రెస్‌ పార్టీకి రూ. 119.91 కోట్లు, బీఎస్‌పీకి రూ. 10.67 కోట్లు, ఎన్‌సీపీకి రూ. 5.37 కోట్లుగా ఉన్నాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్‌ రూ. 10.4 లక్షలు, సీపీఐ రూ. 30,000 గుర్తు తెలియని వనరుల ఆదాయాలుగా చూపాయి. ఇదిలావుంటే.. 2004-05 నుంచి 2017-18 మధ్య ఈ జాతీయ పార్టీలు రూ. 8,721 కోట్లు గుర్తు తెలియని వనరుల ద్వారా సేకరించాయని ఏడీఆర్ లెక్కగట్టింది. ఈ గుర్తుతెలియని వనరుల ద్వారా లభించే ఆదాయం ఏ రూపంలో లభించింది - నగదు రూపంలోనా, చెక్కులు తదితర రూపాల్లోనా - అనే వివరాలూ లేవు.




విదేశాల్లో అయితే...?
అమెరికా, యూరప్‌, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, బల్గేరియా, భూటాన్, నేపాల్ దేశాల్లో ఎన్నికల నిధుల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఈ దేశాల్లో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయనే పూర్తి వివరాలు బహిర్గతం చేస్తున్నాయని సమాచారం. దీంతో ఎవరు, ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చారో ఓటరుకు తెలిసిపోతుంది. ఏ పార్టీ విరాళాలు ఇచ్చిన వారి ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నదో, ఏ పార్టీ ప్రజల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆయా దేశాల్లోని ఓటరు బేరేజు వేసుకొని ఓటు వేయగలరు.

నల్లధనం వెలికితీత గాలికిపోయే...ఈ నల్లధనం సంగతేమిటీ...?
దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీసుకరావడమే కాకుండా పార్టీలకు విరాళాల రూపంలో వస్తున్న నల్లడబ్బును కూడా అరికడతామని అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో నల్లడబ్బును ఏ మాత్రం అరికట్టలేక పోగా, కట్టలు తెంచుకొని నల్లడబ్బు పారేలాగా వెయ్యి, పదివేలు, లక్షా, పది లక్షలు, కోటి రూపాయల ఎన్నికల బాండులను 2017 బడ్జెట్‌ ప్రతిపాదనల ద్వారా ప్రవేశపెట్టింది. 2017–18 సంవత్సరానికి ఏయే పార్టీకి ఏయే రూపంలో ఎన్ని విరాళాలు వచ్చాయో ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌’ సంస్థ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. నల్లడబ్బుకు ముసుగు వేయడానికే ఎన్నికల బాండులను తీసుకొచ్చారని మాజీ ఎన్నికల కమిషనర్‌ నవీన్‌ చావ్లా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.




చట్టంలో లొసుగులకు తెరలేపిన బీజేపీ...?
ఇప్పుడు దీనస్థితిలో ఉన్న పార్టీలు సైతం రేపు ఎన్నికల్లో నెగ్గితే భూరి విరాళాలు అందుకుంటాయి. మనదేశంలో పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో చేసే ఖర్చుపై పరిమితి ఉన్నదే కానీ, రాజకీయపార్టీపై లేదు. పార్టీ విరాళాలపై పరిమితి విధిద్దామని ఇటీవల ఎన్నికల సంఘం అంటే, బీజేపీ ఈ ప్రతిపాదనను కొట్టిపారేసింది. 2017లో బీజేపీ హడావుడిగా 2013నాటి కంపెనీల చట్టాన్ని మార్చి కార్పొరేట్‌ విరాళాల ప్రక్రియను ఎంతో సులభతరం చేస్తే, ఈ ఫైనాన్స్‌బిల్లును అన్ని పార్టీలూ ముక్తకంఠంతో ఆమోదించి సహకరించాయి. కార్పరేట్‌ సంస్థలు నికరలాభంలో ఏడున్నరశాతం మించి విరాళాలు ఇవ్వకూడదన్న నిబంధన తొలగిపోయి, ఇచ్చిన విరాళాలను సైతం తమ పద్దుల్లో చూపనక్కరలేని స్వేచ్ఛ వాటికి దక్కింది. ఇప్పటికే పెరటిదోవన అందుకున్న నల్లధనాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి 20వేల రూపాయల లోపు విరాళంగా రాజకీయపార్టీలు పద్దుల్లో రాసిపారేస్తున్నాయి. ఎలక్టొరల్‌ బాండ్స్‌ పరిస్థితిని మార్చకపోగా, దాతకూ, స్వీకర్తకూ, ప్రజలకూ మధ్యన అనేక ఇనపతెరలు కట్టి, రహస్య విరాళాలకు రెడ్‌కార్పెట్‌ పరిచింది. ఇప్పుడు వెయ్యి, పదివేల రూపాయల విలువగల ఎలక్టొరల్‌ బాండ్స్‌ కాక, పదిలక్షలనుంచి కోటిరూపాయల పరిధిలోనివి 99శాతం అమ్ముడుపోతూ వాటిలో గరిష్టం అధికారపక్షానికే దక్కుతున్నప్పుడు ధనికులు, కార్పొరేట్‌ సంస్థలు ఈ సదవకాశాన్ని ఎంత చక్కగా వాడుకుంటున్నారో అర్థమవుతూనే ఉంది. సమాచార హక్కుచట్టం పరిధిలోకి రమ్మంటే తాడెత్తున మండిపడిన రాజకీయపక్షాలన్నీ జవాబుదారీతనం, పారదర్శకత వంటివి ప్రజలనుంచి ఆశిస్తూ, తాము మాత్రం వాటికి అతీతమని నమ్ముతాయి. దాతల వివరాలను వెల్లడిస్తే అధికారంలో ఉన్న తమ పార్టీకి ఎక్కువ విరాళాలు రాకపోవచ్చని, ముఖ్యంగా నల్లడబ్బుకు అవకాశం లేకపోయినట్లయితే నిధులు బాగా తగ్గి పోతాయని మోదీ ప్రభుత్వం భావించి ఈ మోసపు విధానానికే మొగ్గు చూపింది.
ధనంలో కలసిరాని హస్తవాసి...అయినా నిధుల సేకరణలో కాంగ్రెస్ రెండో స్థానం...?
అయితే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం 2017లో కాంగ్రెస్ పార్టీ దగ్గర సుమారు రూ.223 కోట్ల నిధులు ఉన్నాయి. ఇదేమీ తక్కువ మొత్తం కాదు. అధికారంలో ఉన్న బీజేపీ కంటే కాస్త తక్కువ మాత్రమే. రూ.1,026 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. ఇప్పటికీ దేశంలోని రెండో ధనిక పార్టీ కాంగ్రెస్సే. అయితే, ఈ పార్టీకి 2017లో సుమారు రూ.35.89 కోట్ల మేర ఆదాయం తగ్గింది.



ఎన్నికల బాండుల్లో బీజేపీకే 95 శాతం
2018–19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికే 834.7 కోట్ల రూపాయల ఎన్నికల బాండులు విక్రయించినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. 2017–18 సంవత్సరం కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2019–2020 సంవత్సరానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క సీపీఎం మినహా ఆరు జాతీయ పార్టీలకు కలిపి 2017–18లో 53 శాతం అంటే, 689.44 కోట్ల రూపాయలు గుర్తు తెలియని దాతల నుంచి వచ్చాయి. 36 శాతం అంటే 467.13 కోట్ల రూపాయలు తెల్సిన దాతల నుంచి వచ్చాయి. ఇక్కడ గుర్తుతెలియని దాతలంటే బ్యాంకులకు, రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వారు కాదు. కేవలం ప్రజలు లేదా ఓటర్లకు గుర్తుతెలియని వారే.
ఏమిటీ బాండుల సంగతి...?
భారతీయ స్టేట్‌ బ్యాంకుల నుంచి ఎవరైనా వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎన్నికల బాండులను కొనుక్కోవచ్చు. వారి వివరాలను బ్యాంకు లావాదేవీల అవసరార్థం బ్యాంకు బ్రాంచులు నమోదు చేసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఆ బాండ్‌ను ఏ పార్టీకి ఇచ్చేది ఆ దాత వెల్లడించాల్సిన అవసరం అస్సలు లేదు. దాత ఆ బాండును తీసుకెళ్లి ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ఆ దాత వివరాలను నమోదు చేసుకుంటుంది. అయితే ఇటు బ్యాంకులుగానీ, రాజకీయ పార్టీలుగానీ ఎన్నికల బాండుల దాతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలకు ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రజలకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మొదట బీజేపీ ప్రభుత్వం ఈ బాండుల దాతల వివరాలను విధిగా వెల్లడించాలనే నిబంధన తీసుకరావాలనుకుంది. కానీ అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరించిందన్న విమర్శవుంది.
ఎలక్టోరల్ బాండ్స్ గుట్టు విప్పాల్సిందే
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు అందజేస్తున్న పారిశ్రామికవేత్తల వివరాలను ప్రజల ముందు పెట్టవలసిందే. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇస్తున్న పారిశ్రామికవేత్తలు, సంస్థల వివరాలు ప్రజలు ముఖ్యంగా ఓటర్లకు అవసరం లేదంటూ బీజేపీ అధినాయకత్వం చేస్తున్న వాదన ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల మూలంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంస్థలు, వ్యాపారస్తులు, ఇతర వాణిజ్య ప్రముఖులు రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చే విధానానికి బీజేపీ రెండు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టటం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చే వారి పేర్లు, ఇతర వివరాలను గుప్తంగా ఉంచుతారు. విరాళాల దాతల పేర్లు, వివరాలను గుప్తంగా ఉంచే విధానాన్ని ఇతర రాజకీయ పార్టీలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వ్యతిరేకిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చే విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు తెలియజేయవలసిందేనని కేంద్ర ఎన్నికల సంఘం వాదిస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇందుకు సమ్మతించటం లేదు.
ఈ విరాళాలను అరికట్టకపోతే జరిగే నష్టం...?
పెద్ద పారిశ్రామిక సంస్థ ఒక రాజకీయ పార్టీకి పది కోట్ల విరాళం ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వంద కోట్ల లాభం పొందటం ప్రతి పారిశ్రామికవేత్త, సంస్థ నైజం. ఈ లెక్కన బి.జె.పి, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు లేదా టి.ఆర్.ఎస్, తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి వంటి ప్రాంతీయ పార్టీలు తమకు లభించే విరాళాలకు ప్రతిగా ఆయా పారిశ్రామికవేత్తలు, సంస్థలకు రెండింతల, మూడింతల ప్రయోజనం కలిగించవలసి ఉంటుంది. ఇలా జరగటం వలన సగటు మనిషికి తీరని అన్యాయం, నష్టం జరిగిపోతుంది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆయా రాజకీయ పార్టీల్లో పెట్టుబడులు పెట్టి ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత తమ పెట్టుబడులకు తగు మోతాదులో లాభాలు రాబట్టుకుంటారు. రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో అందే నిధులు అవినీతికి సోపానాలు. ఈ ఉన్నత స్థాయి అవినీతిని అరికట్టాలంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపం లేదా మరో రూపంలో రాజకీయ పార్టీలకు అందే విరాళాల పూర్తి వివరాలను ప్రజల ముందు పెట్టవలసిందే. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల్లో పారదర్శకత లేకపోవటం అంటే అవినీతికి పాల్పడుతున్నట్లే. ఇటీవల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిన విరాళాల్లో దాదాపు 95 శాతం నిధులు బి.జె.పికి అందాయి. బి.జె.పి అధికారంలో ఉన్నది కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ విరాళాలు అందుతాయి. ఎంత ఎక్కువ విరాళాలు అందితే అంతే పెద్ద స్థాయిలో ప్రతి సహాయం (క్విడ్ ప్రోకో) చేయవలసి ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పారిశ్రామికవేత్తలు, సంస్థల నుండి విరాళాలు తీసుకుని అధికారంలోకి వచ్చిన తరువాత వారు అడిగిన పని చేసిపెడుతున్నారు, ఇలా చేయటం అవినీతి కాదా, రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందే విరాళాల గురించి తెలుసుకోవలసిన అవసరం, హక్కు, అధికారం ప్రజలకు లేదంటూ అటర్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ సుప్రీం కోర్టులో వాదించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.