ఏప్రిల్ 2020
కవితా రచన-సాబిర్ హుసేన్,
కవి, సీనియర్ జర్నలిస్టు.
సెల్ నెం-91547-05556


దోపిడీ వ్యాపారులపై కవి సాబిర్ భాయ్ అక్షర గళం

డబ్బు జబ్బు
-----------------// సాబిర్ //


మొదట్నుంచీ వాడంతే
నేను మనిషిని ప్రేమించేవాడ్ని
వాడు డబ్బే ముఖ్యమనే వాడు

బంధాలు, అనుబంధాల్ని
ఆస్తిపాస్తులతో కొలిచేవాడు
లాభనష్టాల లెక్కలేసుకొనే
ఎదుటి మనిషినితో మాట్లాడేవాడు

మెడదువాపు ప్రబలినప్పుడు
నేను ఉచితంగా బెల్లడోనా పంచుతుంటే
అదే బెల్లడోనాను
అధిక ధరలకు అమ్ముకునేవాడు

తుఫాన్లు వచ్చినప్పుడు
సహాయక శిబిరాల్లో నేనుంటే
సరుకుల్ని బ్లాక్ చేసి
కాసుల త్రాచులమీద కూర్చునేవాడు

ఇప్పుడూ అంతే
కరోనా రక్కసి దెబ్బకు
పేద జనం ఆకలితో అల్లాడుతుంటే
బియ్యం, పప్పుల ధరలను పెంచి అమ్ముకుంటూ
రెండు చేతులా దోచుకుంటున్నాడు

పాపాయి నవ్వుల్లో
రూపాయి సవ్వడి వింటాడు
తల్లా పెళ్ళామా అంటే
డబ్బున్నోల్లే కావాలంటాడు

మానవత్వమనేది
చెల్లని నోటంటాడు
మనీ లేనివాడు
మనిషే కాదంటాడు

పంద్రాగస్టు అంటే
జెండాలమ్ముకునే రోజనే వాడు
వందేమాతరంలో
 “వంద “ ఉందని మురిసిపోతాడు

వాడెప్పుడూ అంతే
శ్రమ సంపదను దోచుకునే వాడి బొజ్జ నిండా
ఎన్ని జబ్బులో...!
( కరోనా విపత్తు సమయంలో నిత్యావసర సరుకులను
అధిక ధరలకు విక్రయిస్తున్న కొందరు దోపిడీ వ్యాపారులకు వ్యతిరేకంగా)
....................................

రచయిత-ఖర్షీద్ బేగం
సెల్ నెం-95504-71369


చుట్టూ భయం అనే చీకిటి...... మనసులో నిరాశ అనే భావన...........ప్రతి క్షణం ఏమి జరుగుతుందో అనే అలజడి.........అన్నీ ఉన్న ఏమి చేయలేని నిస్సహాయత.....ఎంతో సాధించిన ఇంకా శూన్యం లోనే ఉన్నామా అనే సందిగ్దత........            ప్రస్తుతం ప్రపంచం అంతా ఇలాంటి మానసిక అలజడి లో ఉంది..ప్రతి వ్యక్తి ఈ కరోన అనే మహమ్మారి వలలో చిక్కు కొని ....అన్ని ఉన్నవాళ్లు ఏమి లేని వారిగా,ఏమి లేని వారు మరి ఘోరంగా అవస్థలు పడుతున్నారు....అయితే ఇలాంటి పరిస్థితులలోనే ఒక విశ్వాసి,ఒక అల్లాహ్ దాసుడు,గొప్ప సత్యాన్ని గ్రహించవలిసి ఉంది. ఈ కష్టాల సహవాసం తో విశ్వాసి తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. మన వ్యక్తిత్వ సౌధాన్ని, కష్టాలుగా మన మీదకు వచ్చి పడే రాళ్ళ తో ఎంతో గొప్పగా తీర్చి దిద్దుకోవాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, వ్యక్తిగతంగానో, లేక సామూహికంగా నో, కష్టాలు అనేవి తప్పక వస్తాయి. మనలో చాలా మంది ఉంటారు. పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటారు. విధిరాతను దెప్పి పొడుస్తుంటారు. ఇలాంటి వారే తమ వ్యక్తిత్వాన్ని బలహీన పరచుకుంటారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే...జీవితంలోని కష్ట, నష్టా లలో, ఎత్తు పల్లాలలో, కూడా తమ ఆలోచనలను, మనస్సును, భావోద్వేగాలను, అదుపులో ఉంచుకుంటారు. అయితే కష్టాలు అనేవి దైవం తరుపు నుంచే వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే...మనల్ని పరీక్షించడానికి, మన వ్యక్తిత్వ నిర్మాణానికి. ఈ రోజు మనం చూస్తున్నాం...యావత్ ప్రపంచం ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఒక మహమ్మారి పై పోరాడుతుంది. ప్రపంచం మొత్తం స్తబ్దత ఆవరించి ఉంది. ప్రజల వద్ద ఎనలేని సంపద ఉన్నా దాని తో ఏమి కొనలేని పరిస్థితి. ఈ కష్టాలు మానవాళి అందరికి సహనాన్ని అలవాటు చేయడానికి వస్తాయి. అంతే కాకుండా కష్టాలు, బాధలు మనిషికి గుణాపాఠాన్ని నేర్పిస్తాయి. ఎలాగంటే తను కొంత కాలం తాత్కాలికంగా ఇంట్లోనే ఉంటేనే అతనికి కొంత మంది కొన్ని కారణాల వల్ల శాశ్వతంగా ఇంట్లోనే ఉండే వారిని చూసి తన పరిస్థితి మేలనుకుంటా డు. తనకు ఇప్పుడు పంచభక్ష పరమాన్నం దొరకక పోయిన చాలా సాదా, సీదా,ఆహారం తింటున్నా కూడా చాలా మందికి ప్రతి రోజు కనీసం గంజి నీళ్లు కూడా దొరకడం లేదనే విషయాన్ని గ్రహించి అతను వారి కంటే ఎంత అదృష్టవంతుడో అనే సత్యాన్ని, గుణాపాఠాన్ని,గ్రహిస్తాడు. ఈ సత్యం ,గుణపాఠం గ్రహించినప్పుడే అతని కష్టం, ఆపద,భయం, తేలిక అయిపోతుంది. ఒకవేళ అసలు ఈ కష్టాలే రాకపోతే మనిషికి ప్రశాంతత  విలువ తెలియదు. ఎలా అంటే సముద్రంలో ప్రయాణించే నౌక తుఫానులను, గాలులను, ఆటుపోటులను ఎదుర్కొని తీరాన్ని చేరితే అప్పుడు గాని నౌకలో ప్రయాణించే బాటసారికి కష్టాలను, ఆపదలను, భయాలను, ఎదుర్కొన్న తర్వాత తాను సురక్షితంగా తీరాన్ని చేరాననే ప్రశాంతత, స్థిమితం కలుగుతుంది. ఆ ప్రశాంతత, హాయి మనసుకు ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అదే విధంగా ఈ కష్టాలు మనిషిని దైవానికి దగ్గర చేస్తాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తాయి, మనిషి ప్రాపంచిక జీవితం కేవలం నీటి బుడగ లాంటిదని. ప్రాపంచిక జీవితం అనేది శాశ్వతం కాదు .అది అంతం అవ్వాల్సిందే. ప్రతి ప్రాణి అంతం అవ్వాల్సిందే. కాబట్టి ఈ యదార్ధాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఈ రోజు అన్నీ ఉండి కూడా మానవ జీవితం ఇక్కట్ల పాలయ్యింది. సైన్సు కూడా బహహీనం అయిపోయింది. టెక్నాలజీ కూడా బహహీనం అయిపోయింది. పారిశ్రామిక రంగం కుదేలయిపోయింది. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. అగ్ర( రాజ్యాలుగా చలామణి అయ్యే దేశాలు సైతం చేతులు ఎత్తేసాయి. (సూరే తాహా, ఆయాత్ 124 to 126)లో దైవం ఎలా అంటున్నాడు. నా వద్ద నుంచి మీకు ఏదైనా మార్గ బోధన అందినప్పుడు మీలో నా బోధనను అనుసరించే వాడు దారి తప్పడు, దౌర్భాగ్యానికి లోనవడు. మరెవరైతే నా  జ్ఞాపిక బోధనా పాఠం పట్ల విముఖుడు అవుతాడో అతనికి ప్రపంచంలో ఇక్కట్లు నిండిన జీవితం ప్రాప్తమౌతుంది. అయితే ఈ ఇక్కట్లు ప్రతి సారి ఉండవు. దైవం అప్పుడప్పుడు ఇదే విషయాన్ని తన దాసులకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇప్పుడైనా మనిషికి హితబోధ కలగాలి. తాను దైవ దాసుడని, దైవ విధేయుడనే వాస్తవం గ్రహించాలి. కాబట్టి మహాశేయులారా ఇదే మంచి సమయం దైవం వైపుకు మరలడానికి ఖురాన్ గ్రంధంలో దైవం అంటున్నాడు మేము నిన్ను తప్పక పరీక్షిస్తాము.  భయం,ప్రమాదాలు,ఆకలి,దప్పుల కు,గురి చేసి మరీ పరిక్షిస్తాము. కావున...ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని గ్రహించాలి
.....................................


రచయిత-ముహమ్మద్ మజాహిద్
సెల్ నెం-96406-22076


విక్రమ్ రోజూలానే ఆ రోజూ కూడా తూలుతూ ఇంట్లోకి అడుగుట్టాడు. తిన్నగా మంచంపై కుప్పకూలిపోయాడు. కాసేపటి తరువాత తనకు తాను తేరుకుని లేచి కూర్చొన్నాడు. తన బ్యాగులోనుంచి మద్యం సీసాలను పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టాడు. తెల్లారితే జనతా కర్ఫ్యూ  అని ప్రకటించడంతో ముందు జాగ్రత్తగా రేపటికోసం చేసుకున్న ఏర్పాటు అది. ఇదంతా తన పదిహేనేళ్ల కొడుకు రవి గమనిస్తున్నాడు. అయినా రవికి ఇదేమీ కొత్తకాదు. తన తండ్రి రోజూ  తప్పతాగి ఇంటికిరావడం చూసి రవి లోలోపల బాధపడేవాడు. తన తల్లి చావుకు కారణమైన ఈ మద్యాన్ని నిందించడం తప్ప తండ్రిని ఎదిరించలేని నిస్సహాయత అతనిది.
తండ్రి ఎంత తప్పతాగి వచ్చినా రవి మాత్రం తన తండ్రిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇంటికొచ్చాక తప్పతాగి పడుకున్న తన తండ్రి మేజేళ్లు విప్పడం, సాక్సులు తీసి ఉతకడం, మంచినీరు అందించడంలాంటి మంచీచెడ్డా అన్నీ చూసుకునేవాడు. ఆ రోజు కూడా తన తండ్రికి సపర్యలు చేశాడు. తన తండ్రికి మంచినీరందించాడు. తలగడ సర్దాడు. ఆ తరువాత తండ్రిపై దుప్పటి కప్పి వెచ్చగా పరుండబెట్టాడు. ఆ తరువాత తన చదువుల్లో లీనమయ్యాడు. తెల్లారింది. తండ్రి బాగా పొద్దుపోయాక కానీ లేవడు. రోజూలానే ఆరోజూ తండ్రికోసం టీ, టిఫిన్ సిద్ధం ట్రే తీసుకొచ్చాడు. అప్పటికే టేబుల్ మీద ఉన్న మద్యం బాటిళ్లను పక్కనపెట్టి టీ, టిఫన్, ప్లేట్లను సర్దాడు. రవి తాపీగా కుర్చీలో కూర్చుని టీవీ చూడసాగాడు. ఆ సమయంలో కరోనా వార్తలు క్రికెట్ స్కోర్లా లైవ్ ప్రసారాలు జోరందుకున్నాయి. తబ్లీగీ జమాత్ మర్కజ్  వార్తలను టీవీ ఛానళ్లు పోటీలుపడి ప్రసారం చేస్తున్నాయి. బాగా పొద్దెక్కడంతో  తండ్రిని నిద్రలేపే ప్రయత్నం చేశాడు. ‘‘నాన్నా! నిద్రలేవండి. మీకిష్టమైన పండ్లు ఫలాలు తెచ్చాను.’’ అంటూ నిద్రలేపాడు. తన కొడుకు చెప్పిన ఈ మాటలకు విక్రమ్ నిద్ర మత్తు వదిలింది. షాక్ కొట్టినట్లు అనిపించాయి ఆ మాటలు. చిర్రుబుర్రులాడుతూనే నిద్ర లేచాడు. ‘‘ఫ్రూట్సా? ఎక్కడినుంచి తెచ్చావ్’’ అని కోపంతో ఊగిపోతూ అడిగాడు. ‘‘అది నాన్నా! కింద సలీమ్ చాచా ఫ్రూట్స్ బండి దగ్గర తెచ్చాను’’ అని కిటికీలోంచి చూపిస్తూ భయంతోనే చెప్పాడు రవి. ‘‘అరే పిచ్చోడా ఇలాంటి టోపీ, గడ్డం ఉన్న వాళ్లదగ్గర ఫ్రూట్స్ కొనకూడదని తెలియదా?’ అని రగిలిపోతూ తెచ్చిన పండ్లు, ఫలాలను కిటికీలోంచి విసిరికొట్టాడు. ఇల్లంతా నిశబ్దం రాజ్యమేలింది. ఏం జరిగిందో రవికి అర్థం కావడం లేదు. తన తండ్రి ఏం మాట్లాడుతున్నాడో పాలుపోవడంలేదు. ‘‘నాన్నా మీకెంతో ఇష్టమని తెచ్చిన ఫ్రూట్సన్నీ ఇలా ఎందుకు నేలపాలు చేశారు’’ ధైర్యం కూడగట్టుకుని తన తండ్రిని అడిగే ప్రయత్నం చేశాడు. ‘‘పిచ్చోడా టీవీల్లో చూడటం లేదా? కరోనాను అందరికీ అంటించేందుకు వీళ్లేం చేస్తున్నారో టీవీల్లో చూడటం లేదా?’ అని ఊగిపోతున్నాడు విక్రమ్. ‘‘నాన్నా ఆ వీడియోలన్నీ అబద్ధాలు. కరోనా ఇప్పుడొచ్చింది. కానీ నేను ఆరు నెలల క్రితమే ఆ వీడియోలు చూశాను.’ అన్నాడు రవి. ‘‘నోర్మూయ్; ఈ ముల్లాల గురించి నీకేం తెలుసు.’’ కొడుకును దబాయించే ప్రయత్నం చేశాడు విక్రమ్ ‘‘నాన్నా మీడియా ఎత్తుగడలు మీకు తెలియదు. మీరు మీడియా మాయలో పడిపోయారు. ఇలాంటి మహమ్మారి వేళ విద్వేషాన్ని చిమ్ముతారా ఎవరైనా? ఏదో ఒకనాడు ఆ వీడియోలు ఫేక్ అని ప్రపంచానికి తెలుస్తుంది. ఆనాడైనా  మీలో మండుతున్న విద్వేషాగ్ని చల్లారుతుందా? మీడియా ద్వారా ప్రచామైన ద్వేషం మీ నరనరాల్లో వేగంగా పాకుతుంది’’ అని నిట్టూర్చాడు.

ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విక్రమ్ కొడుకు మాటల్ని చెవికెక్కించుకోవడం లేదు. ఎంతసేపటికీ తన పాటే పాడుతున్నాడు. ‘‘వాళ్ల వల్లే ఈ అంటువ్యాధి దేశంలో అంటుకుంది. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.’ అన్నది విక్రమ్ వాదన. ‘‘నాన్నా దేశవిదేశాల నుంచి వేలాది మంది వచ్చారు. ఎంతోమంది ద్వారా ఈ అంటువ్యాధి మనదేశానికి అంటుకుంది. కేవలం 30శాతమే వాళ్ల వల్ల ఈ వ్యాధి ప్రబలింది. మరి మిగిలిన 70శాతం వ్యాప్తికి కారకులెవరు?.’ వారి గురించి మీడియా ఎందుకు ప్రచారం చేయదు? రవి సమాధానం.  రవి చెప్పిన మాటలేవీ విక్రమ్ కు రుచించడం లేదు. అతనికి ఏమాత్రం నచ్చడం లేదు. ‘ఈ తబ్లీగీలు మన జీవితాన్ని నరకకూపంగా మార్చారు. మన ప్రాణాలు తీసుకోవడమే వాళ్ల పన్నాగం’’ అంటూ కొడుకుపై చిందులేయసాగాడు. ఆ కోపంలో టేబుల్ మీదున్న టీ, టిఫిన్ ట్రేను కాలితో ఒక్క తన్నుతన్నాడు. టీ, టిఫిన్ మొత్తం నేలపాలయ్యింది. తండ్రి వ్యవహారం పట్ల రవి ఆందోళన చెందసాగాడు. మౌనమే సమాధానమని అమాయకపు చూపులతో తన తండ్రి వంక చూస్తూ ఉండిపోయాడు. మళ్లీ కాసింత ధైర్యం కూడగట్టుకుని సారాయి బాటిల్ వంక చూస్తూ ‘‘నాన్నా కొరోనా వైరస్ తోనే ప్రాణాలు పోతాయా? ఈ మాయదారి సారాయి ఎంతమందిని బలితీసుకుందో మీకు తెలియదా? ఈ మద్యం మహమ్మారి వల్ల ఎన్ని కాపురాలు కూలిపోయాయి? ఎన్ని జంటలను విడగొట్టింది? ఎంతమంది పిల్లల్ని అనాథల్ని చేస్తుంది? చివరికి నా కన్నతల్లి కూడా ఈ మద్యానికే బలైంది కదా నాన్నా’’ రోదిస్తూనే తండ్రిని నిలదీస్తున్నట్లు అడిగాడు. తన కొడుకు లేవనెత్తిన ప్రశ్నలు విక్రమ్ ను ఆలోచనల్లో ముంచెత్తాయి. తబ్లీగీ జమాఅత్ కు ఈ మద్యం చేసే చేటుకు సంబంధమేముంది అని లోలోనే అనుకోసాగాడు విక్రమ్.  రవి గత మూడు రోజులుగా టీవీలో మర్కజ్ వార్తలు చూస్తున్నాడు. ఆ వార్తలను గుడ్డిగా నమ్మకుండా నిజమెంతో నిర్ధారణ   చేసుకోవాలనుకున్నాడు. తన చిన్ననాటి ముస్లిమ్ ఫ్రెండ్స్ తో గంటల తరబడి చర్చించాడు. వాళ్లు చెప్పిన మాటలు రవిని కదిలించాయి. మీడియా ప్రచారం చేసిన అపోహలు, అపార్థాలన్నీ దూరం చేసుకున్నాడు. ఆ విషయాలను తన తండ్రికీ చెప్పి తండ్రిని కమ్మేసిన అపార్థాల మబ్బులను తొలగించాలనుకుని చెప్పడం మొదలెట్టాడు. ‘‘నాన్నా ఈ తబ్లీగీ అన్నలు లక్షలాది మందిని మద్యం వ్యసనాన్నుంచి విడిపించారు. దొంగతనాలు, లూటీలు చేసేవారిలో మార్పు తీసుకొచ్చి వారిని  నీతి, నిజాయితీపరులుగా మార్చారు.  గౌరవప్రదమైన జీవితాన్ని గడపేలా పరివర్తన తీసుకొచ్చారు. ఏ మతానికి చెందినవారినైనా అందరినీ గౌరవిస్తారు. అబద్ధం చెప్పడం వాళ్ల దృష్టిలో పెద్ద పాపం. పరాయి స్త్రీపై దృష్టిపడకుండా దారిలో నడిచేటప్పుడు చూపులు కిందికి వాల్చి నడవాలని వాళ్ల మనుషులకు నేర్పుతారు. మూత్రం తుంపరులు తమ ఒంటిమీద పడితే ఎక్కడ అశుద్ధులవుతామోనన్న భయంతో ఎప్పుడూ నిల్చొని కూడా మూత్రవిసర్జన చేయరు నాన్నా వాళ్లు. చెడు వ్యసనాల నుంచి ప్రజలను కాపాడటమే వాళ్ల మిషన్. నిజదైవాన్ని పరిచయడం చేయడమే వాళ్ల లక్ష్యం. అలాంటి వారు కరోనా అంటించి ప్రజలను బలితీసుకుంటారంటే ఇది నమ్మశక్యమా? అని రవి చెబుతుంటే శ్రీకాంత్ కళ్లు తెరుచుకున్నాయి. ఏదో కొంతమంది చేసిన తప్పిదాలకు సమాజం మొత్తాన్ని బోనులో నిలబెట్టడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇంకా చెప్పడం కొనసాగించాడు. ‘‘కొరోనా కొంతమందినే పొట్టనపెట్టుకుంటుంది కానీ విద్వేషపు మంటలు పూర్తి సమాజాన్ని చుట్టుముటుతాయి. విక్రమ్ తన కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ కిందపడి ఉన్న టీ, టిఫిన్ గిన్నెలను ఎత్తి టేబుల్ మీద సర్దాడు.
‘‘నాకు ఫ్రూట్స్ తినాలనిపిస్తోంది రా’’ అన్నాడు. ‘‘మీకిష్టమని తెచ్చిన ఫ్రూట్స్ మీరే కిందకు విసిరికొట్టారు’’ అని చిరు కోపంతోనే అన్నాడు రవి ‘‘వెళ్లు కింద తోపుడు బండి సలీమ్ చాచా దగ్గరకెళ్లి రెండు కిలోల తాజా ఫలాలు తీసుకురా’’ అని తన పర్సులోని ఐదువందల నోటు తీసిచ్చాడు.’’ ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అనుకున్నాడు. తన తండ్రిలో వచ్చిన మార్పుకు అని లోలోనే సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. సలీమ్ చాచా బండి నుంచి ఫ్రూట్స్ కొనుగోలు చేసేందుకు హుటాహుటిన బయలుదేరాడు. గడపదాటి అడుగుపెట్టబోయేసరికి; అంతలోనే ‘ఆగూ’ అన్న పిలుపుతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. రవికి తన గుండె ఆగినంత పనయింది. వెనక్కి తిరిగి చూశాడు. ‘‘ఈ సారాయి బాటిళ్లను బయల ఎవరు పారేస్తారు’ అన్న ప్రశ్నతో తన ప్రశ్నలన్నీ పటాపంచలయ్యాయి. ఉన్నపళంగా వచ్చి తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు రవి.  

రచయిత- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
సెల్ నెం-99125-80645


అంటు వ్యాదులు ప్రభలినపుడు సామూహిక నమాజులు సముచితం కాదు
ప్రవక్త మహానీయులు ఇదే చెప్పారు

          ఇస్లామ్ ఒక సమగ్రమైన, సంపూర్ణమైన జీవనధర్మం. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన సమస్త సమస్యలకూ పరిష్కారం ఉంది. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో, ఏవిధంగా స్పందించాలో, ఏవిధంగా జీవితం గడపాలో ధర్మం చెబుతోంది. ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా యావత్ దేశం లాక్ డౌన్ లో ఉంది. ఇలాంటి ఒక విపత్కర పరిస్థితిలో పవిత్ర రమజాన్ మాసం ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో పవిత్ర రమజాన్ శుభాలు, జమాత్ తో కలిసి ఆచరించబడే ఆరాధనలను గురించి చాలామంది ముస్లిముల్లో ఆందోళన నెలకొనడం సహజమే. కాని, ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏంచేయాలన్న విషయమై ఇస్లామీ ధర్మశాస్త్రం చాలా స్పష్టమైన మార్గనిర్దేశాలు చేసింది. వర్ష తీవ్రత ఉన్న సమయంలో, చలి తీవ్రత ఉన్న సమయంలో మసీదులకు వెళ్ళవద్దని, మసీదు నుండి వెలువడే అజాన్ పిలుపు విని ఎవరికి వారు వ్యక్తిగతంగా ఇళ్ళ వద్దనే నమాజులు ఆచరించాలని చెప్పింది. వర్షం కారణంగా, చలి తీవ్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ఆశించిన ధర్మం, ఇలాంటి ప్రాణాంతక కొరోనా  మహమ్మారి ప్రబలుతున్నసమయంలో సామూహిక ప్రార్ధనలు, నమాజులు చేయాల్సిందేనని ఎలా కట్టడి చేస్తుంది. కాస్తయినా బుర్రతో ఆలోచించాలి. ముహమ్మద్ ప్రవక్త (స) చాలా స్పష్టంగా చెప్పారు. అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఒకచోటినుండి మరోచోటికి వెళ్ళవద్దని, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని లాక్ డౌన్ ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా అంటువ్యాధి ప్రబలిన చోట ఉంటే, వారు అక్కడే ప్రత్యేకంగా ఉండాలని, ఇతరులను అక్కడికి రానీయ వద్దని ఆదేశించారు. వ్యాధులతో బాధపడే వారు, ఇతరులకు దూరంగా ఉండాలని, తమ దుస్తులు, తమ వస్తువులు ప్రత్యేకంగా ఉంచుకోవాలని చెప్పారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వస్త్రం అడ్డుపెట్టుకోవాలని ప్రవక్త ఆనాడే చెప్పారు. పరిశుభ్రత విశ్వాసంలో సగ భాగమని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఉపదేశించారు. ఈనాడు మనం ఐసోలేషన్ , క్వారంటేన్ , ఫిజికల్ డిస్టెన్సింగ్ అనే పదాలు ఏవైతే వాడుతున్నామో, నాటి అవసరాలకనుగుణంగా ముహమ్మద్ ప్రవక్త (స) ఆకాలంలోనే వీటిని ఆచరణలో పెట్టారు. అందుకని ఒంటరి నమాజు కన్నా, సామూహిక నమాజు మిన్న.. జమాతుతో ఆచరిస్తే 27 రెట్లు పుణ్యం ఎక్కువ.. నమాజులో దగ్గర దగ్గరగా, భుజానికి భుజం ఆనించి నిలబడాలి...లాంటి ఆదేశాలు ఈ స్థితిలో వర్తించవు. ఎందుకంటే ఇదొక ప్రత్యేక పరిస్థితి. సర్వకాల సర్వావస్థల్లో ప్రవక్త మహనీయుల వారి ఆదేశాలే మనకు ప్రామాణికం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రవక్తవారు మనకు చక్కని దిశానిర్దేశం చేశారు. కనుక మనం  అనుమానం పడాల్సిన అవసరం లేదు. వీటి గురించి ఆలోచించాల్సిన అసరమూలేదు. ఇంట్లో ఒంటరిగా నమాజు చేసినా  నిస్సంకోచంగా మసీదులో జమాతుతో చేసిన పుణ్య ఫలమే లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని మనసులో ఏవిధమైనటువంటి అనుమానానికి తావులే కుండా శ్రధ్ధా భక్తులతో రోజా వ్రతాన్ని ఆచరించాలి. రోజు వారీ ఐదు పూటల నమాజు తోపాటు, రంజాన్ లో  ప్రత్యేకంగా  ఆచరించే తరావీహ్ నమాజులు సైతం ఇంట్లోనే చేసుకోవాలి. సదఖ, ఫిత్రా లాంటి దానధర్మాలు కూడా ఇంటిపట్టునే ఉంటూ నెరవేర్చుకోవాలి. అవసరార్ధులకు సహాయం అందించే విషయంలో కూడా స్థానిక అధికారులు సూచించిన సమయాల్లోనే బయటికి వెళ్ళి అలాంటి పనులు చక్కబెట్టుకోవాలి. బయటికి వెళ్ళిన క్రమంలో రోజేదార్లు కూడా మాస్కులు ధరించాలి. సమూహంగా ఉండకూడదు. భౌతికదూరం పాటించాలి. శానిటైజర్ వాడాలి. శానిటైజర్ వాడడం వల్ల రోజాకు ఎలాంటి భంగమూ కలగదు.
రోగ నిరోధక శక్తిని పెంచేఖర్జూరం, బాదాం, పిస్తా, అఖ్రోట్ లాంటిడ్రై ఫ్రూట్స్ వినియోగించాలి. అవి పొందలేని అవసరార్ధులకు సమకూర్చాలి. నేలపై వారిని ఆదుకుంటే నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు అన్న ప్రఖ్యాత సూక్తిని ఈ పవిత్రమాసంలో ప్రతినిత్యం  నెమరు వేసుకుంటూ పేదసాదలను ఆదుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆకలిగొన్న ఒక్క నిరుపేదకు అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు సమకూర్చడం  స్వతహాగా  గొప్ప పుణ్యకార్యం. కాని ఈ పవిత్ర మాసంలో అలాంటి సత్కార్యాలు ఆచరిస్తే అల్లాహ్ అమితంగా సంతోషిస్తాడు. అనంతంగా అనుగ్రహిస్తాడు. లాక్ డౌన్ పుణ్యమా అని ఈ ఇంట్లో ఉన్న సమయాన్ని సదాచరణలకే వినియోగించిలి. దివ్యఖురాన్ పారాయణానికి, దైవనామ స్మరణకు, జిక్ర్ అజ్కార్ లకు వెచ్చించాలి. తరచుగా దురూదె షరీఫ్ పఠిస్తూ ఉండాలి. దైవాన్ని ప్రసన్నం చేసుకోడానికి శక్థివంచనలేని కృషి చెయ్యాలి. ఆయన ప్రసన్నుడైతే అన్ని సమస్యలూ, అన్ని ఆపదలూ తొలగినట్లే. కొరోనాతో సహా.. అల్లాహ్ ను ప్రసన్నం చేసుకోడానికి రమజానుకు మించిన మరో సమయం లేనేలేదు. ఇఫ్తార్ సమయంలో చేసే దుఆ అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు. కనుక ఆసమయాన్ని , ఆ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. మరికొన్ని ప్రత్యేక దుఆలూ, ప్రత్యేక సూరాలను కంఠస్తం చెయ్యాలి. పిల్లలకు కలిమాలు, సూరాలు, నీతికథలు నేర్పాలి. ఒక నిఖార్సయిన విశ్వాసిగా, బాధ్యత గల పౌరుడిగా విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి. అల్లాహ్ మనందరికీ రమజాన్ శుభాలతో పునీతులు చేయుగాక..ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొరోనా మహమ్మారి నుండి మానవాళిని రక్షించుగాక.! ఆమీన్ ..యా రబ్బల్ ఆలమీన్ .!
             
.............................................


సేవలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’
లాక్ డౌన్ వేళ అన్నార్తులకు నిరంతరాయంగా చేయూత

ఒక ఫోన్ కాల్ లాక్ డౌన్ వేళ ఆకలితో అలమట్టించే వారిలో ధైర్యం నింపుతోంది. ఒక ఫోన్ కాల్ తో అందరికీ కాకపోయినా కొందరికైనా నిత్యవసర వస్తువులు దరికి చేరుతున్నాయి. లాక్ డౌన్ మొదలుతో మొదలైన ఆ ఫోన్ కాల్ సేవలు నేటికీ నిరంతరంగా కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ ముగిసే వారికి ఈ ఫోన్ కాల్ మోగుతునే ఉంటుందని...తమ వంతు సహాయం చేస్తూనే ఉంటామని ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’ ఛైర్మన్ మతీన్ షరీఫ్ పేర్కొంటున్నారు. తనకు వచ్చిన ఫోన్ కాల్ కు స్పందించి సహాయం చేయడమే కాదు ఎక్కడైనా మరింత సహాయం అవసరమైతే సేవ చేసే దాతలకు అక్కడి అవసరాలను తెలియజేస్తున్నారు. ఇంతవరకు మనం అడ్వాన్స్ గా టిక్కెట్ బుకింగో, లేక ఏ ఇతర వస్తువుల బుకింగో చేసుకోవడం వినివుంటాం. కానీ మాకు నిత్యవసరాలు అందించండి అని అడ్వాన్స్ బుకింగ్ ను కూడా మతీన్ షరీఫ్ తీసుకొంటున్నారు. వచ్చే కాల్స్ అవసరాలను బట్టి నిత్యవసరాలు నిత్యం కొనుగోలు చేస్తూ పేదలకు ఆయన సేవ చేస్తున్నారు.

చెప్పడానికే నీతులు..అంటే వినడానికే నీతులు అన్నది మనం వినేవుంటాం. చూసేవుంటే. కానీ చెప్పేది ఆచరించి చూపడం అంటే మహానుభావులకే సాధ్యం. అల్లాహ్ రంజాన్ వేళ జకాత్ ఎందుకు అనివార్యం చేశాడు. కొందరికి సంపద ఇస్తే అతను సమాజం పట్ల ఎలాంటి బాధ్యత నెరవేర్చాలనీ అల్లాహ్ తకీదు చేశాడు. ఇది చెప్పడమే కాదు ఆచరించి చూపింది ఓ కుటుంబం. అలాంటి సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’. అక్షరం ఎపుడూ న్యాయం వైపే నిలవాలి, బలహీనుడి పక్షం వహించి అతనికి రక్షణగా మారాలి. అదే సంద్భంలో పదిమందికి ఆదర్శంగా నిలిచే ఘటనను లోకానికి తెలియజేయాలి. ఇది లోక కళ్యాణం కోసం. అందులో భాగమే ఈ ప్రయత్నం.
దేశమంతా కొనసాగుతున్న లాక్ డౌన్ వేళ అన్నార్తుల ఆకలి తీరుతోందంటే అది మన దేశంలోని సేవా గుణం ఉన్నవారి వల్లే. ఇలాంటి సేవకు ఆదర్శంగా నిలిచింది హైదరాబాద్ లోని చంపాపేట్ లోని ఓ కుటుంబం. ఈ ప్రేరణకు కారణం లేకపోలేదు. ఆ కుటుంబంలోని యజమాని స్వతహాగా ఓ స్వచ్చంధ సేవా సంస్థలను నడుపుతున్నారు. అదే  ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’. ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టే ఆ సంస్థ ఛైర్మన్ మతిన్ షరీఫ్ మదిలో పుట్టిన ఆలోచనతో ఆయన కుటుంబం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. సహజంగా విరాళాల ద్వారా వచ్చే నిధులతో స్వచ్ఛంధ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటాయి. కానీ మతిన్ షరీఫ్ మాత్రం లాక్ డౌన్ వేళ అందుకు భిన్నమైన ఆలోచన చేశారు. తాను చేసే పని ద్వారా పదిమందికి ఆదర్శంగా నిలవాలని భావించారు. సేవ చేసేందుకు నిధులు తన సొంత కుటుంబం నుంచి సేవ మాత్రం తాను స్థాపించిన సంస్థ  ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’ తరపునుంచి చేపట్టాలని భావించారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం కుటుంబం తమ ఆర్థిక స్థోమత సహకరించినంత వరకు ఏ మాత్రం సంకోచించకుండా ఖర్చు చేస్తుంది. అది కొత్త బట్టల కోసం కావచ్చు, రంజాన్ లో అందొచ్చే కొత్త రుచులకోసం కావచ్చు, ఇతర ఇతర వాటికి కావచ్చు. అదే సందర్భంలో ఆర్థికంగా బాగా ఉన్నవారికి జకాత్ ఇచ్చే బాధ్యత ఇస్లాం విధించింది. దేశంలో లాక్ డౌన్ వేళ ఉపాధి లేక పేదలు అలమట్టిస్తుంటే, గౌరవంగా బతికిన కుటుంబాలు సైతం సహాయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.  అయితే తన చేతనైన మేర లాక్ డౌన్ లో పేదలను అందుకోవాలని  ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’ ఛైర్మన్ మతీన్ షరీఫ్ ఆలోచన చేశారు. అంతే. తన ఆలోచనను తొలుత తన కుటుంబంలోని వారికి తెలియజేశారు. తోబుట్టువులతో కూడా ఆయన పంచుకొన్నారు. అంతే ఈ సారి రంజాన్ లో చేసే ఖర్చును మొత్తంగా పేదల సహాయానికి అందించాలని భావించారు. అంతేకాదు దేశం మొత్తం విషాదంలో చిక్కుకుంటే రంజాన్ పేరుతో కొత్త బట్టలు, ఇతర షాపింగ్ చేయడం సరికాదని భావించారు. గతంలో మాధిరిగా రంజాన్ మాస మంతా తాము చేసే ఖర్చులు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని భావించారు. ఆ డబ్బును ఆదాచేసి ఆకలితో అలమట్టించే వారికి తమ వంతు చేయూత నివ్వాలని ఆ కుటుంబం భావించింది. అంతే లాక్ డౌన్ మొదలు నేటి వరకు నిరాటకంగా పేదల ఆకలిని తీర్చేందుకు నిరంతర సేవను  ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’ ద్వారా ఈ కుటుంబం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలిచింది.
లాక్ డౌన్ కొనసాగే దాకా...?
హలో సాబ్ హం...ఫలానే కాలనీ సే బాత్ కర్ రహేహై...హమారే యహా రేషన్ కి జరూరత్ హై...కుచ్ మద్దత్ కరోనా సాబ్ అంటూ రోజు వచ్చేకాల్స్ కోసమే కాదు సహాయం కోసం అడ్వాన్స్ బుకింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి  ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’ ఛైర్మన్ మతీన్ షరీఫ్ కు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఒక రోజు లాక్ డౌన్ అనంతరం వాటిని పొడిగిస్తూ ప్రకటన వచ్చాక  ‘‘అహమ్మద్ షరీఫ్ ఫౌడేషన్’’ ఛైర్మన్ మతీన్ షరీఫ్ తన కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో సమావేశమై పేదల ఆకలి తీర్చే నిర్ణయం తీసుకొన్నారు. అంతే కాదు మార్చి నెల 24వ తేదీ నుంచే తన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు వంద కుటుంబాలకు డిమాండ్ పెరిగితే దానికంటే ఎక్కువ స్తాయిలోనే రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఎనిమిది కేజీల బియ్యం, మూడు కేజీల గోదుమ పించి, అయిల్ ప్యాకేట్, కిలో కంది పంపుతోపాటు వంటకు అవసరయ్యే ఇతర వస్తువులను కలిపి కిట్ గా అందచేశారు. ఒక్కో కిట్ విలువ రూ.600. ఇది హోల్ సెల్ ధరలో కొనుగోలు చేసిన ధర. ఇలా రోజుకు రూ.60వేలు మొదలు ఆపై వరకు ఇలా నేటికీ పేదలను ఆదుకొనే కార్యక్రమం కొనసాగుతునే ఉంది. ఇద్దంతా తన కుటుంబం, తోబుట్టువులు, దగ్గరి వారి ఈ రంజాన్ ఖర్చును పేదల కోసం ఖర్చుచేద్దామని సంకల్పించడం వల్లే సాధ్యమైందని మతీన్ షరీఫ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీతోపాటు ఎల్ బి నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, అంబర్ పేట, రాజేంద్రనగర్ దాని పరిసర ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాలను మతీన్ షరీఫ్ చేపట్టారు.
చూడాల్సింది మతం కాదు...ప్రదర్శించాల్సింది మానవత్వాన్ని

ఏ మతం ఇతర మతాలను ద్వేషించాలని చెప్పలేదు. ఇస్లాం అన్ని వర్గాలను, మతాలను గౌరవించాలని, ఎవరి మనస్సు గాయపడేలా ప్రవర్తించరాదని తకీదు చేసింది. దాని ప్రకారమే మతీన్ షరీఫ్ కుల, మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ, ఇతర వర్గాలున్న ప్రతి వాడల్లో తన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సేవ కార్యక్రమం తనకు ఎంతో సంతోషానిస్తుంటే ఏఫ్రిల్ 8న వచ్చిన హనుమాన్ జయంతి రోజు మరింత అనందాన్ని ఇచ్చిందని ఓ ఘటనను ఆయన గుర్తుచేసుకొన్నారు. ఆ రోజు తమ సంస్థ ద్వారా నగరంలోని హిందూ సోదరులుండే బస్తీలో విజిటబుల్ బిర్యాన్ని తయారు చేసి వారికిచ్చి వారి ఇండ్లలో పండగ వాతావరణం తీసుకొచ్చామని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. హిందూ సోదరులు కూడా తమ సహాయాన్ని ఎంతో గౌరవంగా స్వీకరించారని ఆయన తెలిపారు. ఇది మన భారతదేశ మత సామరస్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ముస్లిం ఈ సారి రంజాన్ మాసంలో చేసే ఖర్చును ఆదాచేసి ఆకలితో అలమట్టించేవారిని ఆదుకోవాలని ఆయన కోరారు.
...................................
..................................
రచయిత-ముహమ్మద్ అజ్గర్ అలీ



ఈ రంజాన్ నెలంతా ఇలా గడుపుదామా...?

రంజాన్ అంటేనే ఓ నెల పాటు సాగే సందడి. కానీ యావత్తు ప్రపంచానికి నేడు కరోనా మహమ్మారి పిడిస్తున్నందున ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోన మహమ్మారి కారణం గా ప్రపంచవ్యాప్తంగా మానవాళికి, ముస్లింల మతపరమైన దినచర్యలకు ఆటంకం ఏర్పడినది.  మనస్సువుంటే మార్గాలేన్నో అన్నట్లు ఈ లాక్ డౌన్ ను కూడా రంజాన్ మాసంలో అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి. రంజాన్ మాసం అంటే వినోదాల కోసం కాదు. అల్లాహ్ మార్గంలో అనునిత్యం మాసమంతా ఆరాధనల్లో నిమగ్నంకావడం. ఈ విషయాన్ని మనం ముందుగా అర్థంచేసుకోవాలి. మరి లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితం కావాల్సివస్తోంది కాబట్టి అల్లాహా్ కై చేసే ఆరాధనల్లో మనం ఉండిపోవచ్చు. 
అందుకే మనం మానసికంగా  లాక్-డౌన్/క్వారంటైన్ లో రంజాన్ గడపడానికి సిద్ధం కావాలి. ముందుగా  మనం ఈ పవిత్రమైన రంజాన్ మాసం లో చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవాలి.
 1.రంజాన్ ప్లానర్:
రంజాన్ నెల ప్రారంభం అయ్యింది. ఈ విలువైన సమయాన్ని ఉత్తమంగా గడపడానికి ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. ఇఫ్తార్, సెహర్ కోసం తినుబండారాలను సిద్దం చేసుకోవడం, ఇంట్లో   ప్రార్థన ప్రాంతాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఇబాదా కోసం బట్టలు ఏర్పాటు చేయడం, ఇతర గృహ శుభ్రపరిచే పనులు చేయడం వంటి పనుల జాబితాను రూపొందించండి. రంజాన్ ప్లానర్‌లో ఈ అన్ని పాయింట్లను వ్రాసుకొంటే, సమయానికి చేయవలసిన అన్ని పనులను గుర్తుంచుకోవడానికి సులభం అవుతుంది. 
2.ప్రతిఫలం పొందడానికి రంజాన్ ఉత్తమ సమయం:
రంజాన్ నెల సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రార్థనలకు  (ఫర్జ్  మరియు నఫిల్) సాధారణ రోజుల కంటే డెబ్బై రెట్లు ఎక్కువ ప్రతిపలం ఇచ్చే నెల. సల్మాన్ (ర)అన్నారు : “షాబాన్ చివరి రోజున, అల్లాహ్ యొక్క దూత మమ్మల్ని ఉద్దేశించి ఇలా అన్నారు:  “ఓ ప్రజలారా! ఇప్పుడు మీపై ఒక గొప్ప నెల వస్తుంది. అది అత్యంత ఆశీర్వాదమైన నెల, దీనిలో వెయ్యి నెలల కన్నా ఎక్కువ విలువైన రాత్రి ఉంది. ఈ నెల పగటిపూట ఉపవాసం పాటించాలని, రాత్రి తారావీహ్ ను అల్లాహ్ సున్నత్ చేసాడు. ఎవరైతే ఈ నెలలో ఏదైనా సద్గుణమైన కర్మలు చేయడం ద్వారా అల్లాహ్‌కు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారో అతనికి 70 రెట్ల ఉత్తమ ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయతో మీరు అధిక ప్రతిఫలం లభించే ఈ నెలలో ఫర్జ్ మరియు నఫిల్ ప్రార్థన చేసేలా చూసుకోండి.
3.ఇంట్లో పవిత్ర ఖురాన్ పారాయణం చేయండి:
లాక్-డౌన్/క్వారంటైన్ సమయం లో మీరు ఇంటికి మాత్రమే పరిమితం కావాలి. పవిత్ర ఖురాన్ ను దాని తఫ్సీర్ తో పాటు పఠించడానికి మీకు ఎక్కువ సమయం ఉంది. మీ సమయాన్ని ఉపయోగించుకోవటానికి, అల్లాహ్ (SWT) తో మీ సంబంధాన్ని పెంచడానికి ఇది ఉత్తమ సమయం.
4.ఇంట్లో తరావీహ్ ప్రార్థన చేయండి: 
తరావీహ్ రంజాన్ కరీం యొక్క అందం. లాక్-డౌన్ /క్వారంటైన్ కాబట్టి మీరు తరావీహ్ ప్రార్థనలు ఇంట్లో చేయండి. మీరు ఖురాన్ యొక్క చిన్న సూరాలను పఠించడం ద్వారా తరావీహ్ ను కూడా చేయవచ్చు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌తో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఈ ప్రార్థనలు మిమ్మల్ని ఆధ్యాత్మికత యొక్క అపారమైన సంతృప్తికి దారి తీస్తాయి.
5.రంజాన్ ను అధ్కర్, దువాలతో  (adhkar and duas) గడపండి:
లాక్డౌన్/క్వారంటైన్ లో  అందరు ఒకరకమైన ఆందోళన, వత్తిడిని  కలిగి ఉంటారు. కరోన మహమ్మారి కి వ్యతిరేకంగా దువా చేయండి. అధ్కార్, దువాలతో సమయాన్ని గడపండి. దువా చేయడానికి ఇది ఉత్తమ సమయం. దువాలు  చిన్నవి అయినప్పటికీ, మీరు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వాటిని పఠించడం నిత్యకృత్యంగా చేసుకోవచ్చు. లాక్-డౌన్/క్వారంటైన్ లో  రంజాన్ గడపటానికి ఇవ్వన్ని పరిగణించదగిన అంశాలు. అంతిమంగా మీ హృదయాన్ని అల్లాహ్‌కి సమర్పించి అన్ని ఒత్తిళ్లు, ఆందోళనలు, చింతలు, భయాలు, ఆశలను ఆయనతో పంచుకోవడానికి ఇది ఉత్తమ సమయం. అతనికి  మాత్రమే అన్ని తెలుసు. అతను తన జీవులపై దయ చూపిస్తాడు. లాక్-డౌన్/క్వారంటైన్  సమయం లో మన సృష్టికర్తను ప్రసన్నం చేసుకోవడానికి మన వంతు కృషి చేద్దాం.

రచయిత-ముహమ్మద్ అజ్గర్ అలీ



ఈ దోశలు మరీ మంచివి...
అది ప్రోటీన్ తో కూడిన  అల్పాహారం

దక్షిణ భారత దేశ ప్రధాన అల్ఫాహారాలలో దోశ చాలా ఫేమస్. దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలలో అల్ఫహారాలు స్థానిక అభిరుచులకు అనుగుణంగా వేర్వేరుగా ఉన్నా దోశ మాత్రం యూనివర్శల్ గా మారింది. అంటే దోశలేని టిఫిన్ సెంటర్లు దక్షిణ భారతదేశంలో కనిపించదు. అయితే ఈ దోశ తినడం వల్ల అధిక అయిల్ తో ప్రమాదమన్న ప్రచారం కూడా ఉంది. ఇలాంటి ప్రచారమున్నా మనస్సు చంపుకొని దోశ తినకుండా ఉండలేరు. అందరూ అంతగా ఇష్టపడే దోశలో ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.  దోశ ప్రోటీన్ తో కూడుకొన్నది. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ లలో ఒకటి అని కొందరు వైద్యులు చెబుతున్నారు. అదేంటో తెలుసుకుంగామా మరి. దోశ సుమారు 120 కేలరీలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనది అని కొందరు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
దోశ -ప్రయోజనాలు:
1.దోశ  పులియబెట్టిన బియ్యంతో తయారవుతుంది
పులియబెట్టిన ఉత్పత్తులు శరీరానికి విరుగుడు (antidote) గా పనిచేస్తాయి. ఇవి కేలరీలు తక్కువగా ఉంటాయి, శరీరానికి ఆరోగ్యంగా ఉంటాయి, ఉదరాన్ని  మంచి స్థితిలో ఉంచుతాయి. అవి సహజంగా అనేక విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ పెరుగుదలకు తోడ్పడతాయి, రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. జీర్ణ వ్యాధుల యొక్క అవకాశాలు తగ్గుతాయి.
2.ప్రోటీన్స్ తో నిండినది.
దోశ పిండి పులియబెట్టిన బియ్యం, నల్ల ఉరద్ (urad) పప్పుతో తయారు చేయబడింది. ఇందులో కాయధాన్యం. పప్పుధాన్యాలు ఉండును.  కాయధాన్యాలలో  ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలపై అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను ఇస్తాయి. దోశ పిండిని   రాగి, వోట్స్ లేదా బుక్వీట్ తో కూడా చేయవచ్చు.
3.బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది
దోశ, ఇడ్లీ, ఉత్తపం వంటివి పోషక దట్టమైనవి. ప్రాసెస్ చేయబడవు. ఇంట్లో సులభంగా తయారు చేయవచ్చు. ఇది జీర్ణించుకోవడం కూడా సులభం.ఇది శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా  ఉంచుతుంది. మెంతి విత్తనాలు పిండిని తయారుచేసేటప్పుడు వాటిని దోశ పిండిలో జోడించండి.  ఇది మంచి ఆహారo.
4.పిండి పదార్థాలు, కొవ్వు యొక్క ఆదర్శ మొత్తాన్ని కలిగి ఉంటుంది
దోశ ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంపిక. తక్కువ/ ఆదర్శవంతమైన కొవ్వును కలిగి ఉంటుంది. దోశ పిండిలోని మంచి కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా విడుదలవుతాయి. రోజుకు అవసరమైన శక్తిని ఇస్తాయి.
5.మసాలా దోశ కన్నా సాదా దోశలు ఆరోగ్యరీత్యా మంచివి. ఆరోగ్యం, పోషణ కోసం, రాగి దోశలు వాడండి. రాగి దోశలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, డయాబెటిస్. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

రచయిత-మహమ్మద్ యాకూబ్
సెల్ నెం-93967-06460


ఇదే తరావీహ్ నమాజ్ ప్రత్యేకత


రమజాన్‌ మాసంలోని ఆరాధనల్లోని ముఖ్య ఆరాధన రాత్రిళ్లలో అల్లాహ్ ముందు నమాజ్‌ కోసం నిబడడం. అది తరావీహ్ కోసమయినా సరే లేదా తహజ్జుద్‌ నమాజ్‌ కోసమయినా సరే. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘ఎవరయితే రమజాన్‌ మాసంలోని రాత్రిళ్లలో అల్లాహ్ ముందు విశ్వాసం, చిత్తశుద్ధితో నిబడతారో వారి గత పాపాలు క్షమించబడతాయి’.  రమజాన్‌లో తరావీహ్, ఇతర ఆరాధనలు చేసే వారికి వారు గతంలో చేసిన పాపాలు క్షమించబడతాయని ఈ హదీసులో ప్రవక్త (స) శుభవార్త ఇచ్చారు. నిశ్చయంగా ఇది మన లాంటి పాపాత్ములకు గొప్ప శుభవార్తే. అయితే ఈ ఆరాధనులు చిత్తశుద్ధితో ఆచరించాలన్నది నిబంధన. 
విశ్వాసం, చిత్తశుద్ధి ఈ రెండు ధర్మంలోని ప్రత్యేక నిర్వచనాలన్న పదాలు. వీటి అర్థం ఏమిటంటే, ఆచరణకు అసలు ప్రేరణ అల్లాహ్, ఆయన ప్రవక్త (స)ను విశ్వసించడం. అయితే ఈ క్షణంతో చేసే సదాచారాన్ని విశ్వాసం, చిత్తశుద్ధితో చేసినట్టే అవుతుంది. ఇక హదీసు భావం ఏమిటంటే, ఎవరయితే అల్లాహ్ ను, ఆయన ప్రవక్త (స)ను విశ్వసించామని, వారు చూపించిన మార్గాన్ని ఎంచుకున్నామని, ఖుర్‌ఆన్‌ మరియు హదీసుల్లో తరావీహ్ నమాజ్‌ చేయడం పుణ్య ప్రదం అని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ పుణ్యం పొందేందుకు తరావీహ్ నమాజ్‌ చేస్తున్నాని భావించి చేస్తే అలాంటి వారు గతంలో చేసిన పాపాలు క్షమించబడతాయి. 
ఒక హదీసులో ఇలా ఉంది: రాత్రి నిబడి తరావీహ్ లో ఖుర్‌ఆన్‌ చదివితే, వింటే రేపు ప్రళయ దినం నాడు దాసుని కోసం అది అల్లాహ్ వద్ద సిఫార్సు చేస్తుంది. ఇలా అంటుంది : ‘నేను ఇతన్ని రాత్రిళ్లు నిద్రపోనివ్వలేదు. కనుక ఇతని విషయంలో నా సిఫార్సు స్వీకరించు. అల్లాహ్ దాని సిఫార్సును స్వీకరిస్తాడు. అల్లాహ్ దర్బారులో ఇది మన సిఫార్సు కోసం నిబడినప్పుడు, దాని సిఫార్సు మేరకు మన పాపాలను మన్నించి, మనకు స్వర్గంలో ప్రవేశింప జేసినప్పుడే మనకు రమజాన్‌ రాత్రిళ్లలో మేల్కొని ఖుర్‌ఆన్‌ చదివిన, విన్న విలువ తెలిసివస్తుంది. 
తరావీహ్ కు సంబంధించి కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు రమజాన్‌ రాగానే చాలా ఉత్సాహంగా తరావీహ్ నమాజ్‌ చేస్తారు. వారి ఈ ఉత్సాహం కొద్ది రోజు మాత్రమే కనబడుతోంది. వీరు ఐదారు రోజులే తరావీహ్ నమాజ్‌ చేస్తారు. ఆ తరువాత మానేస్తారు మరికొందరు ఐదారు రోజుల్లోనే ఖుర్‌ఆన్‌ను పూర్తిగా వింటారు. ఇక తమకు తరావీహ్ నమాజ్‌ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇలాంటి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ రెండు సున్నత్ లు వేరు వేరుగా ఉన్నాయి. ఖుర్‌ఆన్‌ను పూర్తిగా తరావీహ్ నమాజ్‌లో వినడం ఒక సున్నత్‌. రమజాన్‌ మాసం మొత్తం తరావీహ్ నమాజ్‌ చేయడం మరో సున్నత్‌. అంటే ఐదారు రోజుల్లో తరావీహ్ నమాజ్‌ చేసి మాని వేసిన వారు ఒక సున్నత్‌ను మాత్రమే పాటించారు. మరో సున్నత్‌ను వదిలిపెడుతున్నారు. ఎవరయితే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారో లేదా పను వల్ల ఒకే చోట తరావీహ్ నమాజ్‌ చేయలేక పోతుంటారో అలాంటి వారు కొన్ని రోజులో ఖుర్‌ఆన్‌ను పూర్తిగా తరావీహ్ లో వినాలి. ఆ తరువాత ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తరావీహ్ నమాజ్‌ చేస్తుండాలి. ఇలా రెండు సున్నత్ లు కూడా ఆచరించినట్టు అవుతుంది. పనులకు కూడా భంగం కగదు. పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయంలో ఏమిటంటే, తరావీహ్ నమాజ్‌ జరుగుతున్నప్పుడు కొందరు నిర్లక్ష్యంగా, అసత్వంతో పంక్తు వెనుక మాట్లాడుతుంటారు. లేదా ఇతర అనవసరపు పనుల్లో పడిపోతారు. ఎప్పుడయితే ఇమామ్‌ ఖిరాత్‌ చేసి రుకూలోకి వెళతాడో అప్పుడు వీరు హడావిడిగా పరుగెత్తుకుంటూ వచ్చి ఇమామ్‌ వెనుక రుకూలో చేరిపోతారు. నమాజ్‌ పూర్తి చేస్తారు. ఇలా కాక్షేపంతో పాటు పుణ్యం కూడా భించిందనుకుంటారు. కాని వీరు తమ చేష్ట వల్ల ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో వీరికి తెలీదు.
ఒకటేమిటంటే, ఖుర్‌ఆన్‌ను ఏకాగ్రతతో, శ్రద్ధగా వినాడం తప్పని సరి. కాని వీరు దీన్ని నిర్లక్ష్యంతో వదిలిపెట్టారు. రెండోది, తరావీహ్ నమాజ్‌ చేస్తుండగా ఖుర్‌ఆన్‌ వినడం సున్నత్‌. దీన్నీ వీళ్లు చేయడం లేదు. మూడోది, మస్జిద్‌లలో అనవసరంగా మాట్లాడారు. ఇది కూడా పెద్ద తప్పు. వీరు మాట్లాడుకోవడం వల్ల నమాజీ ఏకాగ్రత దిబ్బతింటుంది. ఆ పాపం వేరు. ఇమామ్‌తో పాటు తహ్రీమ అనడం, రకాత్‌ కట్టుకోవడం, సనా చదవడం చేయలేదు. అంటే వారు చేసిన కొద్ది పాటి నిర్లక్ష్యం మూంగా అధిక పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. కనుక ఈ విధానాన్ని విడనాడాలి. ఇమామ్‌ నమాజ్‌ కోసం రకాత్‌ కట్టిన వెంటనే రకాత్‌ కట్టాలి. తద్వారా పాపాలకు దూరంగా ఉండవచ్చు. సున్నత్‌ ప్రకారం తరావీహ్ నమాజ్‌ చేయవచ్చు. 
అదే విధంగా ఈ రోజుల్లో ముఖ్యంగా నగరాల్లో షబీనా ధోరణి పెరిగిపోయింది. ఇలాంటి తరావీహ్ నమాజుల్లో యామూన్‌, తామూన్‌ తప్ప మరే వాఖ్యాలు అర్థం కావు. ఇలాంటి విధానాలను కూడా విడనాడాలి. ఒక వేళ ఇమామ్‌ స్పష్టంగా ఖుర్‌ఆన్‌ పఠిస్తున్నట్లయితే, ముఖ్తదీసు కూడా అసత్వాన్ని ప్రదర్శించకుండా ఏకాగ్రతతో తరావీహ్ చేస్తున్నట్లయితే ఎలాంటి అభ్యంతరం లేదు. అల్లాప్‌ా మనందరికీ ఏకాగ్రతతో తరావీహ్ నమాజ్‌ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక!
................................
రచయిత-మహమ్మద్ యాకూబ్
సెల్ నెం-93967-06460


రమజాన్ మాసంలో ఇవి ఎంతో కీలకం

రమజాన్‌ మాసం ఇంత ఘనత పొందడానికి మరో ముఖ్యకారణం ఈ మాసంలోనే ఖుర్‌ఆన్‌ అవతరించింది. ఖుర్‌ఆన్‌ 23 ఏళ్ల పాటు కొంచెం కొంచెంగా ప్రవక్త (స) మీద అవతరించింది. కనుక ఈ మాసంలో అధికంగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేయాలి. ఈ మాసంలో ఒక్క పుణ్య కార్యం చేస్తే డెబ్బై పుణ్యాలు చేసినంత ప్రతిఫం భిస్తుంది. ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తే ఒక్కో అక్షరానికి ఒక్కో పుణ్యం లభిస్తుంది. ఒక్కో పుణ్యం డెబ్బైరెట్లు పెంచబడి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేయాలి. రమజాన్‌ మొత్తం కనీసం ఒక్కసారయినా పూర్తిగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేయాలి. తరావీహ్ లో మొత్తం ఖుర్‌ఆన్‌ ఒక సారి వినాలి. అది కాకుండా మనం స్వంతంగా ఒక సారి ఖుర్‌ఆన్‌ పూర్తిగా చదవాలి. ఖుర్‌ఆన్‌, ఉపవాసాలు రెండూ అల్లాహ్ సమక్షంలో ఉపవాసి గురించి సిఫారసు చేస్తాయి. మనం పూర్తి నిష్ఠతో,చిత్త శుద్ధితో ఉపవాసాలుంటే వాటి సిఫారసుకు నోచుకోవచ్చు. మన కోసం ఖుర్‌ఆన్‌, ఉపవాసాలు సిఫారసు చేస్తాయంటే మనం ఎంతటి అదృష్టవంతులమో ఆలోచించండి! హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ అమ్ర్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ప్రవచించారు : ‘రోజా, ఖుర్‌ఆన్‌ ఇవి రెండూ దాసుని కోసం సిఫారసు చేస్తాయి. రోజా ఇలా అంటుంది: ‘ప్రభూ! నేనితన్ని ఆకలిదప్పు, మనోవాంఛలను తీర్చుకోకుండా ఆపి ఉంచాను. కనుక ఈ రోజు ఇతని విషయంలో నా సిఫారసు స్వీకరించు. ఇతని పట్ల కారుణ్యంతో వ్యవహరించు. ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ‘నేనితణ్ని రాత్రులు నిద్రకు, విశ్రాంతికి దూరంగా ఉంచాను. కనుక ప్రభూ! ఇతని విషయంలో ఈ రోజు నా సిఫారసు స్వీకరించు. దయాగుణంతో ఇతనికి మన్నింపు ప్రసాదించు. ఈ విధంగా ఆ దాసుని విషయంలో రోజా, ఖుర్‌ఆన్‌ సిఫారసులను స్వీకరించడం జరుగుతుంది. అతనికి మన్నింపును, స్వర్గాన్ని ప్రసాదించాలని నిర్ణయించడం జరుగుతుంది. 
.............................

రచయిత-మహమ్మద్ యాకూబ్
సెల్ నెం-93967-06460 


ఈ మాసంలోని ఓ రాత్రి...వెయ్యి మాసాల కన్న శ్రేష్టమైంది
శుభప్రదమైన మాసం రమజాన్



రమజాన్‌ మరో సారి తన అనంత అనుగ్రహాలను తీసుకుని వచ్చింది. దైవకారుణ్యం, దైవానుగ్రహం పొందాలనుకునే వారికి  ఈ మాసం ఎంతో శుభప్రదమైనది. హజ్రత్‌ సల్మాన్‌ ఫార్శీ (రజి) ఇలా అన్నారు. ప్రవక్త (స) షాబాన్‌ మాసం చివరి తేదీన దైవ ప్రవక్త (స) మాకు ఇలా ఉపదేశించారు: ‘ప్రజలారా! ఒక మహత్తరమైన, శుభప్రదమైన మాసం తన ఛాయను మీపై కప్పబోతోంది. ఆ పవిత్ర మాసంలోని ఒక రాత్రి వెయ్యి మాసాల కన్నా శ్రేష్ఠమైనది. ఆ మాసం ఉపవాసాలను అల్లాహ్ మీకు విధిగా చేశాడు. ఆ రాత్రుల్లో అల్లాహ్ సన్నిధిలో ఆరాధనలు చేయడం నఫిల్‌గా నిర్ణయించబడింది. ఎవరయితే ఈ మాసంలో దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి విధికానటువంటి ఒక ఆరాధన చేసినట్లయితే, అది ఇతర దినాల్లో విధిగా చెయ్యవసిన ఆరాధనతో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ మాసంలో ఒక విధిని నెరవేరిస్తే ఇతర కాలంలో 70 విధులను నిర్వహించిన దానితో సమానంగా పుణ్యం లభిస్తుంది. 
ఇది సహనం చూపవలసిన మాసం, సహనానికి ప్రతిఫలంగా స్వర్గం లభిస్తుంది. ఇది సానుభూతి చూపవలసిన మాసం. ఈ మాసంలో విశ్వాసుల ఉపాధి వృద్ధి చేయబడుతుంది. ఎవరైనా ఈ మాసంలో ఒక ఉపవాసికి ఇఫ్తార్‌ చేయిస్తే అతని పాపాలన్నీ మన్నించబడతాయి. నరకాగ్ని నుంచి విముక్తి లభిస్తుంది. అతనికి ఉపవాసం ఉన్న వారితో సమానంగా పుణ్యం కూడా లభిస్తుంది. (బైహఖీ) 
రమజాన్‌ మాసంలో చేసే ప్రత్యేక ఆరాధనల ఉపవాసం. ఈ మాసం మొదలవగానే యుక్త వయస్సుకు చేరుకున్న ప్రతి ముస్లిమ్‌ విధిగా ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ దివ్యఖుర్‌ఆన్‌ లో ఇలా ఆదేశించాడు: ‘విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడిరది` ఏవిధంగా మీకు పూర్వం ప్రవక్తను అనుసరించేవారికి కూడా విధించబడిందో. దీని వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’. (దివ్యఖుర్‌ఆన్‌ 2:183) 
ఉపవాసాల వల్ల మనిషిలో భయభక్తులు జనిస్తాయి. ఈ విషయమే ఈ ఆయత్‌లో చెప్పడం జరిగింది. మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా, గుక్కెడు మంచి నీళ్లు త్రాగకుండా కేవం అల్లాహ్ కోసం ఉపవాసం ఉంటాడు. ఉపవాసి ఎక్కడైనా చాటుగా, ఎవరూ చూడని చోటుకు వెళ్లి నీళ్లు త్రాగవచ్చు. తినవచ్చు. కాని అతను అలా చేయడు. అల్లాహ్ చూస్తున్నాడు, తాను ఉపవాసం ఉన్నాననే భయం అతన్ని ఏమీ తినకుండా త్రాగకుండా చేస్తుంది. అదే దైవభీతి.
రమజాన్‌ మాసం ప్రారంభం కాగానే స్వర్గద్వారాలు తెరువబడతాయి. నరకద్వారాలు మూసివేయబడతాయి. షైతాన్ బంధించబడతారు. ఒక హదీసులో ఇలా పేర్కొనడం జరిగింది: ‘రమజాన్‌ మొదటి రాత్రిన షైతాను, తబిరుసు జిన్నాతు బంధించబడతారు. నరక ద్వారాన్నీ మూసివేయబడతాయి. అందులో ఏ ద్వారమూ తెరిచి ఉండదు. అలాగే స్వర్గ ద్వారాన్నీ తెరిచి ఉంటాయి. ఏ ద్వారమూ మూసివేయబడదు. అల్లాహ్ తరఫున ఒక ప్రకటన కర్త, ‘మంచిని, మేలును కాంక్షించే వాడా! ముందుకు రా! చెడును కోరుకునేవాడా ఆగిపో!’ అని ప్రకటిస్తాడు. ఎంతో మంది దాసులకు అల్లాహ్ నరకాగ్ని నుంచి విముక్తి కల్పిస్తాడు. ఈ విధంగా రమజాన్‌లోని ప్రతి రాత్రి ఇలాగే జరుగుతూ ఉంటుంది’. (జామె తిర్మిజి) 
రమజాన్‌ మాసం మొదవగానే మనిషిలో ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. ముస్లిమ్‌ సమాజంలో వాతావరణం కూడా మారి పోతుంది. ఒక నెలంతా ఉండగ ఉత్సాహం కనిపిస్తుంది. ఉదయాన్నే లేవడం, సహరీ చేయడం, ఫజ్ర్‌ నమాజ్‌కు వెళ్లడం, తరువాత ఖుర్‌ఆన్‌ పారాయణం చేయడం, తరువాత కొంచెం సేపు నిద్రపోవడం, లేచి మళ్లీ దైనందిన పనుల్లో మునిగిపోవడం, సాయంత్రం మళ్లీ ఇఫ్తార్‌ ఏర్పాటు చేసుకుని, ఇఫ్తార్‌ విరమించి, మళ్లీ తరావీహ్ చదువుకోవడం ఇలా నెలంతా మనిషి కాలపట్టిక పూర్తిగా మారిపోతుంది. అల్లాహ్ ఆరాధనలో గడిచిపోతుంది. ఉపవాసం ఉన్న స్థితిలో మనిషి పూర్తిగా మారిపోతాడు. అబద్ధం పలకడు, మోసం చేయడు. ఐదు పూటలా నమాజ్‌ చేస్తాడు. ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తాడు. దాన ధర్మాలు చేస్తాడు. ఎంతో సహనం, ఓపిక కలిగి ఉంటాడు. ఎవరైనా కొట్లాటకు దిగితే ‘నేను ఉపవాసం ఉన్నాను. ఇలాంటి పనులు చేయనని’ చెబుతాడు. ఈ స్ఫూర్తి మనిషిలో ఏడాది పాటు కొనసాగాలి. అసులు రమజాన్‌ మాస ఉద్దేశం ఇదే. ఈ ఉద్దేశాన్ని తెలుసుకుని ఉపవాసాలను పాటించిన వారి ఉపవాసాలే సార్థకమవుతాయి. వారినే అల్లాహ్ అనుగ్రహిస్తాడు. 
.....................................

రచయిత- - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
సెల్ నెం-99125-80645
     
                       
            కోవిడ్ 19 కొరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఒకానొక భయానక వాతావరణంలో ఈసారి పవిత్ర రమజాన్ మాసం ప్రారంభమైంది. యావత్తు ముస్లిం సమాజానికి ఈ మాసం చాలా పవిత్రం. రమజాన్ రాకడకు కొన్ని రోజుల ముందే ముస్లిం సమాజంలో ఒక విధమైన సందడి, సంతోష వాతావరణం కనిపిస్తుంది. సంవత్సర కాలమంతా రమజాన్ రాకడ కోసం ఎదురు చూసిన ముస్లిములు, ఈ పవిత్ర మాసాన్ని అత్యంత నియమ నిష్టలతో గడపడానికి మానసికంగా సిధ్ధమవుతారు. మస్జిదులన్నీ రంగురంగుల అలంకరణలతో కళకళలాడుతూ కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. కాని ఈసారి అలాంటి పరిస్థితి లేదు. నిజంగా ఇలాంటి రోజులు వస్తాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఇలాంటి ఒక విచిత్ర పరిస్థితి రావడం కూడా ఈ తరంలో ఇదే మొదటిసారి. ఇంతకు ముందెన్నడూ ఈ తరం ఇలాంటి స్థితిని ఎదుర్కోలేదు. దీనికి కారణం మనందరికీ తెలిసిందే. మనిషి నుండి మనిషికి సంక్రమించే  కొరోనా మహమ్మారి మానవ సమాజంపై తన పంజా విసరడంతో ఈపరిస్థితి ఎదురైంది. ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నాయి. అందులో భాగంగానే సామూహిక వేడుకలు, ఉత్సవాలు, సభలు, సమావేశాలు, ప్రార్ధనలు అన్నిటినీ నిషేధించాయి. ఈ నేపథ్యంలో జాతీయ షరియా కౌన్సిల్ కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తూ, ముస్లిం సముదాయానికి దిశా నిర్దేశం చేసింది. కనుక దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత సమయంలో ఏ విధమైన ధార్మిక సభలూ, సమావేశాలు జరపరాదు. మస్జిదులో మాత్రమే చేయబడే సామూహిక నమాజులు సైతం గృహాల్లోనే వ్యక్తిగతంగా నిర్వహించుకోవాలి. అంటే, ఇళ్ళనే మస్జిదులుగా మార్చుకోవాలి. నలుగురు సమావేశమయ్యే ప్రతి సందర్భాన్నీ రద్దుచేసుకోవాలి. పవిత్ర రమజాన్ మాసంలో మాత్రమే ఆచరించబడే ప్రత్యేక ' తరావీ ' నమాజులను ఈసారి మస్జిదులలో సామూహికగా కాకుండా, ఎవరింట్లోవారు వ్యక్తిగతంగా  చేసుకోవాలి. శ్రధ్ధాభక్తులతో ' రోజా ' వ్రతాన్ని ఆచరించాలి. క్రమం తప్పకుండా ఐదు పూటలు ఇంట్లోనే నమాజు చేయాలి. లాక్ డౌన్ లో ఇంటి పట్టునే ఉండి వీలైనంత ఎక్కువగా పవిత్ర ఖురాన్ గ్రంధ పారాయణం చెయ్యాలి. తెలిసిన భాషలో ఖురాన్ ను అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. ప్రవక్త ప్రవచనాలు, ఆయన జీవిత చరిత్రను చదివి తెలుసుకోవాలి. దైవనామ స్మరణలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నైతిక, మానవీయ విలువలు తెలిపే రచనలు అధ్యయనం చెయ్యాలి. ఇంకా ఇతరత్రా మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ, లెక్కలు వేయకుండా ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించాలి. గుప్త సత్కార్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆత్మాభిమానం కారణంగా ఇతరుల ముందు నోరు విప్పలేని, చేయి చాచలేని పేదలను గుర్తించి ఆదుకోవాలి. అన్ని మాసాలకంటే రమజాన్ మాసంలో ప్రవక్త మహనీయులు అత్యధికంగా దానధర్మాలు చేసేవారు. ఈమాసంలో ఆయన గారి దాతృత్వం వీచే గాలి కన్నా ఎక్కువగా ఉండేది. అంటే, సాధారణం కంటే మించి అధికంగా దానధర్మాలు చేసేవారు. మనం కూడా అదే సంప్రదాయాన్ని అనుసరించాలి. ఈ మాసంలో చేసేదానధర్మాల పుణ్యఫలం ఇతర మాసాలతో పోల్చుకుంటే అనేక రెట్లు అధికం. దీన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, సహెరీ, ఇఫ్తార్ లకు ఇబ్బందులు పడుతున్నఅభాగ్యులను ప్రత్యేకంగా గుర్తించి ఆదుకోవాలి. వారి సహెరీ, ఇఫ్తార్ల కోసం ఏర్పాట్లు చెయ్యాలి. ఎవరైనా ఒక రోజేదారుకు ఇఫ్తారు చేయిస్తే(ఉపవాసి కి భోజనం పెడితే ), స్వయంగా ఉపవాసం పాటించే వారికి సంపూర్ణ ప్రతిఫలం దక్కడంతో పాటు, ఇఫ్తార్ చేయించిన వారికి కూడా ఉపవాసికి లభించినంత పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసికి భోజనం పెట్టలేని వారు కనీసం మజ్జిగ తాగించినా, మంచినీళ్ళు తాగించినా అదే పుణ్యం వర్తిస్తుంది. రమజాన్ ప్రత్యేకంగా పేద సాదలను ఆదుకునే మాసం. వారిపై సానుభూతి చూపేమాసం. కనుక తప్పకుండా ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించాలి.
 మసీదులో సామూహిక నమాజులు, తరావీ నమాజులు ఆచరించడం లేదు కనుక పుణ్యం అంత లభించదేమో అన్న అపోహకు గురికావద్దు..మొండిగా, అజ్ఞానంగా వ్యవహరించవద్దు. అల్లాహ్ మీ సంకల్పాలను చూస్తాడు. మీ సంకల్పం అదే కాబట్టి మస్జిదులో సామూహికంగా చేసిన పుణ్యఫలమే ప్రసాదిస్తాడు కాకపోతే  కొన్ని  ప్రత్యేక పరిస్థితుల్లో మీరు జమాతుతో, మస్జిద్ లో ఆరాధనలు చేయలేక పోతున్నారు అంతేతప్ప మరేమీ కాదు. పుణ్యఫలం మాత్రం అల్లాహ్ తప్పకుండా మీ సంకల్పానికి అనుగుణంగానే ప్రసాదిస్తాడు. ఇందులో ఎటువంటి అనుమానానికీ, అపోహలకూ తావులేదు. ఖచ్చితంగా ఇది పరీక్షా కాలమే. సహనం వహించాలి. సహనానికి ప్రతిఫలంగా స్వర్గం లభిస్తుంది. ఈ రమజాన్ మాసంలో ప్రత్యేకించి, కొరోనా మహమ్మారి నుండి మానవ సమాజాన్ని కాపాడమని, దాని మూలాలను అంతం చేయమని దీనంగా అల్లాహ్ ను వేడుకోవాలి. అల్లాహ్ సమస్త మానవాళినీ ఈ భయంకర వైరస్ నుండి రక్షించి, మంచి జీవితం ప్రసాదించాలని మనసారా కోరుకుందాం.
...............................................


సయ్యద్ నిసార్ అహ్మద్
జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు
సెల్ నెం-780 101 9343





                ఈ స్వప్నం ప్రతి భారతీయుడి హక్కు
కరోనా కు మతం రంగు పులిమి నా కలలను చిద్రం చేయకండి





చరిత్ర మొదలైన నాటి నుంచి నేటి వరకు యావత్తు ప్రపంచం నా భారతదేశం వైపు చూసిందంటే దేనికి...? యావత్తు ప్రపంచానికి నా దేశం ఆదర్శంగా నిలిచిందంటే దేనికి...? ఇలా అడిగే అనేక ప్రశ్నలకు గర్వంగా సమాధానం చెప్పేందుకు ఓ భారతీయుడిగా నాకు ఆ దమ్ముంది. ఎందుకంటే నేను చిన్న నాటి నుంచి భారతదేశం గురించి విన్నవి, మా తాత్తా, ముత్తాలు వారి తరువాత తరానికి చెప్పిన ఘటనలు అంటువంటివి. అంతేకాదు నా దేశంలో కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే వాతవరణముంది. మానవత్వం గురించి వినాలన్న, సోదరభావం నేర్చుకోవాలన్నా అందరికీ ఆదర్శం నా భారతదేశం. ఇంతటి గొప్ప చరిత్రవున్న నా భారతదేశానికి కొన్ని దుష్టశక్తుల కూయుక్తులతో ఎక్కడ మచ్చఅంటుకొంటుందోనన్న ఆందోళన కూడా కలుగుతోంది. ఆ మచ్చ అంటుకోకుండా మన దేశంలోని ప్రజలు మానవత్వం చాటుతూ, సోదరభావం వ్యక్తంచేస్తూ ఈ దుష్టశక్తుల కూయుక్తులను ఎప్పటికపుడు నిలువరిస్తూనే ఉన్నారు. అందుకే నేను విన్న భారత్ గురించి నా కళ్లతో చూడనివ్వండి. భారత్ గురించి నేను విన్న మాటలను ఆచరణలో నన్ను చూడనివ్వండి. ఎందుకంటే ఇది ఓ భారతీయుడిగా నా హక్కు.
కరోనా...కరోనా అన్న మాట యావత్తు ప్రపంచం వినిపిస్తున్న మాట. కరోనా మహమ్మరి వల్ల ఇతర దేశాల్లో వేల కొలది ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ మరణాలు లక్షకు పైగా దాటాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి అంతం చూడాలన్న నినాదాలు వస్తుంటే నా దేశంలో మాత్రం మతం రంగు పులిమి విద్వేషాలకు ఆజ్యంపోస్తున్నారు. ఎందుకు ఇలా అన్నది బోధపడన్నట్లు అనిపించినా ఇందులో కొందరి దురుద్దేశాలు లేకపోలేదని ఎవరూ కాదనలేని వాస్తవం. గత నెలలో ఢిల్లీలోని మర్కజ్ లో జరిగిన ముస్లిం మతస్థుల సమావేశాన్ని వివాదంలోకి లాగి దానివల్లే దేశంలో కరోనా పుట్టిందని, లేకపోతే అసలు మన దేశానికే కరోనా అసలు వచ్చేది కాదన్నట్లుగా చిత్రీకరణ జరుగుతోంది. ఢిల్లీలో మర్కజ్ కు వెళ్లివచ్చిన వారికి సామూహికంగా ప్రార్థనల్లో పాల్గొనడంవల్ల కరోనా ఒకరి ద్వారా ఒకరికి అంటుకొని కొన్ని కేసులు పెరగడానికి కారణం కావచ్చు. ఇది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. కానీ ఈ కేసులతోనే కరోనా పురుడుపోసుకొందని చెప్పడం అభ్యంతరకరం.

 ఇక ఉద్దేశ పూర్వకంగానే మర్కజ్ సమావేశం జరిగిందని, దేశంలో కరోనా వైరస్ జీహాద్ జరుగుతోందని కొన్ని శక్తులు పెద్ద ఎత్తున్న ప్రచారం చేశాయి. ఈ ప్రచారం విస్త్రుతంగా సాగింది. వాస్తవానికి కరోనా ఎలా పుట్టింది అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేతలు తేల్చలేకపోయారు. కానీ మన దేశంలోని కొన్ని శక్తులు కరోనాకు మతం రంగు పులమడంతో ఓ రకమైన కాలుషిత వాతావరణం మాత్రం చాపకింద నీరులా పురుడుపోసుకొంది. తాము ప్రభుత్వం అనుమతితోనే సమావేశం నిర్వహించామని మర్కజ్ నిర్వాహకులు వారి తరపు వారు కూడా వాదనలు వినిపిస్తున్నారు. అందే సందర్బంలో సామాజిక మీడియాలో రెండు రకాల వాదనలు మొదలయ్యాయి. మర్కజ్ కరోనాకు కారణమని కొందరంటే మరి కొందరు ప్రభుత్వం ఆ సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చింది అని ప్రశ్నిస్తూనే, ఇందులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం కూడా సాగింది.  అదే సందర్బంలో మర్కజ్ ఘటనకు సంబంధించి అక్కడి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు కారణం ఎవరు, తప్పు ఎవరిది అన్నది తీర్పు ఇవ్వాల్సింది కోర్టు మాత్రమే. అందుకే మనం కోర్టు తీర్పు కై ఎదురుచూద్దాం. అదే సందర్భంలో ఈ కేసులో తీర్పు ఎలావున్నా అది ఒక ఘటనగానే చూద్దాం. కరోనా వైరస్ కంటికి కనిపించనిది అని, అది ఏ రూపంలో మనిషిలోకి చేరుతుందో చెప్పలేమని యావత్తు ప్రపంచం చెబుతోంది. అందుకే కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం నేడు పోరాడుతోందన్న మాట అందరూ చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా మన దేశంలో మాత్రం కరోనా వైరస్ ఢిల్లీలో జరిగిన మర్కజ్ తోనే మొదలైందన్నట్లుగా వింత వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక్కడ నిజం ఏమిటో ఓ సారి చూద్దాం. మన దేశంలో నేరం చేసిన ముద్దాయికి సైతం తన వాదన వినిపించి తాను నిర్దోషిగా అని నిరూపించేకొనే స్వేచ్ఛవుంది. కేసుల్లో సైతం పరస్పర వాదనలను పరిశీలించాకే కోర్టు సైతం ముద్దాయి ఎవరు అన్నది తేల్చుతుంది. ఢిల్లీ మర్కజ్ ఘటనతో కొన్ని కరోనా కేసులు పెరిగివుండొచ్చు. కాదనలేం. కానీ కరోనా వైరస్ విస్తరింపజేయడమే లక్ష్యంగా  ఢిల్లీలో మర్కజ్ జరిగిందన్న రీతిలో తీర్పు  ఇచ్చే వారికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు. మరి ఢిల్లీలో జరిగిన మర్కజ్ ఘటనలో వాస్తవం ఎంతా...? ఎవరి వాదనల్లో నిజమెంతా అన్నది వినకుండా తీర్పు ఇచ్చే హక్కు ఎవరికి లేదు. ఢిల్లీ మర్కజ్ సమావేశం ద్వారా ఒక కరోనా కేసు కూడా పెరగలేదు అని చెప్పడంలేదు. మతం రంగు పులమడంపైనే ప్రధాన అభ్యంతరం. మన దేశ ప్రధాని నరేంద్రమోడీ సైతం మాట్లాడుతూ కరోనా మహమ్మారికి విశ్వాసం, రంగు, కులం, మతంతో సంబంధం లేదని, ఇది ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
ఇక్కడ మనం మరో విషయం గమనించాలి. మన దేశంలో ఢిల్లీ మర్కజ్ ఘటన కేసుల కంటే ముందే, ముస్లిం మతంతో నిమిత్తం లేకుండా ఉన్న ఇతర వర్గ ప్రజలు సైతం కరోనా భారిన పడ్డారు. అలా కరోనా భారిన పడ్డ ఇతర మతాల వారి ఉద్దేశం కూడా కరోనాను ఎవరికో అంటించాలని కాదు, ఈ దేశంలో విద్వేషాలకు బీజం వేయాలని కూడా కాదు. కంటికి కనిపించని మహమ్మరి కాబట్టి కరోనా వారికి సోకింది. వారి ద్వారా మన దేశంలోని ఇతరులకు అంటింది. ఇక మర్కజ్ ఘటనలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల మన దేశంలోని కొందరు ముస్లింలకు కరోనా వైరస్ అంటివుండొచ్చు. కానీ కరోనా వైరస్ విస్తరణ అంతా ఈ మర్కజ్ తోనే అనడం సరికాదు. అలా వితండ చర్చ మొదలైతే చైనాలో కరోనా వైరస్ విస్తరించినపుడే మన దేశంలోని అధికార యంత్రాంగం ఎందుకు మేలుకోలేదు, విదేశీలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయలేదు. మర్కజ్ ఘటన జరిగిన నాటికి చైనాలో కరోనా విస్తరిస్తున్న నాటి నుంచి దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు విదేశాల నుంచి మన దేశానికి రాకపోకలు సాగించారు. వారిలో విదేశీయులు నామమాత్రమైనా మన దేశంలోని వారు తరచుగా విదేశాలకు వెళ్లడం, ఎన్నారైలు ఇలా ఈ రాకపోకలు సాగించిన వారిలోనున్నారు. వారితో కూడా మనదేశంలో కరోనా విస్తరించింది. అలా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఉద్దేశం కూడా కరోనా విస్తరణే అని చెప్పగలమా..? ఒకవేళ అలా చెప్పినా అది తప్పే. కరోనా విస్తరించే నాటికి మన దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తెరిచేవున్నాయి. అక్కడ కూడా లక్షలాదిగా భక్తులు వచ్చిన సందర్భాలున్నాయి. ప్రజలు పాల్గొన్న ప్రతి సామూహిక కార్యక్రమంలో కరోనా విస్తరణకు ఆస్కారముంది. వాస్తవానికి కరోనా తీవ్రత తెలిశాక మన దేశంలోని దేవాలయాలు, చర్చీలు, మసీదులు, ఇతర ప్రార్థనా ఆలయాలు మూసివేశారు. ప్రజలు స్వచ్ఛందంగానే ప్రార్థనా మందిరాలకు దూరంగా ఉన్నారు. దీనినే కొందరు ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి కరోనా తీవ్రతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించివుంటే మర్కజ్ సమావేశానికి అనుమతి లభించేది కాదు. ఈ సమావేశానికి అనుమతి ఇవ్వలేదు అంటే మాత్రం ఢిల్లీలోని మర్కజ్ సమీపంలో పోలీసు స్టేషన్ ఉన్నా కూడా సమావేశం ఎలా జరిగింది అన్న చర్చ మొదలవుతుంది..? ఈ విషయాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, ప్రభుత్వాలు కూడా తన భద్రతా వైఫల్యాలను అంగీకరించాల్సివుంటుంది.  కానీ అందుకు భిన్నంగా మర్కజ్ వల్లే కరోనా విస్తరించిందని, లేకపోతే మా రాష్ట్రాలకు ఆ ముప్పే ఉండేది కాదని ప్రభుత్వంలోవున్న వారు సైతం చెబుతున్నారు. ఇది ఏ మాత్రం సబబో వారే ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైతే నేడు ఢిల్లీ మర్కజ్ వల్లే కరోనా విస్తరించింది అని చెప్పిన వారే కరోనా విస్తరణ ప్రస్తావన వచ్చినపుడు కొందరు చట్టసభలో, మరి కొందరు మీడియా ముఖంగా ఆ వైరస్ ప్రభావం మనకు లేదని, నిశ్చితంగా ఉండొచ్చని చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వంలోని పెద్దలు సైతం మర్కజ్ వల్లే కరోనా విస్తరించిందని చెప్పే ముందు తమకు ఆ వైరస్ ప్రభావం లేదని చెప్పిన లెక్కలేనితనం వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సే వస్తుంది. కానీ ఇక్కడ మనందరం ఒక్కటే గమనించాలి. ఏ ప్రభుత్వం, ఏ పాలకుడు, ఏ భారతీయుడు, ఏ మతం, కులం వారు కరోనా విస్తరించి ప్రజల ప్రాణాలు పోవాలని, తన దేశం నాశనం కావాలని కోరుకోడు. ఇక నైనా కరోనా నియంత్రణకై లాక్ డౌన్ ను అందరూ సమర్థవంతంగా పాటిద్దాం. మానవత్వం, సోదరభావానికి తమ దేశం నాడు, నేడు, ఏనాడైనా యావత్తు ప్రపంచానికే ఆదర్శం అని మన దేశం గురించి గర్వంగా చెప్పుకొనేలా మనం మెలుగుదాం. మనం దేశం గురించి ఈ దేశ ప్రజలు విన్న మాటలను ఆచరణలో చూద్దాం. ఇలాంటి స్వప్నం చూడటం ప్రతి భారతీయుడి కల. అందుకే ఓ భారతీయుడిగా నేను చూసే ఇలాంటి స్వప్నం చెరిపేసే ప్రయత్నం నిజమైన ఏ భారతీయుడు చేయడు. మన దేశంలోని ఇతర సోదరులపై భౌతిక దాడులు, వారిపై లేని విద్వేష ముద్రవేయడం దేశభక్తి కాదు. నా దేశంను కాపాడుకోవాలి, నా దేశ గొప్ప తనాన్ని, పరమత సహనం, సోదరభావం, మానవత్వం విలువలతో కూడిన ఆదర్శాలను కాపాడుకోవాలి అని పరితపించే భారతీయుడే నిజమైన దేశ భక్తుడు.
........................................



కరోనా నియంత్రణకు తనవంతు పాత్ర
ప్రజాసేవలో ఉన్న ఉద్యోగులతోపాటు....పేదలకు ఉచితంగా శానిటైజర్

కష్టకాలమైనా...ఏ కాలమైనా సేవ చేయడమే ఆయన అభిమతం. అందుకే సేవా స్వరూపిగా ఆయన పిలువబడతారు. తొలినుంచి సేవనే అలవర్చుకొన్న ఆయన తనవంతుగా సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్నది ఆయన తప్పన. సొంత జిల్లాపై మమకారం చూపుతూనే తన చుట్టువున్నసమాజంలోని ఇతరుల గురించి ఆలోచించే తత్వం. రాజకీయ రంగంలోనే కాదు...సేవా రంగంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయనే వైసీపీ నేత ఏలూరి రామచంద్రరెడ్డి. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో పరిశుభ్రత అంశం ప్రస్తుతం ఎంతో కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా చేతి శుభ్రత కోసం శానిటైజర్ పాత్రను వైద్యులు మొదలు ప్రభుత్వాలు సైతం వాటి వాడకంపై అవగాహన పెంచుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం శానిటైజర్ లభ్యత కూడా కీలకంగా మారింది. కరోనాపై సాగుతున్న పోరులో భాగంగా సొంతంగా తన కంపెనీలో శానిటైజర్ తయారు చేయించి ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసు శాఖ మొదలు వివిధ శాఖల ఉద్యోగులకు అంతేకాకుండా పేద ప్రజలకు తనవంతు సాయంగా అందజేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలే ఆయనకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టాయి.
ఇలా కష్టకాలంలో ఉన్న ప్రజలకు మరోసారి అండగా నిలిచారు వైసీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం కరోనా సంక్షోభం దృష్ట్యా  శానిటైజర్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఏకంగా రూ. 25 లక్షలు విలువచేసే శానిటైజర్ ను తన కంపెనీలో తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందజేశారు. వాస్తవానికి ఈ శానిటైజర్ మార్కెట్ కు వచ్చే సరికి వాటి ధర రెట్టింపు, అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇలా మరోసారి తన  దాతృత్వాన్ని చాటుకున్నారు ఏలూరి. ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుండే ఏలూరి....కరోనా కట్టడికి తన వంతు సాయంగా.. తనకు చెందిన ఎస్సార్సీ ల్యాబొరేటరీస్ కంపెనీలో తయారైన ఐదువేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ కు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇచ్చారు.
ఈ శానిటైజర్ ను జిల్లాలో ఉండే ఆసుపత్రుల సిబ్బంది, పోలీస్, రెవిన్యూ ఆఫీస్ సిబ్బంది అలాగే పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో అవసరమైన చోట పేదలకు ఉచితంగా శానిటైజర్ అందజేస్తానని ఆయన పేర్కొంటున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పేదలకు శానిటైజర్ అందజేయాలని ఏలూరి రామచంద్రరెడ్డికి విన్నపాలు చేస్తున్నారు. ఇదిలావుంటే విద్యార్థి దశ నుంచే సేవా భావాన్ని అలవర్చుకున్న డాక్టర్ ఏలూరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాలేజీ రోజుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు, అంతేకాదు మారుమూల పల్లెప్రాంతాల్లో ప్రైవేటు వైద్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు కూడా నిర్వహించేవారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన పలు ఉపయోగకరమైన కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువయ్యారు. యూత్ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఏలూరి..  వైద్యం తోపాటు, ప్రభుత్వాల అందించే సంక్షేమ పథకాలను పల్లె ప్రాంత ప్రజలకు చేరువచేయడంలో కృషి చేశారు.
సేవా...రాజకీయం మిళితమైన మనిషి...
వృత్తిరీత్యా డాక్టరేట్ అయిన ఏలూరి.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నసమయంలో పర్యావరణ పరిరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, పల్లె ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ కోసం శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేశారు. phd చేసిన ఏలూరి కర్ణాటక కేంద్రంగా ఎస్సార్సీ ల్యాబోరేటరీని స్థాపించారు. ఇందులో తన మార్కు హెల్పింగ్ నేచర్ ను చూపించారు. వందలాదిమంది యువతకు ఉపాధి కల్పించారు.. ఎక్కువగా గ్రామీణ ప్రాంతంవారికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు. ఫార్మా రంగంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని క్యాన్సర్ వంటి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న పేదవర్గాల వారికి ఉచితంగా మందులు ఇప్పించారు.. గత పది సంవత్సరాలుగా ఎస్సార్సీ సంస్థలో కూడా క్యాన్సర్ డ్రగ్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఏలూరి సేవలకు గాను గతేడాది hmtv , urs asia one వంటి సంస్థలు అవార్డులతో సత్కరించాయి.


అనాథ వృద్ధ మహిళకు దహన సంస్కారాలు చేసిన ఉమర్ ఫారూఖ్ ఖాన్
వెతకాల్సింది...కరోనా వైరస్ లో కనిపించని మతాన్ని కాదు
చూడాల్సింది కనిపించే మానవత్వాన్ని

మతం పేరుతో ఎవరు ఎన్ని రాజకీయాలు చేయాలని చూసిన మన దేశంలో కుల, మతాలకు అతీతంగా ప్రజలమధ్య నెలకొన్న సోదరభావం సందర్భంవచ్చినపుడల్లా తన ఓదార్యాన్ని చాటి మతోన్మాదులకు చెంపపెట్టు సమాధానం ఇస్తోంది. ఇదే మన భారతదేశం గొప్పతనం. కరోనా వైరస్ దూకుడు ప్రదర్శిస్తున్న తరుణంలో చనిపోయిన వారి పాడేమోసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. చనిపోయిన వ్యక్తికి ఎంతటి బందు గణమున్నా, ప్రజాబలమున్నా సరే ఈ కరోనా నేపథ్యంలో పాడే మోయాలంటేనే వారి బంధువులు సైతం జంకుతున్నారు.

 ఇలాంటి విపత్కర సమయంలో మానవత్వం చాటడమే కాదు హిందూ-ముస్లింల సోదర భావానికి ప్రతీకగా నిలిచారో వ్యక్తి. ఆయనే ఉమర్ ఫారూఖ్ ఖాన్. అనంతపురంజిల్లా హిందూపురంలో స్థానికంగా జరిగే ప్రతి సేవా కార్యక్రమంలో ఆయన ముందుంటారు. హిందూపరంలో ఓ అనాధ వృద్ధ మహిళకు ఆర్యవైశ్య సాంప్రదాయంతో అంత్యక్రియలకు ముస్లిం నగారా నాయకులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ సహకరించారు. ధనముంటే జాస్తి దరిద్రముంటే నాస్తి-బంధుత్వం అనే నానుడి నిజం అనే విధంగా  ప్రస్తుత పరిస్థితులు లోకంలో ఎటుచూసినా కనబడుతున్నాయి

 హిందూపురం పట్టణం లోని అంబేద్కర్ నగర్ కు ఆనుకొని ఉన్న కొల్లాపురమ్మ గుడివీధిలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నారాయణమ్మ (80)అనే వృద్దు రాలు కాపురముండేది గత రెండు రోజులు గా ఆమె బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్థానిక రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్, ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్  ఖాన్ కు సహకరించాలని కోరారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మిత్రమండలి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నారాయణమ్మ శవాన్ని దుర్వాసనతో కూడుకున్న దాదాపు శరీరంలోని సున్నిత భాగాలను చీమలు కొరికేసి ఉండగా డీడీటీ పౌడర్ స్ప్రే లతో శుభ్ర పరిచి అంబులెన్స్ వాహనంలో ఆర్యవైశ్య హిందూ స్మశాన వాటికలో ఆర్యవైశ్య సాంప్రదాయ ప్రకారం దహనం చేశారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించడం, సోదర భావాన్ని ఆచరించి చూపించడం వసుధైక కుటుంబం ఒకే తల్లి బిడ్డల్లా కలిసి మెలిసి కష్ట సుఖాల్లో కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా దేశ అభివృద్ధికి సుస్థిరతకు శాంతియుత సమాజ స్థాపనకు కృషిచేయడం ఇస్లాం శాంతియుత సందేశమని అన్నారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు ఆర్యవైశ్య సంఘం నాయకులు జేపీకే రాము, సర్కిల్ ఇన్స్ పెక్టర్ మన్సూరుద్దీన్ అందించారు ప్రముఖులు అధికారులు ఉమర్ ఫారూఖ్ ఖాన్, మిత్ర మండలికి అభినందించారు ఈ కార్యక్రమంలో షేక్ షబ్బీర్.అతీక్. నాసీర్. టైలర్ నస్రుల్లా ఖాన్. ఆలీబాయ్ .మధు సూధన్. రంగ నాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
..............................................

రచయిత-మహమ్మద్ యాకూబ్
సెల్ నెం-93967-06460


స్వయంగా ప్రవక్త మహనీయులు ఆచరించేవారు

ఒక సారి ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘ఎవరైతే విశ్వాసం, పుణ్యఫలాపేక్షతో రమజాన్‌ ఉపవాసాలు ఉంటారో వారు గతంలో చేసిన పాపాలు మన్నించబడతాయి. మరెవరయితే రమజాన్‌ రాత్రిళ్లలో విశ్వాసం, ప్రతిఫలాపేక్షతో అల్లాహ్ దర్బారులో నిలుచుంటారో వారు గతంలో చేసిన పాపాలు మన్నించబడతాయి.
హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘పగటి ఉపవాసం, రాత్రిళ్లు నిబడి నఫిల్‌ నమాజుల్లో ఖుర్‌ఆన్‌ చదవడం లేదా వినడం వల్ల రేపు ప్రళయదినాన అవి దాసుని కోసం అల్లాహ్ కు సిఫారసు చేస్తాయి. ఉపవాసం ఇలా అంటుంది: ‘ఓ ప్రభూ! ఇతను నా కోసం అన్న పానీయాలు మానేశాడు. మనో కోరికను నియంత్రించుకున్నాడు. కనుక ఇతని కోసం నా సిఫారసును స్వీకరించు. ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ‘నేను ఇతన్ని రాత్రిళ్లు నిద్ర పోనివ్వలేదు. కనుక ఇతని విషయంలో నా సిఫారసు స్వీకరించు. అల్లాహ్ వారి సిఫారసును దాసుని కోసం స్వీకరిస్తాడు. వాస్తవంగా రమజాన్‌ మొత్తం మాసం పగు ఉపవాసం ఉండాలి. రాత్రిళ్లు తరావీహ్, తహజ్జుద్‌, దైవ స్మరణ, ఖుర్‌ఆన్‌ పారాయణం, తౌబా, ఇస్తిగ్ఫార్‌లు చేస్తూ ఉండాలి.
అల్లాప్‌ా మనందరికి ఈ మాసపు ప్రాముఖ్యతను గుర్తించి, దాని పుణ్యఫలాను అందిపుచ్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక!
........................................................
రచయిత-మహమ్మద్ యాకూబ్
సెల్ నెం-93967-06460



ఇదే రమజాన్ మాసం ప్రత్యేకతలు

ఒక హదీసులో ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘రమజాన్‌ మాసంలోని ప్రతి రాత్రి ఒక ప్రకటన కర్త ఇలా ప్రకటన చేస్తాడు : ‘ఓ మంచిని కోరేవాడా! ముందుకు సాగు, ఓ చెడును ఆశించేవాడా! అక్కడే ఆగిపో’. రమజాన్‌ మాసంలో లభించే మరో భాగ్యం ఏమిటంటే, అల్లాహ్ రమజాన్‌ మాసంలో చేసే ప్రతి పుణ్యకార్యానికి అత్యధిక ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు : ‘రమజాన్‌ మాసంలో ఎవరైతే నఫిల్‌ కోవకు చెందిన ఏదైనా ఆరాధన చేస్తే దానికి రమజానేతర మాసంలో చేసిన ఫర్జ్‌కు సమానంగా పుణ్యం ప్రసాదిస్తాడు. రమజాన్‌ మాసంలో ఫర్జ్‌ కోవకు చెందిన పుణ్యకార్యం చేస్తే దానికి రమజానేతర మాసంలో డెబ్బై ఫర్జ్‌ లు చేసిన పుణ్యానికి సమానంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈ మాసంలో చేసే ఆరాధనల్లో ముఖ్యమైన ఆరాధన ఉపవాసం ఉండడం. ఇది ఇస్లామ్‌ ధర్మంలోని ఒక మూఖ్య అంశం. దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, ఒక సారి ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘ఎవరైతే ఏదైనా ధార్మిక కారణం లేకుండా రమజాన్‌ మాసంలో ఒక రోజు ఉపవాసాన్ని విరమించినట్లయితే, అతను జీవితాంతం ఆ ఉపవాసం ఉన్నప్పటికీ రమజాన్‌ మాసంలో ఒక ఉపవాసానికి లభించినంత పుణ్యాన్ని పొందలేడు. రమజాన్‌ మాసంలో ఉపవాసాలుంటే ఎన్ని శుభవార్తులు ఇవ్వబడ్డాయంటే, అవి తెలుసుకుంటే మనిషి జీవితాంతం ఉపవాసాలే ఉంటానంటాడు.
స్వయంగా అల్లాహ్ ఇలా అంటున్నాడు : ‘రోజా నా కోసం. మనిషి నా కోసం అన్నపానీయాలను, మనో కోరికలను త్యజిస్తాడు. అందుకని దానికి ప్రతిఫలాన్ని నేనే ప్రసాదిస్తాను. ఉపవాసంలో ఉన్నప్పుడు కడుపు ఖాళీగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ఉపవాసి నోటి నుంచి ఒక విధమైన దుర్వాసన వస్తుంది. దాని గురించి అల్లాహ్ ‘అది నాకు కస్తూరి సువాసన కంటే ఎంతో మేలైనది’ అని సెవిచ్చాడు.
.................................

రచయిత-ముహమ్మద్ ముజాహిద్
సెల్ నెం-96406-22076


ఈ ఏడాది రమజాన్ నెలను విచిత్రమైన పరిస్థితుల్లో జరుపుకోబోతున్నాము. బరువెక్కిన హృదయంతో రమజాన్ కు స్వాగతం పలుకుతున్నాము. ఈ విషాద వాతావరణంలో మస్జిదులు కళతప్పాయి. మస్జిదులలో తరావీహ్ నమాజులతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందే వీలులేకుండా ఉంది. మస్జిదుల్లో నమాజ్, ఖుర్ఆన్ పారాయణాల మధురిమలు, సహరీ, ఇఫ్తార్ల సందడి, వీధుల్లో రమజాన్ వెలుగులు, చిరువ్యాపారుల సందడి ఇవన్నీ పవిత్రమాసంలో ఉండే సందడి. ఎన్నో ఏళ్లుగా రమజాన్ నెలను ఎంతో సందడిగా జరుపుకుంటున్నాము. కానీ 2020 రమాజాన్ నెలలో అలాంటి సందడి కనపబడదు. ఇలా జరుపుకోవడం నిజంగా విషాదమే.
కోవిడ్ -19 విపత్తు దైవశిక్షా? పరీక్షా?...
మానవాళిపై విరుచుకుపడిన ఈ విపత్తు దైవశిక్షనా? లేక దైవ పరీక్షనా అన్న చర్చలు బాగా జరుగుతున్నాయి. ఏ విపత్తు అయినా పాపాత్ములకు శిక్షగా, విశ్వాసులకు దైవపరీక్ష అని  అంటారు; హజ్రత్ షాహ్ వలియుల్లాహ్ దహెల్వీ (అలైహిర్మాహ్) అంటారు. విశ్వాసులు ఈ విపత్తును చూసి భయపడకుండా దీన్ని దైవనిర్ణయంగా భావిస్తారు. పాపాత్ములు ఈ విపత్తును చూసి భయోత్పాతానికి గురవుతారు. దైవ కృతఘ్నతకు పాల్పడతారు. విపత్తులు, కష్టాలను వచ్చినప్పుడు ఎవరైతే తమ పాపాలను, తప్పిదాలను అల్లాహ్ ను మన్నించమని వేడుకుంటారో అలాంటి వారికి అవి పరీక్షకాలమే. ఎవరైతే విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడు దైవం వైపునకు మరలకుండా మరింత పాపపంకిలంలో కూరుకుపోతారో అలాంటి వారికిది ముమ్మాటికీ దైవాగ్రహమే అని మౌలానా అష్రఫ్ అలీ థాన్వీ అంటారు. ఈ మహావిపత్తునుంచి ఉపశమనం పొందేందుకు  మార్గాలను అన్వేషించాలి. రక్షణ చర్యలను పాటించాలి. ఈ విపత్తు వేళ మేలైన మార్గాన్ని అన్వేషించాలి.
ఈ రమజాన్ విశిష్టమైనదిగా చరిత్రలో నిలిచిపోనుంది. ప్రస్తుతం ప్రపంచం నలువైపులా ఎన్నో సున్నితమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రమజాన్ శిక్షణా మాసం అరుదెంచడం వెనుక అల్లాహ్ నిర్ణయం వెనుక ఏదో నిగూఢం దాగి ఉంటుంది. మనలో మార్పు కోసం పవిత్ర మాసాన్ని ఎలా మలచుకోవాలో, ముస్లిమ్ సమాజంలో ఏలాంటి మార్పును ఆశిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. రోజులన్నీ ఒకేలా ఉండవు. ఈ క్షణంలో ఉన్న పరిస్థితులు మరో క్షణంలో మారిపోతాయి. అది దైవనిర్ణయం. విశ్వాసులను పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయమన్న విషయం ఖుర్ఆన్ చదివితే బోధపడుతుంది. విపత్తులు, ఉపద్రవాలు, విషమ పరీక్షల్లోనూ ఏదోఒక మేలు దాగి ఉంటుందన్నది విశ్వాసి నమ్మకం. అల్లాహ్ ఎవరికైనా మేలు చేయాలనిగోరితే అతన్ని పరీక్షలకు గురిచేస్తాడు. పరీక్షల కొలిమిలో కాల్చి నికార్సయిన ముస్లిమ్ గా మారుస్తాడు. ఈ పరీక్షలు సగటు ముస్లిములో నిలకడను కలిగిస్తాయి. పరిస్థితులు ఎంతగా చేయిదాటిపోయినా విశ్వాసి దైవదాస్యానికి కట్టుబడి జీవితం గడపాలన్నది ప్రవక్త ఉద్బోధ. కరుణామయుడైన అల్లాహ్ తన దాసులపై శక్తికి మించిన భారాన్ని మోపడు. మానవ ప్రాణ రక్షణకు ఇస్లామ్ ధర్మం ఎంతో ప్రాధాన్యతనిస్తుంది.
పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం అవతరించినందుకే రమజాన్ నెలకు అంతటి విశిష్టత లభించింది. అందుకు కృతజ్ఞతగా ఉపవాసాలు పాటించాలని, ఉపవాసాల ఉద్దేశాన్ని కూడా ఖుర్ఆన్ బోధించింది. అల్లాహ్ గ్రంథం మనిషి జీవితానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను నిర్దేశిస్తుంది. ఉన్నతమైన జీవనశైలిని ప్రబోధిస్తుంది. ఇది మనిషి మేలుకోసం, ఇహపరలోకాల సాఫల్యంకోసం సృష్టికర్త రచించిన పథకమిది. ఖుర్ఆన్ నిర్దేశించిన ఈ పథకాన్ని మనజీవితంలో భాగస్వామ్యం చేసేందుకు, అంతర్భాగం చేసేందుకు స్వీయ అదుపు ఎంతో అవసరం. ఈ అదుపును సాధించాలంటే మనలో విల్ పవర్ కావాలి. దీన్నే ఖుర్ఆన్ తక్వాగా అభివర్ణించింది. తఖ్వా అంటే దైవభీతి. ఈ దైవభీతిని పెంపొందించుకునేందుకు రమజాన్ చక్కని అవకాశం. ఖుర్ఆన్-తఖ్వా-రమజాన్ అనే ముక్కోణపు సిద్ధాంతాన్ని అర్థంచేసుకోవాల్సిన అవసరముంది. రమజాన్ 30రోజుల ట్రైనింగ్ కోర్సుద్వారా ప్రపంచ ముస్లిములకు శిక్షణ ఇవ్వాలన్నదే అల్లాహ్ అభిమతం. ఈ 30రోజుల శిక్షణద్వారా దైవభీతిని సాధించాలి. దైవభీతిని పొంది ఏడాదిపాటు అల్లాహ్ ఆదేశాలను పాలించడం సులువవుతుంది. అందుకే దైవభీతికి ఖుర్ఆన్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. దైవభీతిగలవారే పరలోకంలో సాఫల్యం చెందుతారు అని ఖుర్ఆన్ శుభవార్తనిస్తుంది. ప్రాపంచిక జీవితంలోని కష్టాలను, విపత్తులను ఎదుర్కొనే ధైర్యసాహసాలు కూడా ఈ దైవభీతి ద్వారానే సాధ్యమని ఖుర్ఆన్ అంటోంది.
ఈ పవిత్ర మాసంలో ముస్లిములు దైవారాధనకు ఏకాగ్రచిత్తులవ్వాలి. విరివిగా ఖుర్ఆన్ పారాయణం చేయాలి. రాత్రుళ్లు నమాజులో సుదీర్ఘ సమయం నిల్చుని ఖుర్ఆన్ చదవాలి. దైవగ్రంథం ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటుందో తెలుసుకోగలిగాలి. ఖుర్ఆన్ బోధనల వెలుగులో ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనలో ఉన్న లోపాలు, బలహీనతలకు అల్లాహ్ ను మన్నింపు వేడుకోవాలి. ఆత్మపరిశీలనతో రమజాన్ ను గడపాలన్నది ప్రవక్త (స) వారి సందేశం.
మన బలహీనతలను, లోటుపాట్లను దూరం చేసుకునేందుకు ఉపవాసం గొప్ప ఆయుధం. ఉపవాసం వుండటం వల్ల విల్ పవర్ సాధించవచ్చు. జీవితాంతం అల్లాహ్ ప్రసన్నత పొందేందుకు మనోవాంఛలను బలివ్వాల్సి ఉంటుంది. మన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ రమజాన్ శిక్షణ ద్వారా అలవడతాయి. రోజంతా పస్తులుండటం వల్ల పేదల ఆకలి బాధ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ నెలలో జకాత్, ఫిత్రా దానాలతో నిరుపేదలను ఆదుకుంటాము. ఈ నెలలో అలవడిన ధాతృత్వం మిగతా 11నెలలూ పేదలను ఆదుకునే సహృదయత అలవడుతుంది. దైవనామస్మరణ, దుఆ (వేడుకోలు) ఇవన్నీ దైవదాసులకు ఆత్మబలాన్నిస్త్తాయి. రమజాన్ చివరి పది రోజుల్లో ముస్లిములు దైవారాధనల వేడి పెరుగుతుంది. ఏతెకాఫ్, లైలతుల్ ఖద్ర్ ఆరాధనల్లో నిమగ్నులవుతారు. ఈ నెలరోజుల శిక్షణతో శారీరక, మానసిక ప్రక్షాళనం జరుగుతుంది. ఉన్నత వ్యక్తిత్వం అలవడుతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. రమజాన్ స్పిరిట్ ను ముస్లిమ్ సమాజం తెలుసుకుంటే ప్రపంచంలో మహోన్నత స్థానంలో నిలవవచ్చు. ప్రపంచ నాయకత్వం ముస్లిముల పాదాక్రాంతమవుతుంది. మానవాళికి కారుణ్యంగా పరిణవిస్తుంది.
ఏటా మనం రమజాన్ నెలను జరుపుకునే ధోరణి.. చూసేవారికి ఒక ఉత్సవంగా కనబడుతుంది. రమజాన్ వార్షిక పండుగగా మారింది. హైదరాబాద్ లాంటి నగరాలలో ముస్లిమేతర సోదరులు రమజాన్ అంటే హలీం నెలగా భావించేలా మార్చాము. రుచికరమైన ఆహారపదార్థాలు, విద్యుత్తు వెలుగుజిలుగులతో వీధులు వెలుగొందడం ఇవన్నీ రమజాన్ ఆత్మను మరుగునపర్చాయి. ఏదో లాంఛనప్రాయంగా రమజాన్ ఆరాధనలను మొక్కుబడిగా మాత్రమే నిర్వహిస్తున్నాము. సహెరీ, ఇఫ్తార్లలో  రుచికరమైన ఆహారపదార్థాలు తినే నెలగా భావించి ఎన్నోరమజాన్ లను గడిపాము.
హిజ్రీ శకం 1441 లో జరుపుకోబోతున్న ఈ పవిత్ర మాసం గతంలోకంటే ఎంతో విభిన్నమైనది. ఈ రమజాన్ లో బజారులన్నీ మూసివేసి ఉంటాయి. హోటళ్లన్నీ మూతపడి ఉంటాయి.  ఈసారి షాపింగ్ సందడి లేదు. ఇఫ్తార్ తరువాత విద్యుత్తు వెలుగుల్లో రాత్రంతా వీధుల్లో తిరిగే అవకాశమేలేదు. ఇఫ్తార్ విందుల ఊసే లేదు. పూర్తి ఏకాగ్రతతో అల్లాహ్ వైపునకు మరలడమొక్కటే మార్గం. అల్లాహ్ చిహ్నాలపై , ఖుర్ఆన్ పారాయణంపై, నమాజులపై దృష్టిసారించే అవకాశం మాత్రం మెండుగా ఉంది. మనలో చాలామందికి ఉద్యోగాలనుంచి, పని ఒత్తిడి నుంచి కూడా వెసులుబాటు లభించింది. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికీ అంతగా పని ఒత్తిడి ఉండదు. ఈ రమజాన్ 30రోజులూ పూర్తి ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో గడపేపరిస్థితులు మెండుగా ఉన్నాయి. ఈ లాక్ డౌన్ మీ జీవితంలోనే అత్యుత్తమ రమజాన్ గా మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. మీ జీవితాన్ని మలుపుతిప్పుకునేలా ఈ రమజాన్ ను మార్చుకోండి. మనమంతా గృహనిర్భంధంలో ఉన్నాము. దైవసాన్నిహిత్యాన్ని పొందేందుకు ఇంతకు మించిన సౌభాగ్యం మరొకటుండదు. 1441 హిజ్రీలో జరుపుకునే ఈ రమజాన్ విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆశిద్దాం!
......................................

రచయిత-మహమ్మద్ యాకూబ్
సెల్ నెం-93967-06460


ఎంత అంటే నేరుగా అల్లాహ్ నే వరం ఇచ్చేంతా
ఉపవాస ప్రాశస్త్యం

ఇస్లామ్‌ ధర్మంలో నమాజ్‌, జకాత్‌ తరువాత అతి ముఖ్యమైన అంశం రోజా. హి.శ 2 లో ఇది ముస్లిముపై విధి చేయబడిరది. అల్లాహ్ దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెవిచ్చాడు: ‘విశ్వసించిన ప్రజలారా! మీపై రోజా విధి చేయబడిరది. ఏవిధంగానయితే మీ కంటే ముందు వారిపై విధి చేయబడిరదో. తద్వారా మీరు దైవభీతి పయి కావాని. (అల్‌ బఖర)
రోజా అంటే, మనిషి ప్రాత: కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాస సంక్పం చేసుకుని, అన్న పానీయాలకు, సంభోగానికి దూరంగా ఉండాలి. ఇస్లామ్‌ ధర్మంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి లభించే పుణ్య ఫలం గురించి అనేక శుభవార్తలు ఇవ్వడం జరిగింది. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు : ‘అల్లాహ్ సత్కార్యాలు, ఆరాధన పుణ్యఫలానికి ఒక కారుణ్య చట్టాన్ని ఏర్పరిచాడు. ప్రతి వ్యక్తికి అతను చేసిన ఆరాధనలను, సత్కార్యాలకు గాను దాని ప్రకారమే ప్రతి ఫలం పూర్తిగా లభిస్తుంది. కాని రోజా గురించి అల్లాహ్ ఇలా సెవిచ్చాడు : ‘ఉపవాసం దాసుడు నా కోసం ఉంటాడు. అన్నపానీయాలను, మనో వాంఛలను త్యజిస్తాడు. కనుక దీని ప్రతిఫలం ఆ సాధరణ చట్టానికి వేరుగా నా దాసునికి స్వయంగా నేనే ఇస్తాను’. ఇదే హదీసే ఖుదసీ లో ఇంకా ఇలా ఉంది : ‘ఉపవాసం మూలంగా కడుపు ఖాళీ అయినందువల్ల ఉపవాసి నోటి నుంచి ఒక విధమైన దుర్వాసన వస్తుంది. అది అల్లాహ్ కు కస్తూరి కంటే సువాసన ఇది. అంటే ఉపవాసి తాను పాటించే ఉపవాసం వల్ల అల్లాహ్ కు ఎంత ప్రీతి పాత్రుడవుతాడంటే, అతని నోటి వాసనని కూడా అల్లాహ్ ఇష్టపడతాడు. ఇది సాధారణ విషయం కాదు. ఇది ఉపవాసికి లభించే ఒక గొప్ప వరం. ఒక చోట ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘ఎవరయితే ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు ఉంటాడో వారి పాపాన్ని మన్నించబడతాయి. హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ అమ్ర్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (స) ఇలా ప్రవచించారు : ‘ఉపవాసాు ప్రళయదినం నాడు దాసుని కోసం సిఫారసు చేస్తాయి. ఇలా అంటాయి: ‘ఓ ప్రభూ! నా కారణంగా ఈ దాసుడు అన్న పానీయాకు, మనో కోరికకు దూరంగా ఉన్నాడు. కనుక ఇతని విషయంలో నా సిఫారసు స్వీకరించు. అల్లాప్‌ా దాని సిఫారసును స్వీకరిస్తాడు. ఇమామ్‌ మంజరీ (రహ్మ) తర్గీబ్‌ వ తర్హీబ్‌లో ఒక హదీసును నకు చేశారు. దాని భావం ఏమిటంటే, ఎవరయితే అల్లాప్‌ా ప్రసన్నత, సంతుష్టి కోసం ఒక రోజు ఉపవాసం ఉంటాడో అల్లాహ్ అతనికి నరకానికి మధ్య అసాధారణ దూరాన్ని పెంచుతాడు’. ఒక హదీసులో ఇలా ఉంది: ‘ఒక కట్టడంలో పునాదికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇస్లామ్‌ ధర్మంలో ఉపవాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
నిష్ఠగా ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు ఉన్నవారు అబద్దం పలుకకూడదు, చెడుకు దూరంగా ఉండాలి. దుర్భాషలాడకూడదు. అశ్లీం జోలికి వెళ్ల కూడదు. పురుషపదజాం వినియోగించకూడదు. ఎవరైనా కొట్లాటకు దిగితే ‘నేను ఉపవాసంలో ఉన్నాను’ అనాలి. లేదంటే, ఉపవాసం ఉండి కూడా లాభం ఉండదు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘ఎంతో మంది ఉపవాసులు ఉన్నారు, వారి ఉపవాసా వల్ల వారికి ఆకలి దప్పు తప్ప మరేమీ మిగవు’. మరో హదీసులో ఇలా ఉంది : ‘ఎవరయితే ఉపవాసాలు ఉండి అబద్దం చెబుతాడో, చెడుకు దూరంగా ఉండడో, అలాంటి వారు ఆకలిదప్పు ఉండడాన్ని అల్లాహ్ పట్టించుకోడు’. మరో చోట ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘ఉపవాసి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాడీలు చెప్పనంత వరకు ఉపవాసస్థితిలో ఉంటాడు. ఎప్పుడయితే అతను చాడీలు చెబుతాడో అతని రోజాలో పగుళ్లు ఏర్పడతాయి’. మరో హదీసులో ఇలా ఉంది: ‘మీలో ఎవరయితే ఉపవాసం ఉంటారో వారు అశ్లీం పలుకకూడదు. తిట్టకూడదు. ఎవరైనా తిడితే, కోట్లాటకు దిగితే, ‘నేను ఉపవాసంలో ఉన్నాను’ అని చెప్పాలి.
ప్రవక్త (స) గారి ఈ ప్రవచనాల ద్వారా తెలుస్తుందేమిటంటే, ఉపవాసాలు ఉండి చాడీలు చెప్పడం, అబద్దంమాడడం, అశ్లీం పకడం లాంటివి చేయకూడదు. ఇవి రోజాను వ్యర్థ పరుస్తాయి. ఈ కార్యాల వల్ల ఉపవాసికి లభించే పుణ్యఫలం తగ్గిపోతుంది. ఉపవాసం అంటేనే, అన్ని చెడుకు దూరంగా ఉండడం. చెడును విడనాడడం. సాధారణ రోజుల్లో సమ్మతమైన వాటికి కూడా రోజా స్థితిలో దూరంగా ఉండడం. మనం ఏది చేసినా అల్లాహ్ ఆదేశంతోనే చేస్తున్నామనే భావన మనలో ఉండాలి. అన్నపానీయాలు, ఇతర సమ్మతమైన విషయాలను విడనాడడం అన్నీ అల్లాహ్ కోసమే వదిలిపెడుతున్నామని భావించాలి. ఇదే ఉపవాస అసులు ఉద్దేశం. అందుకనే ఇఫ్తార్‌ విషయంలో సమయం అయిన వెంటనే ఇఫ్తార్‌ చేయాలని తాకీదు చేయబడింది. అల్లాహ్ అభీష్టం ఇదే.
ఈ భావనతో మనిషి ఉపవాసాలుఉండి, ఖుర్‌ఆన్‌ పారాయణం, దైవనామ స్మరణ, నఫిల్‌ నమాజులు, దాన ధర్మాలు చేస్తే దాని మీ విలువ మరింత పెరుగుతుంది. అతనికి మరింత ప్రతిఫలం లభిస్తుంది. అతను అల్లాహ్ దర్బారులో ప్రవేశ పెట్టబడేందుకు అర్హుడవుతాడు.
రమజాన్‌ నెల ప్రారంభం కాగానే ఉపవాసాలు ఉండాలి. ఎందుకంటే, ఆ తరువాత వచ్చే యేడు రమజాన్‌ నెను పొందుతామో లేదో, ఎంతో మంది మనకు తెలిసిన వాళ్లు గత రమజాన్‌లో మన మధ్యనే ఉన్నారు. కాని వారు ఇప్పుడు లేరు. కనుక ఈ రమజాన్‌నే దైవాజ్ఞు, ప్రవక్త (స) ఆదేశాలకు అనుగుణంగా గడిపేందుకు ప్రయత్నించాలి. అల్లాహ్ అనంత అనుగ్రహాను పొందాలి.
.................................................
రచయిత-మహమ్మద్ యాకూబ్
సెల్ నెం-93967-06460
నీ రాకకై ఏడాదిగా ఎదురు చూపు....రమజాను మాసమా నీకు స్వాగతం

ఏడాదిలో నీకు ఏది పవిత్ర మాసం అంటే నిజమైన ముస్లిం చెప్పేది రమజాన్ మాసం గురించే. ఎందుకంటే ఇది అల్లాహ్ నుగ్రహాల మాసం. పాప భీతి కలిగించే మాసం. వేడుకొంటే అల్లాహ్ క్షమించే మాసం. పేద వాడికి జకాత్ ద్వారా చేయాల్సిన న్యాయం గురించి నేర్పే మాసం. వినాశనానికి కారణమైన కోపాన్ని పారద్రోలే మాసం. ఇతరుల పట్ల జాలిగుణం పెంచుకొనేందుకు వీలైన మాసం. అందుకే అందరికీ ప్రీతి రమజాన్ మాసం. ఏడాదిగా ఎదురుచూసిన మనకు మళ్లీ అల్లాహ్ ను గ్రహం కలిగించేందుకు వచ్చింది. అందుకే నీకు పలుకుతున్నా మనస్సు పూర్తి స్వాగతం ఓ రమజాన్ మాసమా.
పవిత్ర రమజాన్‌ మాసం ప్రారంభంకానున్నది. ఈ మాసంలో అల్లాహ్ అనుగ్రహం, శుభాలు వర్షంలా కురుస్తాయి. ఈ ప్రపంచంలో రమజాన్‌ శుభాలు, అనుగ్రహాలను  సద్వినియోగం చేసుకోగలిగింది ప్రవక్త (స) మాత్రమే. ఆయన రమజాన్‌ రాక పూర్వమే దాని కోసం సంసిద్ధుయ్యేవారు. ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ‘రెండు నేలల ముందు రజబ్‌ చంద్రుణ్ని దర్శించుకుంటే, ‘ఓ అల్లాహ్..షాబాన్‌, రమజాన్‌ రెండు మాసాల శుభాలను మాకు ప్రసాదించు, మమ్మల్ని రమజాన్‌ మాసం వరకు చేర్చు’ అని వేడుకునేవారటా. రమజాన్‌ మాసం పూర్తయి షాబాన్‌ మాసం వస్తే ఉపవాసాలు అధికంగా ఉండేవారు. మాతృమూర్తి హజ్రత్‌ ఆయిషా (రజి) ఇలా పేర్కొన్నారు: ‘ఆయన (స) దాదపు షాబాన్ నెలంతా ఉపవాసాలు ఉండేవారు’. రమజాన్‌ నెల వస్తే ఆయన (స)కు వసంత కాలం వచ్చినట్టే. ఆయన (స) తన ప్రసంగాలు, ప్రబోధనల ద్వారా సహాబాలను ప్రోత్సహించేవారు. రమజాన్‌ శుభాలు, వరాలు పొందే దశగా వారిని ప్రోత్సహించేవారు. దాని విలువను గ్రహించేలా వారికి హితబోధ చేసేవారు.
ఇమామ్‌ ముంజరీ తర్గీబ్‌ వ తర్హీబ్‌లో తబ్రానీ ఆధారంతో హజ్రత్‌ ఉబాద బిన్‌ సామిత్‌ (రజి) ఉల్లేఖనాన్ని నకు చేశారు. ఒక సారి రమజాన్‌ మాసం వచ్చింది. ప్రవక్త (స) మాకు ఇలా సెవిచ్చారు: ‘పవిత్రమైన రమజాన్‌ మాసం వచ్చింది. ఇది శుభప్రదమైన మాసం. అల్లాహ్ ఈ మాసంలో మిమ్మల్ని తన కారుణ్యఛాయలో తీసుకుంటాడు. తన ప్రత్యేక అనుగ్రహాలను ప్రసాదిస్తాడు. మీ పాపాను మన్నిస్తాడు. మీ దుఆను స్వీకరిస్తాడు. మీరు ఈ మాసంలో ఆరాధనలను, సత్కార్యాలు చేయడంలో ఎంతగా పోటీ పడుతున్నారో చూస్తాడు. కనుక ప్రజలారా! ఈ పవిత్ర మాసంలో మీరు సత్కార్యాలు, మంచి పనులు చేయండి. కారుణ్యప్రదమైన ఈ మాసంలో అల్లాహ్ కారుణ్యానికి నోచుకోని వాడు ఎంతో దురదృష్టవంతుడు. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఇలా ఉల్లేఖించారు: ‘ఒక సారి రమజాన్‌ మాసం వచ్చింది. ప్రవక్త (స) సహాబాలనుద్దేచ్చింది ఇలా ప్రబోధించారు: ‘ మీ వద్దకు రమజాన్‌ వచ్చింది. ఇది శుభప్రదమైన మాసం. అల్లాహ్ ఈ మాసంలో ఉపవాసం ఉండడం మీపై విధి చేశాడు. ఈ మాసంలో స్వర్గద్వారాలు తెరువబడతాయి. నరకద్వారాలు మూసివేయబడతాయి. తబిరుసు షైతాను బంధించబడతారు’. (మిష్కాత్‌, ముస్నద్‌ అహ్మద్‌) రమజాన్‌ మాసం రాగానే నరక ద్వారాలు మూసివేయబడడం, స్వర్గ ద్వారాలు తెరువబడడం, షైతాను బంధించబడడం గురించి హజ్రత్‌ షాహ్ వలియుల్లాహ్ ముహద్దిస్‌ దహ్లవీ (రహ్మ) ఇలా వివరించారు : ‘ఇది కేవం రమజాన్‌ మాసాన్ని పొంది, దుశ్చేష్టలకు దూరంగా ఉంటూ, నరకాగ్ని నుంచి రక్షణ పొందడానికి, స్వర్గాన్ని పొందడానికి ప్రయత్నించే విశ్వాసు కొరకు మత్రమే. అలాంటి వారి కోసమే స్వర్గద్వారాలు తెరువబడతాయి. స్వర్గాన్ని పొందడానికి చేయాల్సిన ఆచరణ భాగ్యం వారికి ప్రాప్తమవుతుంది. వారికి తమ తమ పరిస్థితులు, ఆచరణల ప్రకారం స్వర్గవాసుని నిర్ణయించడం జరుగుతుంది. ఇలా పశ్చాత్తాపం, ఇస్తిగ్ఫార్‌ భాగ్యం ప్రసాదించి, వారి కోసం నరక ద్వారాలను మూసివేయడం జరుగుతుంది. అల్లాహ్ కారుణ్యం వారిని ఎలా రక్షిస్తుందంటే, ఈ పవిత్రమైన మాసంలో షైతాను వారిపై ఆధిపత్యం చలాయించలేరు. అల్లాహ్ వారిని ఈ మాసంలో ఎలా బంధిస్తాడంటే, వారు విశ్వాసిపై ఏ రకంగానూ దాడి చేయలేరు.
........................................
........................................

సిరిసిల్లలో రక్త దానం చేసిన జానోజాగో నేతలు
లైఫ్ సేవర్ సంస్థ సైతం రక్త దానం 

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జానోజాగో సంఘం నేతలు, కార్యకర్తలు రక్త దానం కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారంనాడు రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో లైఫ్ సేవర్ సంస్థ ఆధ్వర్యంలో రక్తధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా జానోజాగో సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మేహెరాజ్ హుస్సేన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు సమీద్ పాల్గొన్నారు. వారి నాయకత్వంలో జానోజాగో సంఘం నేతలు, కార్యకర్తలు సైతం రక్తధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు లైఫ్ సేవర్ సంస్థ సభ్యులు ఆఫాన్, ముబిన్, తాజ్ సలామ్, మతిన్, ఇస్మత్ తదితరులు పాల్గొన్నారు.

 లాక్ డౌన్ అత్యవసర సమయంలో ఇండ్లలోనే ప్రజలు ఉండి ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా జానోజాగో సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మెహరాజ్ హుస్సెన్ అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్డుపైకి రావద్దని ఆయన కోరారు. రంజాన్ మాసం ప్రార్థనలను ముస్లిం సోదరులు ఇండ్లలోనే చేసుకోవాలని కోరారు. సేవా కార్యక్రమాల్లో జానోజాగో సంఘం సభ్యులు పాల్గొన్నాలని ఆయన పిలుపునిచ్చారు. భౌతిక దూర పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ ఈ సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన కోరారు.
.....................................

లాక్ డౌన్ వేళ ప్రజల అవసరాలు తీర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి
మతం పేరుతో వివక్ష చూపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ డిమాండ్
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో పోలీసుల దెబ్బలు తాళలేక మొహమ్మద్ గౌస్ అనే యువకుడు చనిపోయిన ఘటనపై సమగ్ర ధర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదని వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. లాక్ డౌన్ వేళ ప్రజల నిత్యవసరాలను గుర్తించి వాటిని తీర్చడంపై ప్రభుత్వం శ్రద్ద వహించాలని ఆయన కోరారు. ప్రజల నిత్యవసరాలు తీర్చితే వారు రోడ్డెక్కే పరిస్థితి రాదని పేర్కొన్నారు. మెడికల్ అవసరాల కోసం మొహమ్మద్ గౌస్ రోడ్డుపైకి వచ్చాడని, కానీ పోలీసుల దాడి లో అతడు మరణించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరణించిన గౌస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఢిల్లీలోని మర్కజ్ ఘటనను ప్రస్తావిస్తూ కొందరు ముస్లింల పట్ల వివక్షచూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముస్లింలంటే వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారని, నిత్యవసరాలు అమ్ముకొని జీవించే ముస్లిం చిరు వ్యాపారులను వ్యాపారం చేసుకోనివ్వకుండా అడ్డుకొంటున్నారని విమర్శించారు. ఇలాంటి వివక్షకు కారణమవుతున్న వారిపై క్రిమినల్ కేసులునమోదు చేసి సమాజంలో మంచి వాతావరణం తీసుకురావాలన్నారు. ఈ వివక్ష పెట్రేగకముందే ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ఇండ్లకే పూర్తిగా పరిమితమై లాక్ డౌన్ ను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం భావిస్తున్న లాక్ డౌన్ ఉద్దేశాన్ని గుర్తించి ప్రజలు కూడా సహకరించి కరోనా వైరస్ నియంత్రణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. కరోనా నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ పై పోరు కేవలం ప్రభుత్వానిదే కాదని, ప్రజల నుంచి కూడా సహకారం అందాలన్నారు. రంజాన్ మాసం ప్రార్థనలు ముస్లిం సోదరులు ఇండ్లలోనే చేసుకోవాలన్నారు. ఏ మత ధార్మిక కార్యక్రమమైనా వ్యక్తిగతంగా భౌతిక దూరం పాటిస్తూ ఇండ్లలోనే చేసుకోవడం ఉతమమైందని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో ప్రజలకు రోడ్డెక్కడంపై వాస్తవాలు తెలుసుకొని పోలీసు వారు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లాఠీతో బాదడమే సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. ఆకతాయిల విషయంలో చట్టపరంగా పోలీసులు కఠిన వైఖరి అవలంభించాలని ఆయన కోరారు.